ఎన్టీఆర్, చంద్రబాబు హయాంలోనే బీసీలకు నాయకత్వ పగ్గాలు

 *- ఎన్టీఆర్, చంద్రబాబు హయాంలోనే బీసీలకు నాయకత్వ పగ్గాలు* 


 *- టీడీపీ అంటేనే వెనుకబడిన వర్గాలు* 

 *- చేతివృత్తులను ప్రోత్సహించిన చంద్రబాబు* 

 *- బీసీలకు అండగా నిలిచి పోరాడుతున్నాం* 

 *- టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శిష్ట్లా లోహిత్*


 బుట్టాయిగూడెం/ కొవ్వూరు, డిసెంబర్ 1 (ప్రజా అమరావతి): ఎన్టీఆర్, చంద్రబాబునాయుడు హయాంలోనే బీసీలకు నాయకత్వ

పగ్గాలు అందాయని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, కార్యకర్తల సంక్షేమ నిధి కోఆర్డినేటర్ శిష్ట్లా లోహిత్ చెప్పారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో రెండవ రోజు పర్యటనలో ఉన్న చంద్రబాబుకు అడుగడుగునా ప్రజలు ఘనస్వాగతం పలుకుతున్నారు. గురువారం చింతలపూడి నుండి ప్రారంభమైన రోడ్ షోలో చంద్రబాబుతో కలిసి శిష్ట్లా లోహిత్ పాల్గొన్నారు. రోడ్ షో అనంతరం బీసీల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ బీసీల అభివృద్ధికి చేస్తున్న కృషిని చంద్రబాబు వివరించారు.

అనంతరం శిష్ట్లా లోహిత్ మాట్లాడుతూ బీసీలందరూ ఆత్మబంధువులేనని చంద్రబాబు స్పష్టం చేశారన్నారు. తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అని, బీసీలంటే తెలుగుదేశం పార్టీ అని చెప్పారు. వెనుకబడిన వర్గాలకు ఎటువంటి ఆధారం లేకపోవడం వల్ల వారు సామాజికంగా, ఆర్ధికంగా, రాజకీయంగా ఎదగలేకపోయారన్నారు. తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుండి బీసీ వర్గాలకు అన్నిరంగాల్లో సముచిత న్యాయం లభిస్తోందన్నారు. బీసీలు ఎక్కువగా చేతివృత్తులు, కుల వృత్తులు, వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తుంటారని, ప్రస్తుత పరిస్థితుల్లో ఆధునికీకరణ వల్ల బీసీల స్థితిగతులు దెబ్బతిన్నాయన్నారు. ఎన్టీఆర్, చంద్రబాబులు అట్టడుగున ఉన్న బీసీ వర్గాలను ఆదుకుంటూ వారికి అండగా నిలిచారన్నారు. బీసీ వర్గాలకు చెందిన ఎర్రన్నాయుడు, దేవేంద్రగౌడ్, యనమల రామకృష్ణుడు, కేఈ కృష్ణమూర్తి వంటి ఎంతో మందికి తెలుగుదేశం పార్టీ నాయకత్వ బాధ్యతలను అప్పగించిందన్నారు. బీసీలు అంచెలంచెలుగా ఎదగాలని చంద్రబాబు ఆకాంక్షిస్తున్నారని తెలిపారు. బీసీలు ఎదిగితే వారిని వెతుక్కుంటూ వస్తానని చంద్రబాబు ప్రకటించడం శుభపరిణామమన్నారు. తెలుగుదేశం పార్టీలో బీసీలకే అత్యధికంగా పదవులను కేటాయించడం జరుగుతోందన్నారు. బీసీలు ఆర్ధికంగా అభివృద్ధి చెందితేనే వారికి సామాజిక గుర్తింపు లభిస్తుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే బీసీ కులాల అభ్యున్నతికి ఆదరణ పథకాన్ని అమలు చేశారన్నారు. బీసీలు నేటికీ అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని చెప్పారు. బీసీలు ఆర్ధికంగా, రాజకీయంగా, సామాజికంగా ఎదగాలంటే ఎటువంటి నిర్ధిష్టమైన కార్యక్రమాలు చేపట్టాలో తెలపాలని చంద్రబాబు బీసీ నేతలకు పిలుపునిచ్చారన్నారు. బీసీ సామాజిక వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలను 'ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి' అనే కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికీ వెళ్ళి తెలియజేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు మాయ మాటలు చెప్పి వారిని నట్టేట ముంచిందన్నారు. కులాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధిని పొందుతున్నారన్నారు. బీసీలను అణగదొక్కడమే లక్ష్యంగా పనిచేస్తున్నారన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీల అభ్యున్నతి, సంక్షేమానికి అవసరమైన అన్ని కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని శిష్ట్లా లోహిత్ చెప్పారు.

Comments