*పాఠశాలకు వెళ్లి... పాఠాలు బోధించి...*
పార్వతీపురం/కురుపాం, డిసెంబరు 20 (ప్రజా అమరావతి): జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ కురుపాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చేపట్టిన నాడు నేడు పనులను మంగళ వారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పనులు వేగవంతం చేసి అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు ఆహ్లాదకర వాతావరణం నెలకొల్పాలని ప్రభుత్వం నాడు నేడు పనులను చేపట్టిందని పేర్కొన్నారు.
*పాఠాలు బోధించి*
నాడు నేడు పనులు తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ విద్యార్ధుల విద్యా ప్రమాణాలు పరిశీలించారు. పదవ తరగతి విద్యార్థుల వద్దకు వెళ్లి వారు నేర్చుకున్న అంశాలపై వారికి గల అవగాహనను పరిశీలించారు. బోర్డుపై పాఠాలను బోధించారు. ఇష్టంతో చదవాలని విద్యార్థులకు ఉద్బోధించారు. ఉన్నత లక్ష్యాలను పెట్టుకోవాలని, వాటిని సాధించే వరకు విడిచి పెట్టరాదని ఆయన సూచించారు. రానున్న పరీక్షలలో మంచి మార్కులు సాధించుటకు ఇప్పటి నుండే చక్కగా చదవాలని పేర్కొన్నారు. బాగా చదువు కోవడం వలన ఒత్తిడి ఉండదని, పరీక్షలు ఆత్మవిశ్వాసంతో రాయవచ్చని తెలిపారు. చదువుతో పేదరికాన్ని జయించవచ్చని, సమాజంలో పరపతి ఉంటుందని ఆయన అన్నారు. జీవితాలను శోభాయమానంగా మలచుకోవాలని అందుకు ప్రతి అడుగు ప్రగతి దిశగా వేయాలని ఆయన సూచించారు. విద్యార్ధులకు కెరియర్ గైడెన్స్ కు ఉపయోగ పడే పలు అంశాలను తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
addComments
Post a Comment