ఆసుప‌త్రిలో కోలుకున్న తాటిపూడి గురుకుల విద్యార్ధినులు

 


ఆసుప‌త్రిలో కోలుకున్న తాటిపూడి గురుకుల విద్యార్ధినులు



జిల్లా క‌లెక్ట‌ర్ ఆదేశాల‌తో అధికారుల స‌హాయ‌క చ‌ర్య‌లు - జిల్లా అధికారుల ప‌ర్య‌వేక్ష‌ణ‌


 


విజ‌య‌న‌గ‌రం(తాటిపూడి), డిసెంబ‌రు 02 (ప్రజా అమరావతి):


జిల్లాలోని ఎస్‌.కోట మండ‌లం తాటిపూడి ఏ.పి.గురుకుల పాఠ‌శాల‌లో గురువారం రాత్రి అస్వ‌స్థ‌త‌కు గురైన విద్యార్ధినులంతా పూర్తిగా కోలుకున్నారు. జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి ఏ.సూర్య‌కుమారి ఆదేశాల‌తో అప్ర‌మ‌త్త‌మైన జిల్లా అధికారులు అస్వ‌స్థ‌త‌కు గురైన విద్యార్ధినుల‌ను త‌క్ష‌ణం ఎస్‌.కోట ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లించి వారికి  చికిత్స అందించ‌డంతో విద్యార్ధినులు శుక్ర‌వారం ఉద‌యం క‌ల్లా పూర్తిగా కోలుకున్నారు. గురువారం రాత్రి కడుపునొప్పి, వాంతులు, విరేచ‌నాల‌తో బాధ‌ప‌డుతున్న‌ట్టు తెలియ‌డంతో ప‌ది మంది విద్యార్ధినుల‌ను పాఠ‌శాల ప్రిన్సిపాల్ రాత్రి ఎస్‌.కోట ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఈ స‌మాచారం తెలుసుకున్న జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి సూర్య‌కుమారి ఆయా విద్యార్ధినుల‌కు పూర్తిస్థాయి చికిత్స అందించేలా ప‌ర్య‌వేక్ష‌ణ చేయాల‌ని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా.ఎస్‌.వి.ర‌మ‌ణ‌కుమారి, ఆసుప‌త్రుల జిల్లా కోఆర్డినేట‌ర్ డా.జి.నాగ‌భూష‌ణ రావుల‌ను ఆదేశించ‌డంతో వారిద్ద‌రూ ఎస్‌.కోట ఆసుప‌త్రికి వెళ్లి విద్యార్ధినుల‌కు అందిస్తున్న చికిత్స‌ను ప‌ర్య‌వేక్షించారు. మ‌రోవైపు రెవిన్యూ డివిజ‌న‌ల్ అధికారి ఎం.వి.సూర్య‌క‌ళ కూడా ఆసుప‌త్రికి చేరుకొని విద్యార్ధినుల‌కు అందిస్తున్న చికిత్స‌ను తెలుసుకున్నారు. ఆసుప‌త్రిలో చేరిన ప‌దిమంది విద్యార్ధినుల్లో న‌లుగురు ప్రాథ‌మిక చికిత్స అనంత‌రం కోలుకోవ‌డంతో వారిని శుక్ర‌వారం ఉద‌యం గురుకుల పాఠ‌శాల‌కు త‌ర‌లించార‌ని, మ‌రో ఆరుగురు విద్యార్ధినులు కూడా కోలుకున్న‌ప్ప‌టికీ వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో వుంచి చికిత్స అందించే నిమిత్తం శ‌నివారం వ‌ర‌కు ఆసుప‌త్రిలో వుంచుతున్న‌ట్టు డి.ఎం.హెచ్‌.ఓ ర‌మ‌ణ‌కుమారి చెప్పారు. విద్యార్ధినుల ఆరోగ్యం గురించి ఎలాంటి ఆందోళ‌న అవ‌స‌రం లేద‌ని వారంతా పూర్తి  ఆరోగ్యంతో వున్న‌ట్టు పేర్కొన్నారు.



Comments