నేరుగా ప్రజల వద్దకే సంక్షేమ పథకాలు చేరుస్తున్న జగన్ -- మంత్రి జోగి రమేష్.



గూడూరు (రామన్నపేట): జనవరి 22 (ప్రజా అమరావతి);


*రూ.2.12 కోట్ల విలువైన పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేసిన మంత్రి*


నేరుగా ప్రజల వద్దకే సంక్షేమ పథకాలు చేరుస్తున్న జగన్      

        -- మంత్రి జోగి రమేష్.



          రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజల సంక్షేమాభివృద్ధికి నేరుగా వారి చెంతకే నవరత్న పథకాలను చేరుస్తున్నారని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు.


          ఆదివారం ఆయన గూడూరు మండలం, ఐదుగుళ్ళపల్లి సచివాలయం పరిధిలోని రామన్నపేట గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల ద్వారా గ్రామస్థులకు అందిస్తున్న లబ్ధి వివరాల కరపత్రాలను అందించి వివరించారు. మంత్రి ఒక పక్క గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తూనే మరోపక్క రూ.2.12 కోట్ల విలువైన పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. రామన్నపేటలో రూ.21.80 లక్షల నిధులతో నిర్మించిన రైతు భరోసా కేంద్రం, రూ.42.80 లక్షలతో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘ భవనంతో పాటు ప్రహరీ గోడ, రూ.82.05 లక్షలతో అంతర్గత సిమెంట్ రోడ్లు, రూ.25.50 లక్షలతో ఆర్డబ్ల్యూఎస్ పైపులైన్ తో పాటు చెరువుకు ర్యాంపు నిర్మాణం, దాతల సహకారంతో నిర్మించిన ఆర్ఓ ప్లాంట్ లను ప్రారంభోత్సవం చేయగా రూ.40 లక్షల నిధుల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న మార్కెట్ యార్డు గోడౌన్ కు మంత్రి శంకుస్థాపన చేశారు. 


          అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేస్తున్నారన్నారు. అమ్మఒడి పథకం నుంచి పింఛన్ల వరకు వివిధ సంక్షేమ పథకాలను అమలు చేస్తూ వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజల గడప వద్దకే చేరుస్తున్నారని మంత్రి కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం అర్హులకు ఇస్తున్న పథకాలు లబ్ధిదారులకు చేరుతున్నాయో లేదోనని ప్రజా ప్రతినిధులు వాకబు చేసేలా గడపగడపకు మన ప్రభుత్వం అనే గొప్ప కార్యక్రమం చేపట్టిందన్నారు. గ్రామానికి జలజీవన్ మిషన్ పథకం ద్వారా ఇంటింటికి మంచి నీటి కొళాయి కనెక్షన్ ఇవ్వడంతో పాటు రూ.75 లక్షల నిధులతో రామన్నపేట గ్రామానికి వచ్చే ప్రధాన రహదారిని పునరుద్దిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.


          తొలుత గ్రామానికి విచ్చేసిన మంత్రికి గ్రామస్తులు గజమాలలతో ఘన స్వాగతం పలికారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలతో పాటు గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


          ఈ కార్యక్రమంలో  గూడూరు ఎంపిపి సంగా మధుసూదన రావు, గూడూరు జెడ్పిటీసి వేముల సురేష్ వెంకట రంగబాబు, సర్పంచి మురాల కవిత, గూడూరు మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గొరిపర్తి రవి,వర్కింగ్ ప్రెసిడెంట్ మోటేపల్లి రత్నరావు, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ కారుమంచి కామేశ్వరరావు, తలుపుల కృష్ణారావు, ఆర్బీకే చైర్మన్ లుక్కా ఏలేషు, పిఎసిఎస్ చైర్మన్ మురాల వెంకటప్పయ్య,వైస్ ఎంపీపీ నేతల కుటుంబ రావు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, పెడన ఇంచార్జీ, గూడూరు మండల ఎంపీడీవో డి. సుబ్బారావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, తదితరులు పాల్గొన్నారు.


Comments