రూ. 15 కోట్లతో రాజాం - పాలకొండ రోడ్డు పనులు/రాజాంలో రోడ్ల విస్తరణ పనుల్ని సమన్వయంతో చేపట్టాలి/అధికారులకు మంత్రి బొత్స సత్యనారాయణ ఆదేశాలు
రూ.20 కోట్లతో రోడ్ల విస్తరణకు మంత్రి శంకుస్థాపన/విస్తరణ పనులకోసం మరో రూ.10 కోట్లకు ప్రతిపాదనలు
విస్తరణలో భవనాలు కోల్పోయిన వారికి నగదు రూపంలో చెల్లింపులు -సమీక్షలో మంత్రి బొత్స వెల్లడి
విజయనగరం, జనవరి 18 (ప్రజా అమరావతి):
రోడ్లుభవనాల శాఖ ఆధ్వర్యంలో రాజాం పట్టణంలో విజయనగరం - పాలకొండ రోడ్డు విస్తరణ పనులకు ప్రభుత్వం మంజూరు చేసిన రూ.20 కోట్లకు అదనంగా మరో రూ.10 కోట్లు కట్టడాలు, భవనాలకు నష్టపరిహారం చెల్లింపు, తాగునీటి పైపులైన్ల మార్పిడి, విద్యుత్ స్థంభాలు, లైన్ల మార్పిడి చేసేందుకు అవసరమని గుర్తించామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. ఈ మేరకు అవసరమైన నిధులను ప్రభుత్వం ద్వారా మంజూరు చేసేందుకు ప్రయత్నిస్తామని వెల్లడించారు. ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు, పట్టణ ప్రముఖులతో సంప్రదించి, వారితో సమన్వయంతో పనిచేయడం ద్వారా రోడ్ల విస్తరణ పనులను సకాలంలో పూర్తిచేసేందుకు అధికారులు కృషిచేయాలని మంత్రి ఆదేశించారు. రాజాం పట్టణంలో ఆర్ అండ్ బి ఆధ్వర్యంలో చేపట్టనున్న నాలుగు కిలోమీటర్ల రోడ్ల విస్తరణ పనులకు మంత్రి బుధవారం రాజాం పట్టణంలోని డా.బి.ఆర్.అంబేద్కర్ కూడలి వద్ద శంకుస్తాపన చేశారు. అనంతరం స్థానిక సూర్యదుర్గ కళ్యాణమండపంలో ప్రజాప్రతినిదులు, జిల్లా అధికారులతో రోడ్డువిస్తరణ పనులపై సమీక్ష నిర్వహించారు.
రోడ్డు విస్తరణలో భవనాలు, కట్టడాలు కోల్పోయిన వారికి రూ.3 కోట్ల వరకు చెల్లించాల్సి వుంటుందని, ఇళ్లు, భవనాలు కోల్పోతున్న వారు పరిహారం నగదు రూపంలో చెల్లించాలని కోరుకుంటున్నారని పట్టణ ప్రణాళిక అధికారి మంత్రికి వివరించారు. ప్రభుత్వం ద్వారా పరిహారం నగదు రూపంలో చెల్లింపులకు అవకాశం వుంటే పరిశీలిస్తామని, లేనిపక్షంలో టి.డి.ఆర్.బాండ్లు జారీచేసి అనంతరం వాటిని నగదుగా మార్చుకొనే అవకాశం కల్పిస్తామన్నారు. విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో రూ.2.6 కోట్ల మేరకు విద్యుత్ స్థంభాలు, లైన్ల మార్పిడికి అవసరం వుంటుందని అంచనాలు రూపొందించినట్లు విద్యుత్ పంపిణీ సంస్థ అధికారులు వివరించారు. గ్రామీణ నీటిసరఫరా విభాగం ఆధ్వర్యంలో పైప్లైన్ల మార్పిడి కోసం రూ.3 కోట్లు అవసరం వుంటుందని ఆ శాఖ ఎస్.ఇ. ఉమాశంకర్ వివరించారు. ప్రజారోగ్య ఇంజనీరింగ్ శాఖకు చెందిన తాగునీటి డిస్ట్రిబ్యూషన్ మెయిన్ల మార్పుకోసం మరో రూ.3.20 కోట్లు అవసరం వుంటుందని అంచనాలు రూపొందించినట్లు ఆ శాఖ డి.ఇ. తెలిపారు.
రోడ్లు విస్తరణ పనుల్లో భాగంగా రెండు కిలోమీటర్ల మేరకు డ్రెయిన్ల నిర్మాణం చేపట్టేందుకు ఎలాంటి ఆటంకాలు లేనందువల్ల ముందుగా డ్రెయిన్ల పనులు ప్రారంభించాలని రోడ్లు భవనాల శాఖ ఇ.ఇ. రమణను మంత్రి ఆదేశించారు. ఈలోగా బాధితులకు పరిహారం చెల్లింపు వంటి పనులు పూర్తి చేయాలన్నారు. విస్తరణలో భాగంగా పైప్లైన్లు, విద్యుత్ లైన్ల మార్పు కోసం నిధులు అవసరమైన ప్రభుత్వ శాఖలు తమ ప్రతిపాదనలు జిల్లా కలెక్టర్ కు సమర్పించాలని మంత్రి సూచించారు. రాజాంలో రోడ్ల విస్తరణ పనులు పదిహేను నెలల్లో పూర్తిచేసేందుకు చర్యలు చేపడుతున్నామని, అధికారులంతా రాజాం పట్టణ అభివృద్ధికి చిత్తశుద్ధితో సహకరించాలన్నారు. పట్టణానికి చెందిన ప్రముఖులు, ప్రజలంతా పట్టణాభివృద్ధికోసం చేపట్టే కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని కోరారు. బొబ్బిలి జంక్షన్కు సమీపంలో అవసరమైన మరో కల్వర్టు నిర్మాణాన్ని కూడా విస్తరణ పనుల్లో భాగంగా చేపట్టేందుకు నిధులు మంజూరు చేయిస్తామన్నారు.
రాజాం నుంచి పాలకొండ రోడ్డును కూడా రూ.15 కోట్లతో పటిష్టం చేసేందుకు ప్రతిపాదనలు రూపొందించామని త్వరలో ప్రభుత్వం ద్వారా నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించేందుకు చర్యలు చేపడతామన్నారు. రాజాం ప్రాంత అభివృద్ధికి చిత్తశుద్ధితో సహకరిస్తామన్నారు.
సమావేశంలో జిల్లాపరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ.సూర్యకుమారి, ఎం.పి. బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యే కంబాల జోగులు, ఎం.ఎల్.సి. పాలవలస విక్రాంత్, శ్రీకాకుళం జెడ్పీ వైస్ ఛైర్మన్ సిరిపురపు జగన్మోహన్, కళింగ కార్పొరేషన్ ఛైర్మన్ పేడాడ తిలక్, ఆర్.డి.ఓ. అప్పారావు, గ్రామీణ నీటిసరఫరా ఎస్.ఇ. ఉమాశంకర్, రోడ్లు భవనాల శాఖ ఇ.ఇ. బి.వి.రమణ, జె.ఇ. నాగభూషణ్, మునిసిపల్ కమిషనర్ కృష్ణారావు, తహశీల్దార్ విజయభాస్కర్, ఎంపిడిఓ ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవాణాశాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న రోడ్లు భద్రత వారోత్సవాల పోస్టర్లను మంత్రి, జిల్లా కలెక్టర్ తదితరులు ఆవిష్కరించారు.
addComments
Post a Comment