మంగళగిరి, ఏపీఐఐసీ టవర్స్
వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయం (ప్రజా అమరావతి);
*ఆరోగ్యశ్రీ ఆస్పత్రులపై నిఘా అవసరం*
*సేవల నాణ్యతపై దృష్టి పెట్టండి*
*ఆరోగ్యశ్రీ కోసం సిఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఖర్చు రూ.10వేల కోట్లు*
*టీడీపీ ప్రభుత్వంలో చేసిన ఖర్చు కేవలం రూ.5100 కోట్లు మాత్రమే*
*ఆస్పత్రుల్లో ఆరోగ్య శ్రీ పోస్టర్లుండాలి*
*ఈహెచ్ ఎస్ లబ్ధిదారులకు సమస్యలు లేకుండా చూడండి*
*ఆరోగ్య ఆసరా ద్వారా పేద రోగులకు ఎంతో మేలు*
*108 వాహనాల సేవల్లో వినూత్న మార్పులు*
*గిరిజన ప్రాంతాల్లో అంబులెన్సుల పెంపునకు చర్యలు తీసుకోండి*
*రోగులకు మరింత మెరుగైన సేవలందించేలా చర్యలు*
*రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖా మంత్రి విడదల రజిని*
*ఆరోగ్యశ్రీపై పూర్తి స్థాయి సమీక్ష*
ఆరోగ్యశ్రీ ఆస్పత్రులపై నిఘా ఉంచాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖా మంత్రి విడదల రజిని అన్నారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ టవర్స్లో ఉన్న వైద్య ఆరోగ్యశాఖ ప్రధాన కార్యాలయంలో సోమవారం ఆరోగ్యశ్రీ పై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు, ఆరోగ్యశ్రీ సీఈవో హరీంద్రప్రసాద్, అడిషనల్ సిఇవో మధుసూదన్ రెడ్డి , ఆరోగ్యశ్రీ ట్రస్టు అధికారులు హాజరయ్యారు. మంత్రి విడదల రజిని మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పథకాన్ని పేద ప్రజల కోసం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెడితే..గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో వంద అడుగులు ముందుకేస్తూ ఈ పథకాన్ని పేదలకు మరింత చేరువ చేశారన్నారు. టీడీపీ ప్రభుత్వంలో కేవలం 1059 ప్రొసీజర్లకు మాత్రమే ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం అందేదని ఆ సంఖ్యను సిఎం ఏకంగా 3255కు పెంచారన్నారు. గత జూన్లో 2446గా ఉన్న ఆరోగ్యశ్రీ చికిత్సలను ఒక్కసారిగా 3255కు చేర్చారన్నారు. దీనివల్ల ఒక్క గత జూన్ నుంచే ఇప్పటివరకు 51,731 చికిత్సలను పెంచిన ప్రొసీజర్ల ద్వారా ఆస్పత్రుల్లో అందించగలిగామన్నారు. ఇందుకు గాను ప్రభుత్వానికి అదనంగా రూ.112.78 కోట్లు ఖర్చయిందన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స అందిస్తున్న ఆస్పత్రుల సంఖ్యను కూడా గణనీయంగా పెంచారమన్నారు. ఇప్పుడు ఏకంగా 2260 ఆస్పత్రుల ద్వారా ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా వైద్యం అందుతోందన్నారు. వీటిలో తెలంగాణ, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలకు చెందిన 202 ఆస్పత్రుల్లోనూ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా వైద్యం అందజేస్తున్నామన్నారు. టీడీపీ ప్రభుత్వంలో ఐదేళ్లకు కలిపి ఆరోగ్యశ్రీ కింద కేవలం రూ.5176 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందన్నారు. అదే తమ ప్రభుత్వంలో ఈ నాలుగేళ్లలోనే ఏకంగా రూ.7186 కోట్లను తమ ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. ఈ ఏడాది మరో రూ.3వేల కోట్ల వరకు ఆరోగ్యశ్రీ ద్వారా తమ ప్రభుత్వం ఖర్చు చేయబోతోందన్నారు. మొత్తమ్మీద రూ.10వేల కోట్లకు పైగా నిధులను తమ పాలనలో ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు ఖర్చు చేస్తున్న గొప్ప ప్రభుత్వం తమదని మంత్రి స్పష్టం చేశారు. ఆరోగ్య శ్రీ ప్రొసీజర్ లు తదితరాలపై అవగాహన పెంచేలా అన్ని ఆస్పత్రుల్లో పోస్టర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆరోగ్య శ్రీ రోగులకు అందిన వైద్యంపై ఎఎన్ ఎం ల అభిప్రాయాల సేకరణ పై విధివిధానాలు ఖరారు చేయాలన్నారు.
*జవాబుదారితనం ఉండాలి*
మంత్రి విడదల రజిని మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం అందిస్తున్న ఆస్పత్రులపై నిరంతర పర్యవేక్షణ ఉండాలన్నారు. రాష్ట్ర స్థాయిలో ఒక కమిటీని నియమించి ఆ కమిటీ ద్వారా ఆస్పత్రుల్లోని వసతులను పర్యవేక్షించే వ్యవస్థను తీసుకురావాలని ఆదేశించారు. పెద్ద పెద్ద బీమా కంపెనీల్లో ఎలాంటి ఆడిటింగ్ విధానాలు అమలవుతున్నాయో పరిశీలించాలని, వీటిల్లో బాగున్న విధానాలను తీసుకుని మనం కూడా అవలంబించాల్సిన అవసరం వుందన్నారు. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అవకుండా పూర్తి జవాబుదారిగా ఉండాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందే ప్రతి రోగి పరీక్షలన్నీ ఉచితంగా జరగాల్సిందేనని స్పష్టంచేశారు. ఈహెచ్ ఎస్ కార్డుల ద్వారా అందుతున్న వైద్యం విషయంలో ఉన్న సమస్యలను పరిష్కరించాలన్నారు.
*ఆరోగ్య ఆసరా కింద రోజుకు సగటున రూ.1.5 కోట్లు*
మంత్రి విడదల రజిని మాట్లాడుతూ సిఎం జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన గొప్ప గొప్ప పథకాల్లో ఆరోగ్య ఆసరా కూడా ఒకటని తెలిపారు. ఈ పథకం కింద తమ ప్రభుత్వం ఇప్పటివరకు 15,75,624 మంది లబ్ధిదారులకు ఏకంగా 978.01 కోట్లు అందజేసిందన్నారు. చికిత్స తరువాత కూడా రోగికి ఆర్థిక సాయం అందిస్తున్న మనసున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. ఈ పథకం కింద ప్రస్తుతం రోజుకు రూ.1.5 కోట్లను రోగుల ఖాతాల్లో జమ చేస్తున్నామన్నారు. ఆయుష్మాన్ భారత్ కింద 2022-23లో రూ.361.57 కోట్ల విలువైన చికిత్స పేదలకు అందిందనన్నారు.
*108, 104 సర్వీసుల్లో వినూత్న మార్పులు*
108 సర్వీసుల్లో రోగుల సెల్కు వాహనం ఎక్కడ ఉంది అని తెలుసుకునేలా రూట్ మ్యాప్కు చెందిన లింక్ వెళ్లేలా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుందని మంత్రి తెలిపారు. ప్రస్తుతం ఈ విధానం ట్రయలరన్ పద్ధతిన అమలవుతోందన్నారు. వాహనంలోని టెక్నీషియన్ రోగికి ఫోన్ చేసి లొకేషన్ తెలుసుకునే విధానాన్ని కూడా అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. దీనివల్ల 108 వాహనాల ద్వారా మరింత మెరుగైన సేవలను రోగులకు ఇచ్చే వీలు కలుగుతుందన్నారు. టిడిపి ప్రభుత్వ హయాంలో ప్రతి 1.19 లక్షల మందికి ఒక 108 వాహనం అందుబాటులో ఉండగా , ఇప్పుడు 74,609 మందికి ఒక 108 వాహనాన్ని అందుబాటులోకి ఉంచామన్నారు. రోజుకు సగటున 108 వాహనాల ద్వారా 3096 అత్యవసర కేసులకు సేవలు అందిస్తున్నామన్నారు. 104, 108 వాహనాల సంఖ్యను గణనీయంగా పెంచిన ఘతన సిఎం జగన్మోహన్ రెడ్డికే చెందుతున్నారు. పేదలకు ఎన్నో పథకాల ద్వారా మేలు చేసే ప్రయత్నాన్ని సిఎం చేస్తున్నారని, ఈ ప్రయత్నం సఫలమవ్వాలంటే అధికారులు కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. అధికారులు చిత్తశుద్ధితో పనిచేసి ప్రభుత్వ లక్ష్యాలు నెరవేర్చాల్సిన అవసరం ఉందన్నారు. గిరిజన ప్రాంతాల్లో అంబులెన్సు సర్వీసు లు పెంచేలా చర్యలు తీసుకోవాలని మంత్రి విడదల రజని సూచించారు.
addComments
Post a Comment