ఎన్నికల విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాలి. .. డిఆర్ఓ కొండయ్య

 ఎన్నికల విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాలి. ..

డిఆర్ఓ కొండయ్య



పుట్టపర్తి ,ఫిబ్రవరి 21 (ప్రజా అమరావతి): జిల్లాలో  ఎమ్మెల్సీ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు సెక్టార్ మరియు రూట్ ఆఫీసర్లు తమ విధులను బాధ్యత యుతంగా నిర్వర్తించాలని జిల్లా రెవెన్యూ అధికారి కొండయ్య తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ లో ని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో  ఎన్నికల నిర్వహణకు సంబంధించి సెక్టార్ మరియు రూట్ ఆఫీసర్లకు సమావేశం నిర్వహించి  వివిధ అంశాలపై అవగాహన కల్పించి తగు సూచనలు జారీ చేశారు.

ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ ముఖ్యంగా ఎన్నికల విధుల నిర్వహణలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించకుండా కేంద్ర ఎన్నికల కమిషన్ జారీ చేసిన నిబంధనలను కచ్చితంగా పాటించాలన్నారు. సెక్టర్ మరియు రూట్ ఆఫీసర్లు, పిఓలు, ఏపీవోలు సమన్వయంతో ఎన్నికల విధులు నిర్వర్తించాలని సూచించారు. సెక్టర్. అధికారులు ముందస్తు  ప్రణాళిక బద్ధంగా ఆయా పోలింగ్ స్టేషన్లను తనిఖీ చేసి అవసరమైన మేరకు సౌకర్యాలను గుర్తించి వాటిని పూర్తి చేయాలన్నారు. ఇదివరకే ఎన్నికల నిర్వహణ విధులు నిర్వర్తించిన అధికారులు గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని యధావిధిగా విధులు నిర్వహించాలన్నారు. ఈ అంశంలో ఈనెల 24 లోగా నివేదిక రూపంలో తనకు  సమర్పించాలన్నారు. పోలింగ్ సామాగ్రిని  మార్చి 12 లోగా తరలించేందుకు  వాహనాలను ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. బ్యాలెట్  బాక్సులను  పుట్టపర్తి ప్రధాన కేంద్రం నుండి పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. రూట్ ఆఫీసర్లు కూడా తమకు అప్పగించిన పనులను ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని అలాగే ఆయా మండలాలకు సంబంధించిన పిఓలకు ,ఏపీవోలకు అందుబాటులో ఉండి ఎన్నికల ప్రక్రియ   ముగిసే వరకు సహకరించాలని సూచించారు. మార్చి 13న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలు సజావుగా జరిగేందుకు బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని కోరారు. ఈ సమావేశంలో కలెక్టరేట్ ఎన్నికల విభాగం డిప్యూటీ తాసిల్దార్ మైనుద్దీన్ సెక్టార్ మరియు  రూట్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.


Comments