వైద్య కళాశాల బోధనా ఆసుపత్రి పనులపై పర్యవేక్షణ అవసరం



రాజమహేంద్రవరం (ప్రజా అమరావతి): 


* వైద్య కళాశాల బోధనా ఆసుపత్రి పనులపై పర్యవేక్షణ అవసరం



* ఇందుకోసం ప్రత్యేకంగా అధికారులను నియమించాలి


* జిల్లా ఆసుపత్రికి వచ్చే గర్భవతులకు ముందస్తు వైద్య సేవలు అందించాల్సి ఉంది


కలెక్టర్ మాధవీలత 



జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సమన్వయ కమిటీ సమావేశం ప్రతి నెలా తప్పకుండా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత స్పష్టం చేశారు.


గురువారం స్థానిక జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సమన్వయ కమిటీ సమావేశం కు కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ , జిల్లా ఆసుపత్రి ద్వారా గర్భిణి స్త్రీలకు అందించే సేవలు సామర్థ్యం పెంచే క్రమంలో జిల్లాలోని వివిధ పి హెచ్ సి, కమ్యూనిటీ ఆసుపత్రులు, సబ్ సెంటర్ వారీగా ముందస్తు సమాచారం అందుకుని, వారి ఆరోగ్య పరిస్థితి పై డేటా ఆధారంగా వైద్య సేవలు అందించవలసి ఉందన్నారు. తద్వారా మాతృ మరణాలను నివారించడం సాధ్యం అవుతుందని తెలిపారు. ప్రతి నెలా జిల్లా ఆసుపత్రి సమన్వయ కమిటీ సమావేశం తప్పని సరిగా నిర్వహించాలని ఆదేశించారు. ఈ విషయం పై ప్రజా ప్రతినిధులు నుంచి ఫిర్యాదులు వస్తున్నట్లు పేర్కొన్నారు.  ఆయా సమావేశాల సందర్భంగా గుర్తించిన సమస్యలు, సూచనలు కనుగుణంగా చర్యలు తీసుకోవడం సాధ్యం అవుతుందని మాధవీ లత అన్నారు.  జిల్లాలో ప్రసూతి వైద్య అధికారుల అవసరం ఉందని అధికారులు వివరించారు. క్షేత్ర స్థాయి లో ఉన్న ఆసుపత్రుల్లో వైద్య సేవలు పొందుతున్న గర్భవతులు చివరి నిమిషం లో రావడం తో కొన్ని కేసుల్లో ఘటనకు కారణం అని అన్నారు. అందుకోసమే ప్రతి ఒక్క గర్భవతి యొక్క ఆరోగ్య పరిస్థితిని, వారి డేటా ఆధారంగా అధ్యయనం చేసి, ముందస్తుగా ఆసుపత్రికి తరలించి వైద్య పరంగా సేవలు అందించే విధానంలో చర్యలు తీసుకోవాలని సూచించారు.


భోధన ఆసుపత్రి పై సమీక్ష



జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాల, బోధనా ఆసుపత్రి పనులను త్వరితగతిన పూర్తి చేసి, వచ్చే విద్యా సంవత్సరం నాటికి అందుబాటులోకి తీసుకుని రావాల్సి ఉందని కలెక్టర్ డా కె. మాధవీలత స్పష్టం చేశారు. ఆయా పనుల పర్యవేక్షణ కోసం ప్రత్యేక అధికారులకు భాధ్యత అప్పగించాలని అన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తరగతుల నిర్వహణ ప్రారంభించనున్న దృష్ట్యా విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులూ లేకుండా లెక్చరర్స్, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించేందుకు తీసుకోవలసిన చర్యలు ముందస్తుగా పూర్తి చెయ్యాల్సి ఉందన్నారు.



ఈ సమావేశంలో జిజీహెచ్ పర్యవేక్షకులు డా రమేష్, ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డా ఏ. వెంకటేశ్వర రావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కే వి భాస్కర్ రెడ్డి, ఎస్ ఈ పి. అశోక్ కుమార్,  డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.



Comments