అమరావతి (ప్రజా అమరావతి);
*పెట్టుబడులకు, వ్యాపారానికి అనువైన రాష్ట్రం*
*4 ఎలక్ట్రానిక్ మ్యానుఫాక్చరింగ్ క్లస్టర్లున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్*
*ఏపీలో సుదీర్ఘ తీర ప్రాంతం, పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల సహజ వనరులు*
*చౌకగా రవాణా,సులభతర వాణిజ్యానికి ఏపీ చిరునామా*
*ముంబై రోడ్షోలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్*
పరిశ్రమల స్థాపనకు, వ్యాపారానికి అనువైన అన్ని వనరులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు. విశాఖపట్నంలో మార్చి 3,4 తేదీలలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న పెట్టుబడుదారుల సదస్సుకు మహారాష్ట్ర సహా ఇతర రాష్ట్రాల పారిశ్రామికవేత్తలకు మంత్రి బుగ్గన ఆహ్వానం పలికారు. ఈ మేరకు ముంబైలో సోమవారం నిర్వహించిన రోడ్ షోలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మాట్లాడుతూ పోర్టు ఆధారిత మౌలిక సదుపాయాలలో ఆంధ్రప్రదేశ్కు మరో ప్రత్యామ్నాయం లేదన్నారు. రాష్ట్రంలో ప్రతి 50 కిలోమీటర్ల దూరంలో ఒక పోర్టు లేదా ఎయిర్ పోర్ట్ అందుబాటులో ఉందన్నారు. మీకు తోడ్పాటునందించే మంచి నైపుణ్యం కలిగిన అనుభవజ్ఞులైన అధికారులున్నారని..ఎన్ని చూసినా, చదివినా, వ్యక్తిగత అనుభవం, అనుభూతి వేరని ఒక్కసారి రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులల్లోనూ రాష్ట్రానికి తిరుగులేదని..ఆటోమొబైల్, ఐ.టీ, హ్యాండ్లూమ్, టెక్స్ టైల్స్, హెల్త్ కేర్, పెట్రో కెమికల్, మెడికల్ ఎక్విప్మెంట్, తయారీ రంగాల్లో పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ లో అపార అవకాశాలు ఉన్నాయన్నారు.
ఔషధ రంగం, తయారీరంగాల్లో కీలకమైన పరిశ్రమలన్నీ ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయని..4 ఎలక్ట్రానిక్ మ్యానుఫాక్చరింగ్ క్లస్టర్లున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని..డీపీఐఐటీ గణాంకాల ప్రకారం గతేడాది ఏపీకి వచ్చిన పెట్టుబడులు రూ.45వేల కోట్లు అని బుగ్గన స్పష్టం చేశారు. పరిశ్రమల ప్రగతి వేగంగా సాధిస్తున్న రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్దే అగ్రస్థానమని..మా ప్రభుత్వం జలమార్గాలపైనా ప్రత్యేక దృష్టి సారించిందని..27 టెర్మినళ్లను 2029 కల్లా నిర్మించే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. సులభతర వాణిజ్యం, చౌకగా రవాణా మార్గాలకు ఏపీ చిరునామాగా నిలుస్తోందని..పర్వతాలు, సముద్రం, కొండలతో విశాఖ ఆకర్షణీయ నగరంగా ఉందన్నారు. విద్యుత్, నీరు, భూమి, సహజ వనరులతో పాటు స్థిరమైన ప్రభుత్వం రాష్ట్రంలో ఉందని బుగ్గన తెలిపారు. ప్రతి అభివృద్ధికి ఓ పరిధి ఉంటుందని.. కానీ ఏపీలో మాత్రం అవధులు లేని అవకాశాలున్నాయన్నారు. సుదీర్ఘ తీర ప్రాంతం, పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, జెట్టీల వసతులాంటి అదనపు సౌకర్యాలు ఏపీలో ఉన్నాయన్నారు.
3 పారిశ్రామిక కారిడార్లున్న ఏకైకన రాష్ట్రం ఏపీనేనని.. చెన్నై, హైదరాబాద్, బెంగళూరు పొడగింపుతో పెట్టుబడులకు మరిన్ని అవకాశాలుంటాయన్నారు. నైపుణ్యం, కష్టపడే గుణం, కలిసి పని చేయడంలో తెలుగు యువతకు ఎవరూ సాటిరారని.. దేశ జీడీపీలో ఏపీ వాటా పెరుగుతోందని ఎగుమతులలో దేశ వృద్ధి రేటులో 10శాతం వాటా ఏపీదేనని బుగ్గన వివరించారు. ఇటీవలే వైయస్ఆర్ కడప జిల్లాలో జేఎస్డబ్ల్యూ రూ. 8,800 కోట్ల పెట్టుబడితో నిర్మించనున్న స్టీల్ ప్లాంట్కు సీఎం వైయస్ జగన్ భూమి పూజ చేశారని గుర్తు చేశారు.
ఈ రోడ్షో కార్యక్రమానికి పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్, పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టుగోవింద రెడ్డి, ఏపీఐడీసీ ఛైర్ పర్సన్ బండి నాగేంద్ర పుణ్యశీల, పరిశ్రమల శాఖ డైరెక్టర్ జి.సృజన, చేనేత, జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి కె.సునీత, ఏపీ మారిటైమ్ బోర్డు డిప్యూటీ సీఈవో రవీంద్రనాథ్ రెడ్డి , ఏపీటీఎస్ గ్రూప్ సీఈవో కిరణ్ కుమార్ రెడ్డి,మహారాష్ట్ర సీఐఐ వైస్ ఛైర్మన్ రాబిన్ బెనర్జీ తదితరులు హాజరయ్యారు.
addComments
Post a Comment