*జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ ప్రశాంతం..!*
* *91.31% ఉపాధ్యాయ ఓట్లు, 72.01% పట్టభద్రుల ఓట్లు నమోదు*
* *జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు*
కడప, మార్చి 13 (ప్రజా అమరావతి): ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా జరిగిందని.. జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు పేర్కొన్నారు.
ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా... సోమవారం జిల్లా వ్యాప్తంగా 38 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రాలు, 93 పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రాలలో ఓటింగ్ ప్రక్రియ సజావుగా, ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా.. ప్రశాంతంగా సాగిందన్నారు.
సోమవారం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ సమయం కాగా.. నిర్ణీత సమయం లోపు పోలింగ్ కేంద్రంలోకి చేరుకున్న వారందరూ ఓటుహక్కు వినియోగించుకునేంత వరకు పోలింగ్ కొనసాగింది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ లో 91.31% ఓటర్లు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోగా, పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ లో 72.01% మేర తమ ఓటుహక్కును సద్వినియోగం చేసుకున్నారు. అన్ని రకాల భద్రత ఏర్పాట్లు చేపట్టడంతో.. మొత్తం మీద జిల్లాలో ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగిందన్నారు.
కాగా.. సోమవారం ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుండీ కలెక్టరేట్ లోని స్పందన హాలులో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ లో వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ జిల్లా కలెక్టర్ వి.విజయరామరాజు.. జేసి సీఎం సాయికాంత్ వర్మ, ట్రైనీ కలెక్టర్ రాహుల్ మీనా లతో కలిసి పోలింగ్ సరళిని పర్యవేక్షించారు.
addComments
Post a Comment