*రైతు భరోసా-పియం కిసాన్ కింద ఇప్పటి వరకూ రూ.27,062 కోట్ల సాయం*
*•2022 డిశంబర్ లో మాండోస్ తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులకు అదే సీజన్ ముగిసేలోగానే నష్టపరిహారం పంపిణీ*
*•విపత్తుల సమయంలో జరిగిన పంట నష్టానికి 2019 నుండి ఇప్పటి వరకూ అందించిన మొత్తం ఇన్పుట్ సబ్సిడీ రూ.1,911.78 కోట్లు*
*•కేంద్ర ప్రభుత్వ గ్రాంట్ల తో కలిపే రాష్ట్ర బడ్జెట్ ఉంటుంది అనే విషయాన్ని ప్రతిపక్షాలు గుర్తించాలి
*
*రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాని గోవర్ధన రెడ్డి*
అమరావతి, మార్చి 1 (ప్రజా అమరావతి): తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైయస్సార్ రైతు భరోసా-పియం కిసాన్ పధకం కింద ఇప్పటి వరకూ రూ. 27,062 కోట్ల మేర రైతు భరోసా సాయాన్ని నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలకు జమచేయడం జరిగిందని రాష్ట్ర వ్యవసాయ,సహకార,మార్కెటింగ్, ఆహారశుద్ధి శాఖామాత్యులు కాకాని గోవర్ధన రెడ్డి తెలిపారు. ప్రకృతి విపత్తుల సమయంలో జరిగిన పంట నష్టానికి కూడా అదే సీజన్ ముగిసేలోపు 2019 సంవత్సరం నుండి ఇప్పటి వరకూ రూ.1,911.78 కోట్ల మేర ఇన్పుట్ సబ్సిడీ రైతుల బ్యాంకు ఖాతాలకు జమచేయడం జరిగిందని ఆయన తెలిపారు. బుధవారం అమరావతి సచివాలయం నాల్గవ బ్లాకు ప్రచార విభాగంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకూ క్రమం తప్పకుండా వైఎస్సార్ రైతు భరోసా-పిఎం కిసాన్ పథకం క్రింద అర్హుడైన ప్రతి రైతుకు ఏటా రూ.13,500/-రైతు భరోసా సాయాన్ని విడతల వారీగా అందజేయడం జరుగుచున్నదన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సొంత భూమి సాగు చేసుకుంటున్న రైతన్నలతో పాటు ఎస్.సి.,ఎస్.టి., బి.సి., మైనారిటీ కౌలు రైతులు, ఆర్.ఓ.ఎఫ్.ఆర్. అటవీ, దేవాదాయ భూములు సాగు చేసుకుంటున్న రైతన్నలకు కూడా ఈ వైఎస్సార్ రైతు భరోసా-పిఎం కిసాన్ పథకం క్రింద రైతు భరోసా సాయాన్ని మరియు ప్రకృతి విపత్తువల్ల పంట నష్టపోయిన రైతులకు పెట్టు బడి సాయాన్ని అదే సీజన్ ముగిసే లోపే రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి అందజేయడం జరుగుచున్నదన్నారు.
*కేంద్ర ప్రభుత్వ గ్రాంట్ల తో కలిపే రాష్ట్ర బడ్జెట్ ఉంటుంది అనే విషయాన్ని గుర్తించాలి……*
వైఎస్సార్ రైతు భరోసా-పియం కిసాన్ పధకం కింద తమ ప్రభుత్వం రైతన్నలకు విడతల వారీగా అందజేసే రైతుభరోసా సాయం విషయంలో కేంద్ర వాటా ఇంత, రాష్ట్ర వాటా ఇంత అంటూ ప్రతిపక్షాలు చిలవలు పలవలు చేస్తూ లేనిపోని రాద్దాంతం చేస్తుండటం ఎంతో విడ్డూరంగా ఉందన్నారు. ఏ రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ అయినా కేంద్ర ప్రభుత్వం అందజేసే గ్రాంట్లను కలుపుకుని బడ్జెట్ అంచనాలను రూపొందించడం జరుగుతుందన్నారు. అయితే ప్రతి పక్షాలు, వారి మద్దతు మీడియా ఈ విషయంలో కనీస పరిజ్ఞానం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే వైఎస్సార్ రైతు భరోసా-పియం కిసాన్ పథకం క్రింద రైతులకు అందజేసే రైతుభరోసా సాయంలో కేంద్ర వాటా ఇంత, రాష్ట్ర వాటా ఇంత అంటూ ఏవేవో లెక్కల గారడీలు చూపిస్తూ ప్రజలను మభ్యపెట్టడం విచిత్రంగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వ గ్రాంట్ల తో కలిపే రాష్ట్ర బడ్జెట్ ఉంటుంది అనే విషయాన్ని ఇప్పటికైనా ప్రతిపక్షాలు, వారి మద్దతు మీడియా గుర్తించాలని ఆయన హితవుపలికారు.
*మాండోస్ తుఫాను వల్ల పంట నష్టపోయిన రైతులకు రబీ సీజన్ ముగేసే లోపే ఇన్పుట్ సబ్సిడీ పంపిణీ…..*
2022 డిసెంబర్ మాసంలో సంభవించిన మాండోస్ తుఫాన్ వల్ల పంట నష్టపోయిన 91,237 మంది రైతులకు అదే రబీ సీజన్ ముగిసే లోపుగా పెట్టుబడి సాయంగా రూ.76.99 కోట్ల ఇన్ పుట్ సబ్సిడీని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి మంగళవారం పంపిణీచేయడం జరిగిందన్నారు. ప్రకృతి విపత్తుల సమయంలో జరిగిన పంట నష్టానికి కూడా అదే సీజన్ ముగిసేలోపు 2019 సంవత్సరం నుండి ఇప్పటి వరకూ రూ.1,911.78 కోట్ల మేర ఇన్పుట్ సబ్సిడీ రైతుల బ్యాంకు ఖాతాలకు జమచేయడం జరిగిందని ఆయన తెలిపారు.
addComments
Post a Comment