*చిరు ధాన్యాల వినియోగం ఉద్యమం కావాలి
*
పార్వతీపురం, మార్చి 31 (ప్రజా అమరావతి): చిరు ధాన్యాల వినియోగం ఉద్యమం కావాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పిలుపునిచ్చారు. చిరు ధాన్యాలు ఉపయోగించడం వలన ఆరోగ్యం బాగుంటుందని అన్నారు. చిరు ధాన్యాలు ప్రతి ఒక్కరూ తినాలని, భవిష్య తరాలు శత శాతం చిరు ధాన్యాలు తినే విధంగా బాటలు వేయాలని ఆయన కోరారు. అంతర్జాతీయ చిరు ధాన్యాల సంవత్సరంలో భాగంగా చిరు ధాన్యాల మహోత్సవంను పార్వతీపురం ఐటిడిఎ కార్యాలయ ఆవరణలో జిల్లా కలెక్టర్ శుక్ర వారం ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జీవన విధానంలో మార్పు రావాలని అన్నారు. ఐక్య రాజ్య సమితిలో భారత దేశం చిరు ధాన్యాల ప్రస్తావన తీసుకువచ్చి అంతర్జాతీయ చిరు ధాన్యాల సంవత్సరం జరుపుకునే విధంగా చేశారని ఆయన పేర్కొన్నారు. 1965 సంవత్సరంలో చిరు ధాన్యాల పంటలు 20 శాతంగా ఉండగా, ప్రస్తుతం 6 శాతంగా ఉందని ఆయన తెలిపారు. తక్కువ ఆదాయ వర్గాలు మాత్రమే తింటారు అనే ప్రజల్లో మానసికమైన ఆలోచనా విధానం కూడా చిరు ధాన్యాలు తగ్గుదలకు కారణమని ఆయన చెప్పారు. గ్రీన్ రివల్యుషన్ లో వరి, గోధుమల పంటలు ఎక్కువగా పండించడం ప్రారంభించడం, చిరు ధాన్యాలు తగ్గించడం జరిగిందన్నారు. ప్రస్తుతం ప్రజల్లో రక్త హీనత ఎక్కువగా కనిపిస్తున్నాయని, హైపర్ టెన్షన్, మధుమేహం కేసులు ఫ్యామిలీ డాక్టరు విధానం పరీక్షలలో కనిపిస్తుందని ఆయన చెప్పారు. శారీరక వ్యాయామం తగ్గుదల ఇందుకు ఒక కారణం అని అన్నారు. చిరు ధాన్యాలు వలన ఆహార భద్రత వస్తుందని ఆయన చెప్పారు. చిరు ధాన్యాల పంటలకు తక్కువ నీరు సరిపోతుందని, చిన్న సన్నకారు రైతులు ఇబ్బందులు లేకుండా పండించవచ్చని ఆయన సూచించారు. ఎటువంటి వాతావరణాన్ని అయినా తట్టుకోగల మంచి పంట అన్నారు. చిరు ధాన్యాల ఉత్పత్తి పెంచాలని, వ్యవసాయ శాఖ సరైన మార్గదర్శత్వం ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు. చిరు ధాన్యాలకు డిమాండ్ ఉండాలని, చిన్న పట్టణాల్లో కూడా డిమాండ్ రావాలని అందుకు ప్రజల్లో పూర్తి స్థాయి అవగాహన కల్పించాలని ఆయన ఆదేశించారు. ప్రభుత్వ విధానంలో మార్పు వస్తుందని, మద్దతు ధర ప్రకటించడం జరిగిందని ఆయన చెప్పారు.
జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ పి. కిరణ్ కుమార్ మాట్లాడుతూ ఆరోగ్యానికి చిరు ధాన్యాలు చాలా అవసరమన్నారు. ఆరోగ్యం బాగుంటే ఆర్థికంగా బాగుంటుందని ఆయన చెప్పారు.
జిల్లా వ్యవసాయ అధికారి కె. రాబర్ట్ పాల్ మాట్లాడుతూ జిల్లాలో వ్యవసాయ రంగంలో అనేక కార్యక్రమాలు చేపట్టడంతో ధాన్యం బాగా దిగుబడి వచ్చిందన్నారు. రాష్ట్రంలో ఐదు సంవత్సరాల కాలంలో చిరు ధాన్యాల పంటను పెంపుదల చేయుటకు ప్రభుత్వం నిర్ణయంచిందని అన్నారు. కనీస మద్దతు ధరను కూడా ప్రకటించారని ఆయన చెప్పారు. దిగుబడి జరిగిన పంట మొత్తం కొనుగోలు చేయుటకు ముఖ్య మంత్రి ప్రకటించారని ఆయన అన్నారు. చిరు ధాన్యాలతో అంగన్వాడీ కేంద్రాలలో, మధ్యాహ్న భోజనంలో ఆహార పదార్థాల తయారీ చేయడం జరుగుతుందని ఆయన వివరించారు. జిల్లాలో 4 వేలు ఎకరాల్లో చిరు ధాన్యాల పంటలు వేస్తున్నారని, ప్రస్తుతం
4 వందల ఎకరాల్లో పంట ఉందని అన్నారు. 90 శాతం సబ్సిడీతో విత్తనాలు సరఫరా చేయడం జరిగిందని ఆయన చెప్పారు. జిల్లాలో ఎకరాకు 2 నుండి 3 బస్తాలు దిగుబడి వస్తుందని, విత్తనాల రకాలు మార్చుకొని దిగుబడి పెంచాలని ఆయన సూచించారు. జిల్లాలో ఎక్కువ చిరు ధాన్యాల పంట విస్తీర్ణం పెంచుటకు కార్యాచరణ ప్రణాళిక ఉందని, ముఖ్యంగా రాగి విత్తనాలను రాయితీపై అందించడానికి చర్యలు తీసుకుంటామని అన్నారు. రైతుకు గిట్టుబాటు ధర రావాలి, ఎగుమతి చేయాలని ప్రభుత్వం ధ్యేయమని, పంటలో నాణ్యత ఉండాలని ఆయన పేర్కొన్నారు.
జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి కె. విజయ గౌరి మాట్లాడుతూ ఆహారం మార్పు చెందడంతో అనేక రకాల వ్యాధులకు గురి అవుతున్నామని అన్నారు. చిరు ధాన్యాలు తీసుకుంటే అన్ని విటమిన్లు లభిస్తాయని, శారీరక దారుఢ్యం కలిగి ఉంటారని ఆమె తెలిపారు. గర్భిణీలు తీసుకోవడం వలన మంచి పోషకాహారం అంది ఆరోగ్యకర పిల్లలు పుడతారని, ఆరోగ్యకర సమాజం నెలకొంటుందని ఆమె వివరించారు.
ఆహార భద్రత అధికారి మాట్లాడుతూ కొర్రలు, సామలు, అండు కొర్రలు, ఊదలు, అరికెలు మంచి పోషక విలువలు కలిగిన చిరు ధాన్యాలు అన్నారు.
కె.పి.ఎం పాఠశాల 9వ తరగతి విద్యార్థి బి.బాందవి ఆంగ్లంలో ప్రసంగించి సభకు హాజరైన వారికి ఔరా అనిపించింది. ప్రధాన మంత్రి చిరు ధాన్యాలను ప్రజా ఉద్యమంగా చేసి అంతర్జాతీయ చిరు ధాన్యాల దినోత్సవం ను జరుపుకునే విధంగా చేశారని చెప్పారు.
ఈ సందర్భంగా చిరు ధాన్యాలను సాగు చేస్తున్న రైతులను జ్ఞాపికలతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో టి.పి.ఎం.యు ఏపిడి వై. సత్యం నాయుడు, రస్తాకుంటుబాయి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త తేజేశ్వర రావు, ఆర్ట్స్ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ నూక సన్యాసి రావు తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment