అకాల వర్షాలకు పంట దెబ్బతిన్న రైతాంగాన్ని ఫ్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటుంది

 అకాల వర్షాలకు పంట దెబ్బతిన్న రైతాంగాన్ని ఫ్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటుంది


వారం రోజుల్లోగా పంట నష్టం అంచనా వేయాల్సిందిగా ఇప్పటికే సియం ఆదేశం

ప్రాధమిక సమాచారం మేరకు 5జిల్లాల్లోని 25 మండలాల్లో పంటలకు నష్టం

పంటలు నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందించి ఆదుకుంటాం

రాష్ట్ర మంత్రి సిహెచ్.శ్రీనివాస వేణుగోపాల కృష్ణ

అమరావతి,19 మార్చి (ప్రజా అమరావతి,):రాష్ట్రంలో అకాల వర్షాల వల్ల పంటలు దెబ్బతిన్న రైతాంగాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని కావున రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర సమాచార పౌరసంబంధాలు,బిసి సంక్షేమం,సినిమాటోగ్రఫీ శాఖా మాత్యులు సిహెచ్.శ్రీనివాస వేణుగోపాల కృష్ణ చెప్పారు.ఆదివారం రాష్ట్ర సచివాలయం రెండవ బ్లాకు మీడియా పాయింట్ వద్ద మంత్రి మీడియాతో మాట్లాడుతూ అకాల వర్షాలపై ఇప్పటికే ముఖ్యమంత్రి వైయస్.జగన్మోహన్ రెడ్డి అధికారులతో సమీక్షించారని వారం రోజుల్లోగా పంట నష్టం అంచనా వేసి నివేదిక సమర్పించాల్సిందిగా ఆదేశించారని అన్నారు.అధికారులు అందించిన ప్రాధమిక అంచనా ప్రకారం 5జిల్లాల్లోని 25 మండలాల్లో వివిధ పంటలు దెబ్బతిన్నాయని మంత్రి వివరించారు.నంద్యాల జిల్లాలోని 15 మండలాల్లో మొక్కజొన్న, వరి,మినుము,మిర్చి పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు.ఎన్టిఆర్ జిల్లాలోని 5మండలాల పరిధిలో మొక్కజొన్న,కర్నూలు జిల్లాలో 1 మండలంలో మొక్కజొన్న,పార్వతీపురం మన్యం జిల్లాలోని 3 మండలాల్లో మొక్కజొన్న,అరటి,ప్రకాశం జిల్లాలో ఒక మండలంలో మినుము,ప్రత్తి పంట దెబ్బతిందని మంత్రి వేణుగోపాల కృష్ణ వివరించారు.

గత ప్రభుత్వ హయాంలో అనగా 2014 నుండి 2019 వరకూ రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొని రైతులు అనేక ఇబ్బందులు పడేవారని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక పుష్కలంగా వర్షాలు పడి జలాశయాలు అన్ని పూర్తిగా నిండి రైతులు ఆనందంగా ఉన్నారని మంత్రి వేణుగోపాల కృష్ణ అన్నారు.రైతులు అన్ని విధాలా ఆనందంగా ఉండి రేపో మాపో పంట చేతికి వస్తుందనుకున్నతరుణంలో ఆకాల వర్షాలతో రైతులకు కొంత ఇబ్బంది కలిగిందని చెప్పారు.పంటలు దెబ్బతిన్న రైతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని రైతులెవరూ ఏవిధమైన ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి పునరుద్ఘాటించారు. ఏసీజన్ లో పంటలు దెబ్బతింటే ఆసీజన్లోనే ఇన్పుట్ సబ్సిడీ అందించి రైతులను ఆదుకునే విధానానికి ఈప్రభుత్వం శ్రీకారం చుట్టి రైతులను ఆదుకుంటున్నట్టు మంత్రి వివరించారు.

పంటలు దెబ్బతిన్న రైతులకు ఇన్పుట్ సబ్సిడీని అందించడం తోపాటు పంటల బీమా కూడా కల్పించడం జరుగుంతోందని బీమాకు సంబంధించిన ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించి పంటల బీమాను కల్పించడం జరుగుతోందని మంత్రి శ్రీనివాస వేణుగోపాల కృష్ణ వెల్లడించారు.రైతులు విత్తనం మొదలు పంటలు పండించి వాటిని అమ్ముకునే వరకు వారికి తగిన తోడ్పాటును అందించేలా రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని మంత్రి వేణుగోపాల కృష్ణ చెప్పారు.

  

Comments