అత్యద్భుతం.. లేపాక్షి ఆలయం*
*: జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు*
*: లేపాక్షి శ్రీ వీరభద్ర స్వామి ఆలయాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్, పెనుకొండ సబ్ కలెక్టర్*
లేపాక్షి (శ్రీ సత్యసాయి జిల్లా), ఏప్రిల్ 21 (ప్రజా అమరావతి):
శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షిలో వెలసి ప్రపంచ ప్రసిద్ధిగాంచిన శ్రీ వీరభద్ర స్వామి ఆలయం అద్భుతమని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు పేర్కొన్నారు. శుక్రవారం లేపాక్షి లో వెలిసిన శ్రీ వీరభద్ర స్వామి ఆలయాన్ని, అక్కడ శిల్పకళని పెనుకొండ సబ్ కలెక్టర్ కార్తీక్ తో కలిసి జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయం వద్దకు చేరుకున్న జిల్లా కలెక్టర్, సబ్ కలెక్టర్ ని పూలమాలతో సత్కరించి పూర్ణకుంభంతో ఆలయం అధికారులు ఘన స్వాగతం పలికారు.
ఆ తరువాత లేపాక్షి ఆలయంలోకి వెళ్లిన జిల్లా కలెక్టర్ కి టూరిజం గైడ్ విరూపన్న లేపాక్షి ఆలయ ప్రాశస్త్యం, చరిత్ర, దేవాలయ నిర్మాణం, కట్టడాలు, సభా మండపం, విజయనగర సామ్రాజ్యంలో ఆలయానికి ఉన్న ప్రాధాన్యత, శ్రీ పార్వతి పరమేశ్వరుల కళ్యాణ మండపం, లతా మండపం, కుడ్య వర్ణ చిత్రాలు, శిల్ప సంపద, వాస్తు నిర్మాణశైలి, వ్యాపార, వాణిజ్య, ఆధ్యాత్మిక కళలకు ఉన్న కీర్తి, ఏకశిలా గణేషుడు, నాగలింగం విశిష్టత, నాట్య మండపం, సీతమ్మ పాదం, భోజన శాల, వేలాడే స్తంభం, తదితర వివరాలను జిల్లా కలెక్టర్ కి తెలియజేశారు.
ఈ సందర్భంగా లేపాక్షి ఆలయాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ ఆలయం అద్భుతం అని పేర్కొన్నారు. ముఖ్యంగా వేలాడే స్తంభాన్ని చూసి వారు ఆశ్చర్యపోయారు. ఏకశిలా గణేషుడు, నాగలింగం విశిష్టత, శిల్పకళా సంపద, చరిత్ర గురించి తెలుసుకొని ఆశ్చర్యచకితులయ్యారు. రామాయణ కాలం నాటి చరిత్ర తెలుసుకున్నారు. లేపాక్షి ఆలయాన్ని సందర్శించడం పట్ల జిల్లా కలెక్టర్ సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్, సబ్ కలెక్టర్ కి వేద పండితులు ఆశీర్వాదం అందించారు. ఆ తర్వాత అతి పెద్దదైన నంది విగ్రహాన్ని, జటాయు పక్షి థీమ్ పార్క్ ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా టూరిజం అధికారి నాగేశ్వర్ రెడ్డి, తహసీల్దార్ బాబు, టూరిజం మేనేజర్ శరత్, ఆలయ ఈవో నరసింహమూర్తి, వేద పండితుల లక్ష్మీనరసింహ శర్మ, శ్రీనివాస కుమార్, విఆర్ఓ రమేష్, తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment