అర్హత గల ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలను అందించడమే లక్ష్యం.

 

నెల్లూరు, ఏప్రిల్ 24 (ప్రజా అమరావతి):  అర్హత గల ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలను అందించడమే లక్ష్యం


గా గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వహిస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి  పేర్కొన్నారు. 


సోమవారం సాయంత్రం సర్వేపల్లి నియోజకవర్గం  ముత్తుకూరు మండలం  ముసునూరు వారి పాలెం గ్రామ సచివాలయం పరిధిలో    గడపగడపకు మన ప్రభుత్వంలో భాగంగా  పర్యటించిన  మంత్రికి గ్రామ ప్రజలు, స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు.  


ఈ సందర్భంగా మంత్రి  మాట్లాడుతూ మూడేళ్ల పరిపాలన పూర్తయిన తర్వాత ధైర్యంగా ప్రజల్లోకి వెళుతూ, వారితో మమేకమవుతూ ప్రభుత్వం నుంచి అందుతున్న సంక్షేమ ఫలాలు ఏ మేరకు అందాయో తెలుసుకోవడం, ఏదైనా సాంకేతిక కారణాలతో అందకపోతే అందించడమే అజెండాగా వార్డు స్థాయి సభ్యుడి నుంచి మంత్రి వరకు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొంటున్నారన్నారు. ఒక సంవత్సరం నుంచి కొనసాగుతున్న ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందన్నారు. ఏదో వచ్చామా వెళ్ళామా అని కాకుండా గ్రామాల్లో పర్యటించడం, ప్రజల సమస్యలు తెలుసుకోవడం, వాటిని పరిష్కరించడమే ప్రధాన అజెండాగా పనిచేస్తున్నామన్నారు. సర్వేపల్లి నియోజకవర్గం సంబంధించి 120 కోట్ల రూపాయలు నిధులు ఖర్చు చేసామని, ముసునూరు గ్రామానికి సంబంధించి రూ. 5 కోట్లు, పైనాపురం గ్రామానికి సంబంధించి రూ. 2.25 కోట్లతో నేడు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేసామన్నారు. సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న అనేక సమస్యలను పరిష్కరించామని, ఈ ప్రాంత వాసులకు సంబంధించి నాన్ ఫిషర్ మాన్ ప్యాకేజీని అందించామన్నారు. గ్రామాల అభివృద్ధి, ప్రజల సంక్షేమ లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఈ సందర్భంగా మంత్రి పునరుద్ఘాటించారు. 

 తొలుత యంత్ర సేవా పథకం కింద రూ. 15 లక్షలు విలువైన వ్యవసాయ యంత్ర పరికరాలను రైతులకు మంత్రి అందజేశారు.

 ఈ కార్యక్రమంలో ఎం. డి. ఒ, ఎం. ఆర్. ఒ. వ్యవసాయ అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, గ్రామ కార్యదర్సులు, అధికారులు పాల్గొన్నారు.


Comments