సుఖోయ్‌లో ప్రయాణించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

  సుఖోయ్‌లో ప్రయాణించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము



గువాహటి (ప్రజా అమరావతి): రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Droupadi Murmu ) ఈశాన్య రాష్ట్రం అస్సాంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె తొలిసారిగా సుఖోయ్‌-30 MKI (Sukhoi-30) యుద్ధ విమానంలో ప్రయాణించారు..


ఈ ఉదయం తేజ్‌పూర్‌లోని భారత వాయుసేనకు చెందిన వ్యూహాత్మక వైమానిక స్థావరానికి చేరుకున్న రాష్ట్రపతి ముర్ము.. తొలుత భద్రతా దళాల నుంచి సైనిక వందనం అందుకున్నారు. అనంతరం ఆమె ఫ్లయింగ్‌ సూట్‌ ధరించి సుఖోయ్‌-30 విమానంలో కొద్దిసేపు విహరించారు. ఈ విమానాన్ని గ్రూప్‌ కెప్టెన్‌ నవీన్‌ కుమార్‌ తివారీ నడిపారు. కాగా.. అంతకుముందు 2009లో భారత తొలి మహిళా రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌ కూడా యుద్ధ విమానంలో ప్రయాణించారు.


మూడు రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Droupadi Murmu) గత గురువారం అస్సాం (Assam) చేరుకున్నారు. శుక్రవారం కజిరంగ జాతీయ పార్కులో జరిగిన గజ్‌ ఉత్సవ్‌ను ఆమె ప్రారంభించారు. పర్యటనలో భాగంగా మౌంట్‌ కాంచనగంగ సాహసయాత్ర - 2023ను కూడా ఆమె ప్రారంభించారు.

Comments