విజయవాడ (ప్రజా అమరావతి);
*మే 13, 14 తేదీల్లో అక్రిడేటెడ్ జర్నలిస్టుల కోసం ఉచిత హెల్త్ క్యాంపు*
• *విజయవాడలోని లయోలా ఇంజినీరింగ్ కాలేజ్ లో 2 రోజుల పాటు ఉచిత హెల్త్ క్యాంపు నిర్వహణ*
• *వైద్య ఆరోగ్య శాఖ, సమాచార పౌర సంబంధాల శాఖల సౌజన్యంతో నిర్వహిస్తున్న హెల్త్ క్యాంపు*
• *వైద్య సేవల కోసం అక్రిడేటెడ్ జర్నలిస్టులు తమతో పాటు కుటుంబ సభ్యుల వివరాలతో నమోదు చేసుకోవాలి*
• *మే 10వ తేదీలోగా రిజిస్ట్రేషన్ చేసుకొని ఉచిత హెల్త్ క్యాంపు సేవలను వినియోగించుకోవాలని సూచన*
• *ప్రముఖ ఆస్పత్రులకు చెందిన అనుభవజ్ఞులైన వైద్య బృందంచే వైద్య సేవలు*
• *ఉచిత వైద్య ఆరోగ్య శిబిరంలో 17 రకాల వైద్య పరీక్షలు*
• *ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 వరకు క్యాంపు*
• *కొత్తగా అక్రిడేటేషన్ పొందే జర్నలిస్టుల కోసం, క్యాంపు లోనే హెల్త్ కార్డులు ఇచ్చేలా డెస్క్ ఏర్పాటు చేసే యోచన*
• *జర్నలిస్టులు అందరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని విజ్ఞప్తి*
- *రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ శ్రీ. తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి*
ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా అహర్నిశలు శ్రమించి విధులు నిర్వహించే జర్నలిస్టుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని సదుద్దేశంతో వైద్య ఆరోగ్య శాఖ, సమాచార పౌర సంబంధాల శాఖల సంయుక్త సౌజన్యంతో అక్రిడేటెడ్ జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులకు మే 13, 14వ తేదీల్లో రెండు రోజుల పాటు హెల్త్ క్యాంపు నిర్వహించి, ఉచితంగా వైద్య సేవలు అందించనున్నామని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ శ్రీ. తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. వైద్య ఆరోగ్య శిబిరం గురించి గౌరవ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి శ్రీ. చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ, గౌరవ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీమతి. విడదల రజనిలు సమాచార శాఖ కమిషనర్ అయిన తనతో పాటు ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ. కృష్ణబాబు, ఆరోగ్యశ్రీ సీఈవో శ్రీ. హరిందర్ ప్రసాద్ లతో పలుమార్లు సమీక్ష నిర్వహించిన పిదప రెండు రోజుల పాటు మెడికల్ క్యాంపు నిర్వహించనున్నట్లు టి.విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు.
అక్రిడేటెడ్ జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులకు ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు ప్రముఖ ఆస్పత్రులకు చెందిన అనుభవజ్ఞులైన వైద్య బృందంచే విజయవాడలోని లయోలా ఇంజినీరింగ్ కాలేజ్ లో రెండు రోజుల పాటు హెల్త్ క్యాంపు నిర్వహిస్తున్నామని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హెల్త్ క్యాంపులో సేవలు పొందాలనుకునే అక్రిడేటెడ్ జర్నలిస్టులు తమ వివరాలతో పాటు, కుటుంబ సభ్యుల వివరాలు పొందుపరుస్తూ మే 10వ తేదిలోగా https://forms.gle/UEKdx4fZG7yUGBns7 లింక్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు.
ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించే ఉచిత వైద్య ఆరోగ్య శిబిరం(హెల్త్ క్యాంపు) లో మామోగ్రామ్, హృద్రోగ సంబంధిత టెస్ట్ లు, ఈసీజీ, 2డీఎకో, ట్రేడ్ మిల్ టెస్ట్(టిఎంటీ), ఆల్ట్రా సౌండ్ స్కానింగ్, సీబీపీ, లివర్ పంక్షన్ టెస్ట్, లిపిడ్ ప్రొపైల్ టెస్ట్, థైరాయిడ్, డయాబెటిక్ టెస్ట్ లు, ఎక్స్ రే, కళ్లు, డెంటల్ పరీక్షలు వంటి తదితర 17 రకాల వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. చిన్న పిల్లలకు సైతం అవసరమైన వైద్య సదుపాయం అందించనున్నట్లు కమిషనర్ తెలిపారు.
హెల్త్ క్యాంపులో నిర్ధారిత పరీక్షలు చేసిన పిదప అత్యవసర వైద్య సేవలు, దీర్ఘకాలిక వ్యాధులకు వైద్య సాయం పొందాల్సి వస్తే ఆరోగ్యశ్రీ అనుబంధిత ఆస్పత్రుల(రిఫరల్ హాస్పిటల్)కు వెళ్లడానికి జర్నలిస్ట్ హెల్త్ కార్డు తప్పనిసరి కావున కొత్తగా అక్రిడేటెడ్ కార్డులు పొందిన జర్నలిస్టులు హెల్త్ కార్డు పొందడానికి వీలైనంత త్వరగా రూ.1,250 చెల్లిస్తే, దీనికి ప్రభుత్వం తరపున మరో రూ.1,250 చెల్లిస్తామని ఆయన తెలిపారు. అవసరం మేరకు హెల్త్ క్యాంపులో కూడా కొత్తగా హెల్త్ కార్డు పొందే సదుపాయాన్ని ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు ఆయన వెల్లడించారు. జర్నలిస్టులు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ టి. విజయ్ కుమార్ రెడ్డి కోరారు.
.
addComments
Post a Comment