సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి..

 *సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి..*




*ప్రభుత్వం చేసిన మంచిని ప్రజలకు చెప్పాలి*


*: సచివాలయ ఉద్యోగులు విధులు సక్రమంగా నిర్వహించాలి*


*: అనుమతి లేకుండా బయటకు వెళ్తే చర్యలు తీసుకోవాలి*


*: ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా సచివాలయ ఉద్యోగులు పనిచేయాలి*


*: పంచాయతీ రాజ్ & గ్రామీణాభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి*


చిలమత్తూరు (శ్రీ సత్యసాయి జిల్లా), మే 15 (ప్రజా అమరావతి):


రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పంచాయతీ రాజ్ & గ్రామీణాభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి పిలుపునిచ్చారు.


సోమవారం సాయంత్రం చిలమత్తూరు మండల కేంద్రంలోని రైతు భరోసా కేంద్రంలో ప్రజాప్రతినిధులు, గ్రామ, వార్డు సచివాలయం సిబ్బంది, వాలంటీర్లతో పంచాయతీ రాజ్ & గ్రామీణాభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సమీక్ష సమావేశం నిర్వహించారు.


ఈ సందర్భంగా పంచాయతీ రాజ్ & గ్రామీణాభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి, చేసిన మంచి గురించి ప్రజలకు తెలియచెప్పాలన్నారు. సచివాలయ ఉద్యోగులంతా ప్రతిరోజు మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఐదు గంటల వరకు నిర్వహించే స్పందన కార్యక్రమానికి ఖచ్చితంగా రావాలన్నారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి 5 గంటల మధ్యలో సచివాలయాలకు వెళ్లి తనిఖీ చేయాలని, సిబ్బంది లేకపోతే చర్యలు తీసుకోవాలని జడ్పి చైర్మన్ కు సూచించారు. ముఖ్యమంత్రి కాకముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019లో తన 3,648 కిలోమీటర్ల పాదయాత్రలో ప్రజల అవసరాలను గుర్తించి నవరత్నాలును సృష్టించి, అనేక రకాల సంక్షేమ పథకాలు అమలు చేసి మహాత్మగాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని సృష్టించారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగనన్న దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థను తెచ్చారని, సచివాలయాల ద్వారా 544 రకాల సేవలు అందిస్తున్నారన్నారు. అలాగే కొత్త 108, 104 వాహనాలను తెచ్చారని, ఆరోగ్య శ్రీలో చాలా రకాల జబ్బులను చేర్చారన్నారు. దివంగత నేత వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ ప్రవేశపెట్టగా, తండ్రిని మించిన తనయడుగా సీఎం జగనన్న ఆరోగ్యశ్రీలో వేలాది జబ్బులను చేర్చి మరింత మెరుగైన సేవలు అందించేలా చర్యలు తీసుకున్నారన్నారు. కరోనా కాలంలోనూ సంక్షేమ పథకాలు అపలేదని, అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నారన్నారు. వాలంటిర్లు వారానికి మూడు రోజులు సచివాలయానికి రావాలన్నారు. సచివాలయ సిబ్బందిపై చాలా ఆరోపణలు వస్తున్నాయని, వారు వార్డు మెంబర్లు, సర్పంచులు, ఎంపిటిసిలు, ప్రజాప్రతినిధులను గౌరవించాలన్నారు. ఉద్యోగులు ప్రజాప్రతినిధులకు సహకారం అందించాలన్నారు. సచివాలయంలో ఏ కార్యక్రమం జరిగినా వారిని ఆహ్వానించాలని, సమాచారం ఇవ్వాలన్నారు. సచివాలయ పరిధిలో అభివృద్ధి పనులకు ఎన్ని కోట్ల రూపాయలు వచ్చాయో ప్రదర్శించేలా చూడాలన్నారు. సచివాలయ సిబ్బంది ద్వారా మధ్య దళారులు లేకుండా ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడం జరుగుతోందన్నారు. సచివాలయంలో మధ్యాహ్నం 3 నుంచి5 గంటల వరకు నిర్వహించే స్పందన కార్యక్రమంలో ఉద్యోగులంతా అందుబాటులో ఉండాలన్నారు. ఎంపిడిఓ, డీఎల్పిఓ, అనుమతి లేకుండా సచివాలయ సిబ్బంది బయటకు వెళ్ళిపోతే చర్యలు తీసుకోవాలన్నారు. ఉద్యోగులంతా విధులు సక్రమంగా నిర్వహించాలన్నారు. ప్రభుత్వం చేసిన మంచిని ప్రజలకు చెప్పాలన్నారు.


ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ మాట్లాడుతూ సచివాలయాలు చాలా బాగా పనిచేస్తున్నాయని, భవిష్యత్ లో మరింత బాగా సేవలు అందించాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అన్ని ఇళ్లకు చేరుతున్నాయన్నారు. సచివాలయాల్లో ఎంతో మెరుగైన సేవలు అందిస్తున్నారని, అక్కడ నెలకొన్న చిన్న చిన్న సమస్యలను పరిష్కరించుకుని ఉద్యోగులు పని చేయాలన్నారు. సచివాలయానికి వచ్చిన వారి సమస్యలు సావధానంగా వినాలని, ఇష్టంతో ప్రజలతో మమేకమై ఉద్యోగులు పని చేయాలన్నారు. ప్రజలకి అన్ని విషయాలను క్షుణ్ణంగా తెలియజేయాలని, జగనన్న ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజలకు చేరువ చేయాలన్నారు.


ఈ కార్యక్రమంలో డిపిఓ విజయ్ కుమార్ రెడ్డి, గ్రామ, వార్డు సచివాలయాల నోడల్ ఆఫీసర్ శివారెడ్డి, డ్వామా పిడి రామాంజనేయులు, డిఆర్డిఏ పిడి నరసయ్య, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ రషీద్ ఖాన్, పిఆర్ ఎస్ఈ గోపాల్ రెడ్డి, సర్పంచ్ సంధ్య, జెడ్పిటిసి అనూష, ఎంపిటిసి జగన్, వైస్ ఎంపిపి బయప్ప, ఎంపిడిఓ రాంకుమార్, తదితరులు పాల్గొన్నారు.



Comments