పన్ను వసూళ్లలో ఆంధ్రప్రదేశ్ ముందంజ.

 

విజయవాడ (ప్రజా అమరావతి);


*పన్ను వసూళ్లలో ఆంధ్రప్రదేశ్ ముందంజ


*

 

*సెంట్రల్ జీఎస్టీ వసూళ్ల కంటే రాష్ట్ర జీఎస్టీ వసూళ్లలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ది అగ్రస్థానం*


*విజయవాడ బీసెంట్ రోడ్డులోని సెంట్రల్ గ్రావిటీ బిల్డింగ్ 3వ అంతస్తులో ప్రాంతీయ జీఎస్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్*


*వాణిజ్య పన్నుల శాఖలో నిర్ణయాలు పారదర్శకంగా అమలు కావాలన్న  ఉద్దేశంతో తొలిసారి ఇన్వర్ట్ పిరమిడ్ తరహాలో సంస్కరణలు తద్వరా సత్ఫలితాలు..*


*ఇకపై వేర్వేరుగా పన్నుల చెల్లింపు రిజిస్ట్రేషన్,  ఎన్ ఫోర్స్ మెంట్, ఆడిట్ ప్రక్రియలు* 


*కమర్షియల్ ట్యాక్స్ చీఫ్ కమిషనర్  కార్యాలయం ద్వారా నిరంతర పర్యవేక్షణ* 


*ఎక్కడైనా పొరపాట్లు జరిగాయని నిర్ధారించుకున్నాకే తనీఖీలు* 


*వాణిజ్యశాఖ అంటే డీలర్ల ఫ్రెండ్లీ డిపార్ట్ మెంట్*


*పెండింగ్ కేసులు త్వరిగతిన పరిష్కరించేందుకు లీగల్ సెల్ ఏర్పాటు* 


*2022-23లో రూ.28,103 కోట్ల పన్ను వసూలు.. రాష్ట్ర చరిత్రలోనే ఇది అధికం..*


*పరిపాలన, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రతిపక్షంతో చర్చకు సిద్ధం..స్పష్టత ఉంటే చర్చకు రావాలని పిలుపు..*


: *రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి శ్రీ. బుగ్గన రాజేంద్రనాథ్*


 ముఖ్యమంత్రి శ్రీ.వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వాణిజ్య పన్నుల శాఖలో పలు సంస్కరణలు అమలు చేయడం ద్వారా సత్ఫలితాలు వెలువడుతున్నాయని రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి శ్రీ.బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు. శుక్రవారం విజయవాడ బీసెంట్ రోడ్డు సమీపంలోని సెంట్రల్ గ్రావిటీ బిల్డింగ్ మూడవ అంతస్తులో వాణిజ్య పన్నుల శాఖకు చెందిన ప్రాంతీయ జీఎస్టీ కార్యాలయాన్ని (రీజినల్ జీఎస్టీ ఆడిట్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ ఆఫీస్) మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రారంభించారు. వేదాశీర్వచనాలతో పండితులు పూర్ణకుంభంతో మంత్రిని కార్యాలయంలోకి ఆహ్వానించారు. అనంతరం ఆఫీస్ లోని ప్రతి అధికారి రూమ్ ను మంత్రి స్వయంగా పరిశీలించి తగు సూచనలు చేశారు. ఎండలు అధికంగా ఉండే ప్రాంతం కాబట్టి అధికారులకు, కార్యాలయ సిబ్బందికి వెలుతురు, చల్లదనం ఉండేలా తగు వసతులు కల్పించాలని సూచించారు. 


అనంతరం కాన్ఫరెన్స్ హాల్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మాట్లాడుతూ వాణిజ్య పన్నుల శాఖలో పారదర్శకంగా నిర్ణయాలు అమలు కావాలనే  ఉద్దేశంతో గతంలో ఎన్నడూ లేని విధంగా మొదటిసారి ఇన్వర్ట్ పిరమిడ్ తరహాలో సంస్కరణలు ప్రవేశపెట్టి పాలన విధానం అమలు చేస్తున్నామన్నారు. పన్నుదారుకి(ట్యాక్స్ పేయర్) లబ్ధి చేకూర్చేలా నిర్ణయాలు తీసుకున్నామన్నారు. గతంలో పన్నుల చెల్లింపు రిజిస్ట్రేషన్,  ఎన్ ఫోర్స్ మెంట్, ఆడిట్ లాంటి ప్రక్రియలు ఒకే అధికారి చూడటం వల్ల పొరపాట్లు దొర్లేవని, సంస్కరణల ఫలితంగా ఆ విధానానికి చెక్ పెడుతూ ఆ ప్రక్రియలన్నీ వేరువేరుగా జరిగేలా చేస్తున్నామన్నారు. ప్రభుత్వ శాఖల విధులు, బాధ్యతల్లో పిరమిడ్ విధానం అనుసరించడం ద్వారా మెరుగైన పాలన చేస్తున్నామన్నారు. వ్యక్తుల పరంగా పొరపాట్లు జరగకూడదనే ఈ విధానం అమల్లోకి తెచ్చామని, అధికారులకు కూడా ఈ విభజించిన విధానంతో వెసులుబాటు కలుగుతుందన్నారు.అంతేగాక కమర్షియల్ ట్యాక్స్ చీఫ్ కమిషనర్  కార్యాలయం ద్వారా నిరంతర పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. పై స్థాయిలో తీసుకునే ప్రతి నిర్ణయం డాష్ బోర్డు ద్వారా క్షేత్ర స్థాయి అధికారి వరకు చేరుతుందన్నారు. తాము ప్రవేశ పెట్టిన విధానం వల్ల అన్ని స్థాయిల్లో అధికార యంత్రాంగాన్ని, వారి అనుభవాన్ని వినియోగించుకునే అవకాశం ఉంటుందన్నారు. తమది డీలర్ల ఫ్రెండ్లీ డిపార్ట్ మెంట్ అని చెబుతూ గతంలో ట్రేడర్లు, డీలర్ల వెంట పడి పన్ను కట్టించేవారని, ప్రస్తుతం వారే స్వయంగా పన్నులు చెల్లించే విధానానికి శ్రీకారం చుట్టామన్నారు. పై స్థాయి నుండి క్షేత్ర స్థాయి వరకు ప్రధానకార్యాలయంతో ముడిపెట్టడం వల్ల తప్పులు దొర్లే ఆస్కారం లేదన్నారు. పలుమార్లు ప్రధాన కార్యాలయం పునఃపరిశీలిస్తుందని, అయినప్పటికీ ఎక్కడైనా పొరపాట్లు జరిగాయని నిర్ధారించుకున్నాకే తనీఖీలు చేపడుతామని స్పష్టం చేశారు. దీనివల్ల ఇకపై రోడ్లపై డీలర్లను వేధించడాలు, ఆకస్మిక తనిఖీ వంటి చర్యలు ఉండవని మంత్రి స్పష్టం చేశారు. పెండింగ్ కేసులు త్వరిగతిన పరిష్కరించేందుకు లీగల్ సెల్ ఏర్పాటు చేశామన్నారు. తద్వారా పెండింగ్ లో ఉన్న పన్నుల ఆదాయాలు వసూలు అవడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు ఆదాయం జమ అవుతుందన్నారు. 


2022-23లో పన్ను ఆదాయం (కంపెన్సేషన్ లేకుండానే) రూ.28,103 కోట్ల వసూలు అయితే 2021-22లో రూ.23,386 కోట్లు వసూలు అయ్యాయన్నారు. గతేడాదితో పోలిస్తే 25 శాతం పెరుగుదల ఉందన్నారు. రాష్ట్ర చరిత్రలోనే ఇది అధికమన్నారు. కేంద్ర జీఎస్టీ (సీజీఎస్టీ), రాష్ట్ర జీఎస్టీ (ఎస్ జీఎస్టీ) కి కేటాయించిన డీలర్ల పరంగా వచ్చిన పన్ను వసూళ్లను పరిశీలిస్తే కేంద్ర జీఎస్టీ ద్వారా వచ్చిన పన్ను ఆదాయం 21.36 శాతం ఉంటే రాష్ట్ర జీఎస్టీ ద్వారా వచ్చిన వసూళ్లు 25.23 శాతంగా ఉందన్నారు. అంటే కేంద్ర జీఎస్టీతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ లో 4 శాతం మేర (మొత్తంగా 23 శాతం పెరుగుదల) అదనంగా పన్నువసూలు అయిందని మంత్రి గణాంకాలతో సహా వివరించారు. అదే మహారాష్ట్రలో పరిశీలిస్తే అక్కడ సెంట్రల్ జీఎస్టీ 23.6 శాతంగా ఉంటే స్టేట్ జీఎస్టీ 24.4 శాతంగా అంటే 1 శాతం పెరుగుదల ఉందన్నారు. కర్ణాటకలో పరిశీలిస్తే సెంట్రల్ జీఎస్టీ 28.5 శాతంగా ఉంటే స్టేట్ జీఎస్టీ 27.5 శాతంగా అంటే 1 శాతం సెంట్రల్ జీఎస్టీ కన్నా తక్కువగా ఉందన్నారు. దేశవ్యాప్తంగా జీఎస్టీ వసూళ్లలో కర్ణాటక రాష్ట్రం మొదటిస్థానంలో, ఏపీ మూడో స్థానంలో ఉండగా సెంట్రల్ జీఎస్టీ కంటే స్టేట్ జీఎస్టీ వసూళ్ల విషయంలో 4 శాతంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా ఉండటం గర్వించాల్సిన విషయమన్నారు. 


రాష్ట్ర ఆదాయం, పన్నుల వసూళ్లు, పాలన విషయంలో కొందరు చేస్తున్న విమర్శలు అవాస్తవమన్నారు. నిజంగా మాకు పాలించడం రాకపోతే, అభివృద్ధి చేయకపోతే, రాష్ట్రం ప్రగతి పథంలో ముందుకు వెళ్లకుండా గడిచిన నాలుగేళ్లలో పన్ను వసూళ్లు ఎలా పెరిగాయని ప్రశ్నించారు. పెరిగిన వసూళ్లే తమ పాలనకు నిదర్శనమన్నారు. పరిపాలన, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రతిపక్షంతో చర్చకు సిద్ధమన్నారు. ఆర్థిక అంశాలపై స్పష్టత ఉంటే చర్చకు రావాలని మంత్రి పిలుపునిచ్చారు.  గతంలో కంటే మెరుగ్గా రహదారులపై రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతోందన్నారు. ఇదే విషయాన్ని అసెంబ్లీలో సైతం ఆధారాలతో సహా వివరించామన్నారు. రాష్ట్రంలో ఆర్ అండ్ బి రహదారులు చాలా మేర బాగున్నాయని, ఒకట్రెండు చోట్ల బాగోలేదని రాష్ట్రమంతటా అదే విధంగా ఉన్నాయని కొందరు దురుద్దేశపూర్వకంగా విమర్శలు చేస్తున్నారన్నారు. 4 రెట్లు అధికంగా రాష్ట్రానికి జాతీయ రహదారులు తీసుకొచ్చామన్నారు. గతంలో కంటే పరిశ్రమల ఏర్పాటులో, పారిశ్రామికాభివృద్ధిలో ముందంజలోనే ఉన్నామన్నారు.ఏటా సగటున రూ.11,000 కోట్ల పెట్టుబడులు వస్తున్నాయన్నారు.  కరోనా విపత్కర పరిస్థితుల్లో సైతం సంక్షేమాన్ని ఆపలేదన్నారు. ప్రతి నెలా ఠంఛన్ గా 1వ తేదీనే సామాజిక పింఛన్ లు అందించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. పరిపాలన,అభివృద్ధి విషయంలో తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో, భక్తిభావంతో పని చేస్తుందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు. ఈ సందర్భంగా వాణిజ్య శాఖలో మెరుగైన పనితీరు కనబర్చిన అధికారులను మంత్రి అభినందించారు.


కార్యక్రమంలో స్టేట్ ట్యాక్స్ చీఫ్ కమిషనర్ ఎం.గిరిజా శంకర్, కమిషనర్ రవిశంకర్, అడిషనల్ కమిషనర్ ఎస్.ఈ.కృష్ణ మోహన్ రెడ్డి, కార్యాలయ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Comments