ఓటర్ లిస్ట్ లో అక్రమాలపై నిరంతర పోరాటం.



*ఓటర్ లిస్ట్ లో అక్రమాలపై నిరంతర పోరాటం


*


*వైసీపీ కి ఓటమి భయంతోనే అక్రమంగా ఓట్ల తొలగింపు:- టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు*


*పార్టీ ఓటర్ వెరిఫికేషన్ కార్యక్రమంపై నేతలతో చంద్రబాబు నాయుడు సమీక్ష*


అమరావతి (ప్రజా అమరావతి):-ఓటర్ లిస్ట్ లో అక్రమాలపై నిరంతర అప్రమత్తంగా ఉండి పోరాటం చేయాలని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పార్టీ నేతలకు సూచించారు. రాష్ట్రంలో దొంగ ఓట్ల నమోదు, టీడీపీ అనుకూల ఓట్ల తొలగింపు అంశాలను సీరియస్ గా తీసుకోవాలని చంద్రబాబు నాయుడు సూచించారు. ఓటమి భయంతో వైసీపీ ఎన్నికల్లో అనేక అక్రమాలకు పాల్పడుతుందని...దాని కోసం ఇప్పటి నుంచే కుట్రలు మొదలు పెట్టిందని చంద్రబాబు నాయుడు అన్నారు. పార్టీ పరంగా జరుగుతున్న ఓటర్ వెరిఫికేషన్ పై రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎలక్షన్ కమిటీ సభ్యులతో చంద్రబాబు నాయుడు పార్టీ కార్యాలయం లో సమీక్షించారు. ఓటర్ వెరిఫికేషన్ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో ఇప్పటి వరకు 20 లక్షల దొంగ ఓట్లు ఉన్నట్లు గుర్తించామని నేతలు తెలిపారు. వీటిపై చర్యలు కోరుతూ అక్రమాలపై సాక్ష్యాధారాలతో సహా వివరాలను ప్రధాన ఎన్నికల అధికారికి ఫిర్యాదు  చేశామని చంద్రబాబు కు నేతలు వివరించారు. చనిపోయిన వారి ఓట్లు తొలగించకపోవడం, దొంగ ఓట్లు నమోదు చేయడం, టీడీపీ కి అనుకూలం అని భావించే వారి ఓట్లను తొలగించడం, ఒక బూత్ లో ఓట్లను మరో బూత్ కు బదలాయించడం వంటి అక్రమాలపై చర్యలు తీసుకోవాలని తాము కోరామని చెప్పారు. నియోజకవర్గాల వారీగా దొంగ ఓటర్ జాబితాలో ఉన్న అనర్హుల ఓట్ల లిస్ట్ ను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఇచ్చామని నేతలు పార్టీ అధినేతకు వివరించారు. వైసీపీ దొంగ ఓట్ల వంటి అక్రమాలకు పాల్పడుతూ...ఆ బురదను తిరిగి టీడీపీకి అంటించే ప్రయత్నాలను గట్టిగా ఎండగట్టాలని చంద్రబాబు సూచించారు. పార్టీ చేపట్టే కార్యక్రమాల్లో ఓటర్ వెరిఫికేషన్ కు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని...ప్రజలను కూడా ఇందులో భాగస్వాములు చేయడం ద్వారా వైసీపీ అక్రమాలకు అడ్డుకట్ట వేయవచ్చు అన్నారు. అనర్హులకు ఓట్ల విషయంలో ఉద్దేశ్య పూర్వకంగా తప్పులు చేసే ఏ అధికారినీ వదిలేది లేదని చంద్రబాబు నాయుడు నేతలతో అన్నారు.

Comments