రైతులకు తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం చేకూర్చటమే ప్రభుత్వ లక్ష్యం.


విజయవాడ (ప్రజా అమరావతి);

 

                    రైతులకు తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం చేకూర్చటమే ప్రభుత్వ లక్ష్యం


పురుగుమందుల అవశేషాలు లేని వ్యవసాయ ఉత్పత్తులకు ప్రపంచ మార్కెట్ లో మంచి గిరాకీ.

ఇతర దేశాలకు ఎగుమతులు చేయటం ద్వారా రైతులకు మంచి లాభాలు. 

రైతులకు గిట్టుబాటు ధర కంటే అధిక ధర ఇచ్చేందుకు ఎగుమతిదారులు ముందుకు రావాలి..

దళారుల ప్రమేయం లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్న ఏకైక రాష్ట్రం మన రాష్ట్రం

ఎగుమతుదారులకు, రైతాంగానికి మద్య వారధిలా రాష్ట్ర ప్రభుత్వం తన సహకారం అందిస్తుంది

త్వరలో “ఇంటిగ్రేటెడ్ ఎక్స్ పోర్ట్ పార్క్”ను ఏర్పాటు చేస్తాం..

- వ్యవసాయశాఖా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి 

విజయవాడ : తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం చేకూర్చటమే ప్రభుత్వ అంతిమ లక్ష్యమని, గిట్టుబాటు ధర కంటే అధిక ఆదాయం పొందాలంటే సేంద్రియ వ్యవసాయ పంటల సాగు చేపట్టాలని, పురుగుమందుల అవశేషాలు లేని వ్యవసాయ ఉత్పత్తులకు ప్రపంచ మార్కెట్ లో మంచి గిరాకీ ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖామాత్యులు శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు.  వ్యవసాయ, ఉధ్యానవన, ప్రాసెస్ చేసిన ఆహార ఉత్పత్తుల ఎగుమతుల అవకాశాలను పెంపొందించేందుకు రైతులు, ఎగుమతిదారులతో వర్క్ షాపు విజయవాడలోని హైయత్ ప్యాలస్ హోటల్ లో మంగళవారం నిర్వహించారు. వర్క్ షాపును  జ్యోతి ప్రజ్వలన చేసి మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ మన రాష్ట్రం వ్యవసాయ ఆధార రాష్ట్రమని, మన రాష్ట్రం నుంచి దేశంలోనే అధిక స్థాయిలో వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతులు జరుగుతున్నాయని, ఇవి మరింత ఎక్కువగా పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కంటే ఎక్కువ ధర వ్యవసాయ ఉత్పత్తులకు ఇచ్చెందుకు ఎగుమతిదారులు ముందుకు రావాలన్నారు.  రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ. వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి రైతన్నకు అధిక లబ్ధి చేకూర్చాలని నిరంతరం తపన పడుతున్నారని, రైతు సంక్షేమం కోసం రైతు భరోసా, యంత్రసేవా పథకం, ఆర్ బీ కేల ఏర్పాటు ఇలా విత్తనం నుండి విక్రయం వరకు రైతన్నలకు అండగా ప్రభుత్వం ప్రతి దశలోనూ నిలుస్తుందన్నారు. ఇందులో భాగంగానే మార్కెట్ యార్డ్ లను బలోపేతం చేయటానికి ఇప్పటికే ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఎగుమతుల్లో రైతులు ఎదుర్కోంటున్న ఇబ్బందులను గమనించి వారికి అండగా నిలవటానికి రైతులు, ఎఫ్ పీ వో, అధికారులు, ఎక్స్‌పోర్టర్స్ లతో వర్క్ షాపులు నిర్వహించి నిర్వహణ ఇబ్బందులకు చెక్ పెట్టి రైతులకు మేలు చేకూర్చాలన్నదే ప్రభుత్వ సంకల్పమన్నారు.  లబ్ధిదారులకు, ప్రభుత్వానికి మద్య దళారులు లేకుండా నేరుగా డిబీటీ పద్దతిలో లబ్ధిదారులు, రైతుల ఖాతాల్లోనే జమ చేస్తున్న ఎకైక రాష్ట్రం మన రాష్ట్రమేనన్నారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు ఇతర రాష్ట్రాలు సైతం మన రాష్ట్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల తీరుతెన్నులను గమనించి వారి రాష్ట్రాల్లో అమలు చేయటానికి సుముఖుత వ్యక్తం చేయటం హర్షనీయమన్నారు. ఇందుకు ఉదాహరణే ఫసల్ భీమా యోజన పథకమని చెప్పారు. మన రాష్ట్రం నుంచి వ్యవసాయ, అనుబంధ, ఉధ్యానవన ఉత్పత్తులను 100 దేశాలకు ఎగుమతులు చేస్తున్నామని, వచ్చే ఏడాదికి ఎగుమతులు రెండింతలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఇందుకు రైతులకు అందుబాటులో నిత్యం ఉండి వారిని ప్రోత్సహించేందుకు ఎఫ్ పీ వో లు పనిచేస్తాయని చెప్పారు. 

           వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సెక్రటరీ గోపాల కృష్ణ ద్వివేది మాట్లాడుతూ రైతులకు ఎగుమతిదారులకు మద్య ప్రభుత్వం సమన్వయకర్తగా పనిచేసి రైతులకు అన్ని విధాలుగా సహకారం అందిస్తూ వారికి అధిక ధర లభించేలా కృషి చేస్తుందన్నారు.  రైతుల్లో భరోసా కల్పించి, రైతులు అధిక లాభాలు సాధించటానికి అధికార బృంధం యాక్సన్ ప్లాన్ రూపొందించి పటిష్టంగా అమలు చేయాలని ఆదేశించారు. అలాగే ఎక్స్ పోర్ట్స్ లో రైతుల సమస్యలకు చెక్ పెట్టడానికి “ఇంటిగ్రేటెడ్ ఎక్స్ పోర్ట్ పార్క్” ను ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు. ప్రాసెసింగ్ యూనిట్లు మన రాష్ట్రంలో ఎక్కువగా ఏర్పాటు చేయటానికి వ్యాపారులను ప్రోత్సహించాలని, అలాగే ప్రాసెసింగ్, ప్యాకింగ్ యూనిట్లు ప్రతి ప్రాంతంలోనూ అందుబాటులోకి వస్తే రైతులకు గిట్టుబాటు ధర కంటే అధిక లాభాలు సాధిస్తారని తెలిపారు. వర్క్ షాపు ముగిసేలోపు రైతులు, ఎఫ్ పీ వోలు, అధికారుల తో వాట్సప్ గ్రూపు ఏర్పాటు చేసి వారితో నిత్యం అందుబాటులో ఉండాలని సూచించారు. రైతులు తమ ఉత్పత్తులను ఇతర రాష్ట్రాల కంటే ఇతర దేశాలకు ఎగుమతి చేసినప్పుడే అధిక లాభాలు సాధించగలరన్నారు. నాణ్యమైన పంట ఉత్పత్తుల సాగుకు అవసరమైన సహకారం అధికారుల నుంచి అందుతుందని, రైతులు వారి సలహాలు, సూచనలతో అధిక దిగుబడులతో పాటు నాణ్యమైన ఉత్పత్తులను సాధించగలరన్నారు. 

                      వ్యవసాయ శాఖ స్పెషల్ కమీషనర్ హరికిరణ్ మాట్లాడుతూ రాష్ట్రంలో రైతు సేవలో 10778 రైతు భరోసా కేంద్రాలు పనిచేస్తున్నాయని, విత్తు నుంచి వక్రయం వరకు సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. నాణ్యమైన, అధిక దిగుబడుల కోసం రైతులకు రాష్ట్ర వ్యాప్తంగా  శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. సేంద్రియ వ్యవసాయ సాగుకు రైతులు మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు. ఉధ్యానవన శాఖ కమీషనర్ శ్రీధర్ మాట్లాడుతూ మన రాష్ట్రంలో వ్యవసాయ, ఉధ్యానవన పంటలు 135 రకాలు రైతులు సాగు చేస్తున్నారన్నారు. మామిడి, అరటి, బత్తాయి తదితర పంటల ఎగుమతుల్లో దేశంలోనే మన రాష్ట్రం మొదటి రెండు, మూడు స్థానాల్లో నిలవటం గర్వకారణమన్నారు. రైతులను మరింత ప్రోత్సహిస్తే ఎగుమతులు రెండింతలు కావటం ఖాయమన్నారు. రైతులకు సహాయ సహకారాలు అందించటానికి రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 250 ఎఫ్ పీ వో లు ఏర్పాటు చేశామన్నారు. 

     ఏపీ సీడ్స్ ఎండీ శేఖర్ బాబు మాట్లాడుతూ మన రాష్ట్రంలో 85 లక్షల మంది వ్యవసాయ ఆదారంగా జీవనం సాగిస్తున్నారన్నారు. అందుకనే రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి రైతులకు అండగా నిలవటానికి అనేక సంస్కరణలు తీసుకువచ్చిందన్నారు.  రాష్ట్ర వ్యాప్తంగా 17 లక్షల కుపైగా ఎఫ్ పీ వోల ద్వారా ఇప్పటికే రైతులకు శిక్షణా తరగతులు నిర్వహించినట్లు చెప్పారు. 

                         కార్యక్రమంలో భాగంగా రైతుల, ఎగుమతిదారులు, అధికారులతో ఐదు గ్రూపులను ఏర్పాటు చేసి రైతన్నల సమస్యలను పరిష్కరించే విధంగా గ్రూపు డిస్కషన్ నిర్వహించారు. వాటిలో ఆహార ధాన్యాలు- చిరుధాన్యాలు గ్రూపు, పప్పు దినుసులు- నూనె నింజల గ్రూపు, పుడ్స్-విజిటెబుల్స్ గ్రూపు, సుంగంధ ద్యవ్యాల గ్రూపు, ఆహార పదార్థాల ప్రాసెసింగ్ గ్రూపు ముఖ్యమైనవి. ఈ కార్యక్రమంలో పోలయ్య, త్రివక్రమ రెడ్డి, బాలూ నాయక్, సుభాష్ కిరణ్, కుమార్ వేల్, పెద్ద స్వామి, శ్రీనివాసరావు, విజయ్ కుమార్, ఎఫ్ పీ వో కో ఆర్డినేటర్లు, అధికారులు, రైతులు, ఎక్స్ పోర్టర్స్ తదితరులు పాల్గొన్నారు. 


Comments