ఆర్టీసీ హౌస్ లో శ్రీ అల్లూరి సీతారామరాజు 126 వ జయంతి వేడుకలు.

 ఆర్టీసీ హౌస్ లో శ్రీ అల్లూరి సీతారామరాజు 126 వ జయంతి వేడుకలు.   


                                                      విజయవాడ (ప్రజా అమరావతి);

అల్లూరి సీతారామరాజు 126 వ జయంతి వేడుకలు ఈ రోజు ఆర్టీసీ ప్రధాన కార్యాలయం, ఆర్టీసీ హౌస్ నందు ఘనంగా నిర్వహించారు.  ఈ వేడుకలకు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ సి. హెచ్. ద్వారకా తిరుమల రావు, ఐ.పి.ఎస్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం అల్లూరి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.  ఈ వేడుకకు సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(అడ్మిన్ ) శ్రీ కె. ఎస్. బ్రహ్మానంద రెడ్డి అధ్యక్షత వహించారు.  ఈ కార్యక్రమానికి హాజరైన పలువురు అధికారులు, అసోసియేషన్ల ప్రతినిధులు పూలుజల్లి  అల్లూరి సీతారామరాజుకు  నివాళులు అందించారు.  


సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (అడ్మిన్) శ్రీ కె. ఎస్. బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ అల్లూరి చేసిన పోరాటం మర్చిపోలేనిదని, ఆయన చూపిన తెగువ, స్వాతంత్ర్యకాంక్షలను కొనియాడారు.  ఆయన చేసిన త్యాగానికి గుర్తుగా ఏకంగా ఒక నూతన జిల్లా ఆయన పేరిట రూపు దిద్దుకున్నదని పేర్కొన్నారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఆపరేషన్స్) శ్రీ ఎ. కోటేశ్వరరావు మాట్లాడుతూ అణచివేతకు గురవుతున్న నిరక్షరాస్యులైన గిరిజన ప్రజల పక్షాన నిలబడి వారినే సైన్యంలా తయారుచేసుకుని అల్లూరి సీతారామరాజు ఆంగ్లేయుల పాలనను ఎదిరించి  పోరాటం జరిపి అందరికీ స్పూర్తిగా నిలిచారన్నారు.  

అనంతరం సంస్థ ఎం.డి శ్రీ సిహెచ్. ద్వారకా తిరుమల రావు, ఐ.పి. ఎస్.  మాట్లాడుతూ  అల్లూరి సీతారామరాజు 126 వ జయంతి వేడుకలు జరుపుకుంటున్నామన్నారు. ఆంగ్లేయుల పాలనలో పీడింపబడిన ఆదివాసీలను సంఘటితపరచి వారిని స్వాతంత్ర్య పోరాటంవైపు మళ్లిస్తూ అల్లూరి సీతారామరాజు భారత స్వాతంత్రోద్యమం కోసం పోరాటపటిమ కనబరచారని, తద్వారా చరిత్రలో మరచిపోలేని స్వాతంత్ర్యయోధునిగా నిలిచిపోయారన్నారు.  బ్రిటిష్ పాలనపై తిరుగుబాటు చేసి తనదైన పోరాట మార్గంలో నిజాయితీ కనబరుస్తూ సీతారామరాజు ముందుకు సాగారన్నారు. మన్యం ప్రజల కోసం తన జీవితాన్ని అంకితమిచ్చి, విప్లవ స్పూర్తి రగిలించిన ఘనుడని కీర్తించారు. అనేక విద్యలలో ప్రావీణ్యం సాధించి బ్రిటీష్ పోలీసులపై తిరుగుబాటు చేయడమే కాకుండా తనదైన నాయకత్వంతో బానిసత్వంపై పోరుబాట సాగించిన గొప్ప వ్యక్తని కీర్తించారు. తాను జీవించిన 27  ఏళ్ల వయసులోనే చరిత్రలో నిలిచిపోయేలా అపారమైన కీర్తిని సాధించిన ఘనుడని కొనియాడారు.  

ఈ వేడుకలు సంస్థ హెచ్. ఆర్. డి అండ్ వెల్ఫేర్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించబడ్డాయి. ఈ వేడుకలకు సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (అడ్మిన్) శ్రీ కె. ఎస్. బ్రహ్మానందరెడ్డి , ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఆపరేషన్స్) శ్రీ ఎ. కోటేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఇంజనీరింగ్) శ్రీ పి. కృష్ణమోహన్, ఎఫ్. ఎ శ్రీ రాఘవ రెడ్డి, డిప్యూటీ సిపిఏం (హెచ్.ఆర్.డి అండ్ వెల్ఫేర్) కుమారి డి. సాంబ్రాజ్యం, ఏ.డి (విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ) శోభామంజరి ఇంకా తదితర ఉన్నతాధికారులు, అధికారులు, సూపర్వైజర్లు, వివిధ అసోసియేషన్ల ప్రతినిధులు, పలువురు ఉద్యోగులు హాజరై అల్లూరి సీతారామరాజు త్యాగనిరతిని గుర్తు చేసుకుని నివాళులర్పించారు. 

Comments