ఇళ్ల నిర్మాణం.. ఏపీకి కేంద్రం రూ.20 వేల కోట్లిచ్చింది: పురందేశ్వరి..

  ఇళ్ల నిర్మాణం.. ఏపీకి కేంద్రం రూ.20 వేల కోట్లిచ్చింది: పురందేశ్వరి..



విజయవాడ (ప్రజా అమరావతి): రాష్ట్రంలో రహదారుల దుస్థితేంటో ప్రజలను అడిగితే తెలుస్తుందని ఏపీ భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి విమర్శించారు. భాజపా రాష్ట్ర అధ్యక్షురాలిగా ఆమె విజయవాడలోని పార్టీ కార్యాలయంలో నేడు బాధ్యతలు స్వీకరించారు..


బాధ్యతలు స్వీకరణ తర్వాత తొలిసారి మీడియాతో మాట్లాడిన పురందేశ్వరి.. వైకాపా సర్కారు తీరును ఎండగట్టారు.

''ఇళ్ల నిర్మాణానికి 9 ఏళ్లలో రాష్ట్రానికి కేంద్రం రూ.20 వేల కోట్లు ఇచ్చింది. రాష్ట్రంలో ఇప్పటికే 65 శాతం ఇళ్ల నిర్మాణాలు పూర్తయి ఉండాలి. కానీ, 35 శాతం కూడా పూర్తి కాలేదనేది వాస్తవం. ఈ విషయంలో పేదలకు వైకాపా ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది? రాష్ట్రంలో రహదారుల దుస్థితేంటో ప్రజలను అడిగితే తెలుస్తుంది. ఏపీలో పెట్టుబడులకు ఎవరూ ముందుకు రాని పరిస్థితి ఏర్పడింది. ఉన్న పరిశ్రమలూ తరలిపోతున్నాయి'' అని పురందేశ్వరి విమర్శించారు..


తొలుత ఎన్టీఆర్‌ ఘాట్‌కు వెళ్లి..

విజయవాడలో బాధ్యతలు స్వీకరణ కంటే ముందు.. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌ను పురందేశ్వరి సందర్శించారు. తండ్రి ఎన్టీఆర్‌ సమాధి వద్ద తన నియామక పత్రాన్ని ఉంచి పుష్పాంజలి ఘటించారు. ఆ తర్వాత గన్నవరం చేరుకున్న ఆమెకు.. కార్యకర్తలు భారీ గజమాలతో స్వాగతం పలికారు. ఆపై భారీ వాహన ప్రదర్శనతో విజయవాడకు వచ్చి.. అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. పురందేశ్వరి వెంట ఏపీ భాజపా మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు, నేతలు సత్యకుమార్‌, కిరణ్‌ కుమార్‌ రెడ్డి ఉన్నారు..

Comments