భారతదేశ జిడిపిలో మత్స్య ఉత్పత్తుల రంగం కీలకం.

 

మచిలీపట్నం, జూలై 7 (ప్రజా అమరావతి);


*భారతదేశ జిడిపిలో మత్స్య ఉత్పత్తుల రంగం కీలకం*


 


*2047 నాటికి దేశాభివృద్ధికి ప్రధాని దిశా నిర్దేశం-కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు*


భారతదేశ జిడిపిలో మత్స్య ఉత్పత్తుల రంగం ప్రధానమైనదని కేంద్ర భూ విజ్ఞాన శాస్త్ర మంత్రిత్వ శాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు.


ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా సముద్ర సమాచార వ్యవస్థల భారత జాతీయ కేంద్రం ఆధ్వర్యంలో సముద్ర సమాచారం మరియు సలహా సేవలపై భారీ అవగాహన కార్యక్రమం శుక్రవారం స్థానిక రెవెన్యూ కల్యాణ మండపంలో నిర్వహించారు.


రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, జిల్లా కలెక్టర్ పి రాజాబాబు, బందరు పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి, జాయింట్ కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్ తదితరుల సమక్షంలో కేంద్ర మంత్రి జ్యోతి ప్రజ్వలన గావించి అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు.


ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ సముద్ర సమాచార వ్యవస్థల భారత జాతీయ కేంద్రం హైదరాబాద్ వారు మత్స్యకారులు చేపల వేట యజమానులకు నిరంతరం సముద్ర సమాచారం అందిస్తున్నారని,  సునామీ వంటి ప్రకృతి విపత్తుల విషయంలో ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తున్నారని అన్నారు.  సముద్రంలో చేపలు సమృద్ధిగా దొరుకు ప్రాంతాలను గుర్తించి మత్స్యకారులు బోటు యజమానులకు తెలియజేస్తూ, సముద్రంలో ప్రమాదకరమైన ప్రాంతాలను గుర్తించి హెచ్చరించడం వంటి బృహత్తర సమాచారాన్ని అందజేస్తున్నట్లు తెలిపారు.

ఇంతటి బృహత్తర కార్యకలాపాలను నిర్వహిస్తున్న ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓ షన్ ఇన్ఫర్మేషన్ సిస్టం (INCOIS) వారు వారి కార్యకలాపాలను సముద్ర సంబంధిత సమాచారాన్ని మత్స్యకారులకు నేరుగా/ ప్రత్యక్షంగా వివరించి అవగాహన కల్పించేందుకు భారత ప్రభుత్వ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా భారతదేశ తూర్పు, పశ్చిమ తీరాలలో నిర్వహించ తలపెట్టిన 5 వర్క్ షాపులలో మొదటిగా ఆంధ్రప్రదేశ్లో మచిలీపట్నంలో నేడు వర్క్ షాప్ ఏర్పాటు చేయడం మనందరికీ ఆనందదాయకం అన్నారు.


దేశీయంగా అభివృద్ధి చేసిన సాంకేతికత ద్వారా సముద్ర సమాచారం, సలహా సేవలు అందజేయడం ఆత్మ నిర్భర్ భారత్ (భారతదేశ స్వావలంబన)కు ఎంతగానో దోహదం చేస్తుందన్నారు.


గతంలో సముద్ర తీరంలో గుర్తించిన గ్రామాలలో ఏర్పాటుచేసిన సమాచార కేంద్రాల ద్వారా ఈ సమాచారాన్ని మత్స్యకారులకు, బోటు యజమానులకు అందించేవారని అన్నారు. కాలానుగుణంగా వచ్చిన సాంకేతిక అభివృద్ధి వలన నేడు మత్స్యకారులు, బోటు యజమానులు, సముద్ర సంబంధిత సంస్థలు, పరిశోధనా సంస్థలు, విద్యా కేంద్రాలు, విద్యార్థులు, సముద్ర పరిశోధకులు, నౌకా పరిశ్రమ, చమురు సహజవాయువు పరిశ్రమ, భారత నావికా దళం మరియు కో స్ట్ గార్డ్ మొదలగువారి ఆండ్రాయిడ్ /స్మార్ట్ ఫోన్ లకు ఇన్కయిస్ వారు నేరుగా సమాచారాన్ని చేరవేస్తున్నారన్నారు.


చేపలు సమృద్ధిగా దొరుకు ప్రాంతాల సమాచారం ద్వారా సమయం, ఇంధనం, డబ్బు, మానవ శక్తి ఆదా అవుతాయని ఉన్నారు


సునామీ వంటి ప్రకృతి విపత్తులకు సంబంధించిన ముందస్తు హెచ్చరికలు తీర ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకు ప్రత్యేకించి మత్స్యకారులకు ఆస్తి, ప్రాణ నష్ట నివారణకు ఎంతగానో ఉపయోగమన్నారు.


ఈ ప్రాంత మత్స్యకారులు, బోటు యజమానులకు సముద్ర సంబంధిత విషయాలు చేపల సమృద్ధిగా దొరుకు ప్రాంతాలను గురించి మంచి అవగాహన పొందాలని కేంద్ర మంత్రి సూచించారు.


భారతదేశానికి అపార సముద్ర తీరం ఉండడం మత్స్య రంగ అభివృద్ధికి దోహదం చేస్తున్నదని అన్నారు భారతదేశ జిడిపిలో మత్స్యరంగానిదే అగ్రస్థానం అన్నారు. సముద్ర తీరం అధికంగా గల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మత్స్య రంగ అభివృద్ధికి అపార అవకాశాలు ఉన్నాయని అన్నారు 2047 నాటికి భారతదేశ అభివృద్ధికి ప్రధాని దిశ నిర్దేశం చేశారని తెలిపారు.


రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళినప్పుడు వారు తిరిగి వచ్చేదాకా వారి కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతారని అలాంటి సమస్య లేకుండా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సముద్ర సమాచార వ్యవస్థ మత్స్యకారులకు అవసరమైన సమాచారాన్ని అందిస్తుందన్నారు చేపల వేట నిషేధ సమయంలో గతంలో కేవలం 4 వేలు ఇచ్చేవారని, ప్రస్తుతం ప్రభుత్వం 10,000 అందజేస్తున్న విషయం గుర్తు చేశారు. చేపల వేట మీద ఆధారపడి మత్స్యకారుల జీవితాలు ఆర్థికంగా బలోపేతం చెందడానికి అవసరమైన ఆధునీక సౌకర్యాలు కల్పిస్తూ మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్ నిర్మాణం శరవేగంగా జరుగుతోందని, పనులు పూర్తి కావచ్చాయని అన్నారు రాష్ట్రంలో మరో ఏడు హార్బర్లు నిర్మాణం జరుగుతోందన్నారు. మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు.


జిల్లా కలెక్టర్ పి రాజాబాబు మాట్లాడుతూ చేపల వేట ఎంతో వ్యయ ప్రయాసలతో కూడినదని అన్నారు. ఆధునిక పరిజ్ఞానంతో సముద్రంలో మత్స్య సంపద ఉన్న ప్రదేశాలను గుర్తించి అట్టి సమాచారం మత్స్యకారులకు చేరవేయడం ద్వారా వారికి సమయం, ఇంధనం ఆదా అవుతాయన్నారు. గతంలో విదేశాల నుండి పొందిన పరిజ్ఞానం ప్రస్తుతం మన దేశంలోనే అభివృద్ధి చెందిందని, మొబైల్ యాప్ ద్వారా మత్స్యకారులకు చేరవేస్తుందని అన్నారు. మత్స్యకారులు మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని సముద్ర సమాచార సేవలు పొందవచ్చు అన్నారు. జిల్లాలో మత్స్యకారులకు ఈ విషయాలపై అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు


బందరు పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి మాట్లాడుతూ ఆధునిక టెక్నాలజీ మత్స్యకారులకు అందించే ముఖ్య ఉద్దేశంతో ఈ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయబడింది అన్నారు. మచిలీపట్నంలో రీజనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రికి విన్నవించారు. పార్లమెంటు సభ్యుని నిధులు, సి ఎస్ ఆర్ ఫండ్స్ తో ఆధునిక సాంకేతిక వ్యవస్థ కలిగిన ఆధునిక బోటు ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు ఎంపీ తెలిపారు. అందుకు మత్స్య కార యువతను గుర్తించాలని అన్నారు. మత్స్యకారులకు అవసరమైన డ్రై ఫిష్ ప్లాట్ ఫామ్ ల ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు.


ఎమ్మెస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ జి ఎన్ హరిహరన్, ఇం కాయిస్ డైరెక్టర్ డాక్టర్ టి శ్రీనివాస కుమార్, భూ విజ్ఞాన శాస్త్రం మంత్రిత్వ శాఖ జాయింట్ డైరెక్టర్  సెంథిల్ పాండియన్ ఈ కార్యక్రమంలో పాల్గొని మత్స్యకారులకు అందించే సేవలు వివరించారు.


తొలుత కేంద్ర మంత్రి ఇంకాయిస్ సముద్ర సమాచార వ్యవస్థ లో వినియోగించే పరికరాల ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు


కొచ్చిన్ షిప్ యార్డ్ వారు డీప్ సీ ఫిషింగ్ గురించి ప్రజెంటేషన్ ఇచ్చారు.


అనంతరం మత్స్యకారులకు కేంద్రమంత్రి జెమిని డివైస్ లు అందజేశారు.


ఈ కార్యక్రమంలో కృత్తివెన్ను జడ్పిటిసి మైలా రత్నకుమారి, మత్స్య సహకార సంఘాల ప్రతినిధులు చింత గోవిందరాజులు తదితరులు, జిల్లా మత్స్యశాఖ అధికారి శ్రీనివాసరావు, పెద్ద సంఖ్యలో మత్స్యకారులు పాల్గొన్నారు.

Comments