చేనేత వస్త్ర పరిశ్రమ 'నైపుణ్యం'పై మంత్రి బుగ్గన నేతృత్వంలోని బృందం అధ్యయనం.



*చేనేత వస్త్ర పరిశ్రమ 'నైపుణ్యం'పై మంత్రి బుగ్గన నేతృత్వంలోని బృందం అధ్యయనం


*


*యెంగ్నామ్ విశ్వవిద్యాలయంలోని 'సింథటిక్ టెక్స్‌టైల్స్ పరిశోధన కేంద్రం' సందర్శన*


*'కొరియన్ టెక్స్‌టైల్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌' పరిశోధన తీరు పరిశీలన*


*'కొరియా టెక్స్ టైల్ మెషినరీ కన్వర్జెన్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్' సందర్శన*


*దక్షిణ కొరియాలోని సియోల్ నగరంలో కొనసాగుతున్న మంత్రి బుగ్గన పర్యటన*


అమరావతి, జూలై, 19 (ప్రజా అమరావతి); దక్షిణ కొరియాలోని సియోల్ నగరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పర్యటన కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ చేనేత వస్త్ర పరిశ్రమ 'నైపుణ్యం'పై అధ్యయనం చేస్తున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు. అందులో భాగంగా 'కొరియన్ టెక్స్‌టైల్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌'ను సందర్శించినట్లు ఆయన పేర్కొన్నారు. టెక్స్‌టైల్ రంగంలో నైపుణ్యాభివృద్ధి , శిక్షణకు గల అవకాశాలపై సంబంధిత సంస్థ ప్రతినిధులతో మంత్రి బుగ్గన చర్చించారు. అనంతరం దక్షిణ కొరియాలోని డేగు ప్రాంతంలో ఉన్న యెంగ్నామ్ విశ్వవిద్యాలయాన్ని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ విజిట్ చేశారు. యూనివర్శిటీలోని సింథటిక్ టెక్స్‌టైల్స్ పరిశోధన కేంద్రం సహా, కెమికల్ ఇంజినీరింగ్ ల్యాబ్ ను పరిశీలించారు. వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి కొరియాలో అనుసరిస్తున్న వినూత్న మార్గాలపై మంత్రి బుగ్గన ఆరా తీశారు. ఏపీలో చేనేత రంగంపై వేలాది మంది నేతన్నలు ఆధారపడిన ఆంధ్రప్రదేశ్ లో ఈ విధానాలను అమలు చేయడం , విద్యార్థులకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన  శిక్షణను అందించడం ద్వారా యువతకు ఉపాధి కల్పించే అవకాశాలపై  యూనివర్శిటీ ప్రతినిధులతో సుదీర్ఘంగా మంత్రి చర్చించారు. ఆ విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసించే భారతీయ విద్యార్థులతో మంత్రి బుగ్గన మాట్లాడారు. ఆ తర్వాత 'కొరియా టెక్స్ టైల్ మెషినరీ కన్వర్జెన్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్' ని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సందర్శించారు. అక్కడ అనుసరిస్తున్న అత్యాధునిక విధానాలను మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అడిగి తెలుసుకున్నారు.


 అంతకుముందు సియోల్ లోని 'కియా మోటార్స్ కార్పొరేషన్'లో  ఆర్థిక, ప్రణాళిక , నైపుణ్యాభివృద్ధి, శిక్షణశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సమావేశమయ్యారు. ఆ సంస్థ గ్లోబల్ ప్రెసిడెంట్, సీఈవో హో సంగ్ సాంగ్ తో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమ విస్తరణ సహా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఎలక్ట్రానిక్, ఆటోమొబైల్, మానుఫాక్చరింగ్ రంగాల్లో మరింత భాగస్వామ్యంపై మంత్రి బుగ్గన చర్చించారు.మంత్రి బుగ్గనకు కియా మోటార్స్ గ్లోబల్ సంస్థ సాదర స్వాగతం పలికింది. ఈ కార్యక్రమంలో చేనేత, జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి కె.సునీత, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్. సురేష్ కుమార్, నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండీ డాక్టర్ వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. 



Comments