వర్షాభావ పరిస్థితులు నెలకొన్న జిల్లాల్లో ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక సిద్దం చేయండి.

 వర్షాభావ పరిస్థితులు నెలకొన్న జిల్లాల్లో ప్రత్యామ్నాయ పంటల  ప్రణాళిక సిద్దం చేయండి



* ఆరు జిల్లాల్లోని 130 మండలాల్లో తక్కువ వర్షపాతం


* ప్రత్యామ్నాయ పంటలకు అవసరమైన విత్తనాలు సిద్ధం 


* అధిక వర్షంతో వరినారు మడులు దెబ్బతిన్న రైతులకు స్వల్పకాలిక రకం విత్తనాల సరఫరాకు చర్యలు 


ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి 


అమరావతి,29 జూలై (ప్రజా అమరావతి): రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న ఆరు జిల్లాల్లో ప్రత్యామ్నాయ పంటలు వేసుకునేందుకు వీలుగా కంటిన్జెన్సీ ప్రణాళికను సిద్ధం చేయాలని  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో వరద,కరువు పరిస్థితులపై శనివారం విజయవాడలోని సిఎస్ క్యాంపు కార్యాలయంలో  ఆయన వ్యవసాయ,పశు సంవర్థక,మత్స్య,ఉద్యానవన, పట్టు పరిశ్రమ శాఖల అధికారులతో సమీక్షించారు.


ఈసందర్భంగా సిఎస్ మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితులు నెలకొన్న జిల్లాల్లో కంటిన్జెన్సీ ప్రణాళిక అమలుకు సంసిద్ధంగా ఉండాలని  ఆదేశించారు.అదే విధంగా అధిక వర్షాలు కారణంగా వరి నారుమడులు దెబ్బతిన్న రైతులకు స్వల్పకాలంలో దిగుబడినిచ్చే విత్తనాలు సరఫరాకు కూడా తగిన చర్యలు తీసుకోవాలని సిఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు.


అలాగే పశువులకు పశుగ్రాసం సరఫరా చేయడంపై సిఎస్ జవహర్ రెడ్డి సమీక్షించారు. మత్స్య,ఉద్యానవన,పట్టు పరిశ్రమ శాఖలకు సంబంధించి చర్చించారు.


ఈసమావేశంలో రాష్ట్ర వ్యవసాయ,పశుసంవర్థక, మత్స్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తూ రాష్ట్రంలో ఖరీఫ్ లో మొత్తం 34.39 లక్షల హెక్టార్ల సాధారణ విస్తీర్ణం కాగా ఇప్పటి వరకు 9.22 లక్షల  హెక్టార్లలో వివిధ పంటలు వేశారని తెలిపారు.అదే గత ఏడాది ఈసమయానికి 14.2 లక్షల  హెక్టార్లలో పంటలు వేశారని వివరించారు.రాష్ట్రంలో శ్రీకాకుళం,విజయనగరం, విశాఖపట్నం,గుంటూరు, బాపట్ల జిల్లాల్లో సాధారణం కంటే 20 నుండి 50 శాతం అధిక వర్షపాతం నమోదు అయిందని వివరించారు.కృష్ణా జిల్లాలో 60 శాతం పైగా అధిక వర్షపాతం నమోదైందని చెప్పారు.కాగా అంబేడ్కర్ కోనసీమ,పశ్చిమ గోదావరి, నెల్లూరు,వైయస్సార్ కడప, అన్నమయ్య,తిరుపతి జిల్లాల్లో మైనస్ 20 నుండి 59 మిల్లీ మీటర్ల తక్కువ వర్షపాతం నమోదైందని తెలిపారు. మిగతా జిల్లాల్లో సాధారణ వర్షపాతం కంటే 20 మీమీ.లు అధిక వర్షపాతం నమోదైందని అన్నారు.


వర్షపాతం తక్కువగా పడిన జిల్లాల్లో ప్రత్యామ్నయ పంటలు వేసుకునేందుకు వీలుగా సుమారు 10 వేల క్వింటాళ్ల మినుము,పెసర,కంది,ఉలవ, జొన్న, పొద్దుతిరుగుడు,వేరు శెనగ తదితర విత్తనాలను ఎపి సీడ్స్ వద్ద సిద్ధంగా ఉంచామని చెప్పారు.


అలాగే అధిక వర్షాలతో వరినారు మడులు దెబ్బతిన్న రైతులకు స్వల్ప కాలంలో పంట దిగుబడినిచ్చే ఎంటియు 1121,1153,బిపిటి 5204, ఎన్ ఎల్ ఆర్ 34449, ఎంటియు 1010 రకం వరి విత్తనాలను సుమారు 30 వేల క్వింటాళ్లను సిద్ధం చేసినట్టు స్పెషల్ సిఎస్ గోపాల కృష్ణ ద్వివేది తెలిపారు.


ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ ప్రత్యేక కమీషనర్ సిహెచ్.హరికిరణ్,రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి డా.బిఆర్.అంబేద్కర్, పశుసంవర్థక శాఖ సంచాలకులు అమరేంద్ర కుమార్,ఎపి సీడ్స్ ఎండి శేఖర్ బాబు,మత్స్యశాఖ అదనపు సంచాలకులు డా.అంజలి, ఉద్యానవన శాఖ అదనపు సంచాలకులు బాలాజీ నాయక్, వెంకటేశ్వర్లు తదితర అధికారులు పాల్గొన్నారు.



Comments