విభజన చట్టం హామీల అమలులో వైసీపీ ఘోర వైఫల్యం.



*విభజన చట్టం హామీల అమలులో వైసీపీ ఘోర వైఫల్యం


*


*31 మంది ఎంపిలు ఉండి వైసీపీ సాధించింది ఏంటి?*

*జగన్ కేసుల లాబీయింగ్ కోసమే వైసీపీ ఎంపిలు తప్ప...రాష్ట్రం కోసం కాదు*


*రాష్ట్రంలో విధ్వంసక పాలన, గాడి తప్పిన లా అండ్ ఆర్డర్ పై పార్లమెంట్ లో గళమెత్తండి*


*జాతీయ ప్రాజెక్టు పోలవరం పై రాష్ట్ర ప్రభుత్వ తప్పిదాలను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లండి*


*టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎంపీలకు నారా చంద్రబాబునాయుడు సూచన*


హైదరాబాద్ (ప్రజా అమరావతి):- విభజన చట్టం హామీల అమలు ద్వారా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. 10 ఏళ్ల రాష్ట్ర విభజన చట్ట కాలపరిమితి మరి కొద్ది నెలల్లో ముగుస్తున్నా...వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర హక్కులు కాపాడ లేకపోయిందని చంద్రబాబు నాయుడు అన్నారు. 31 మంది ఎంపిలు ఉండి....కేంద్రం నుంచి రాష్ట్రానికి వీళ్లు ఏం సాధించారో ప్రజలకు చెప్పాలని అన్నారు. ప్రత్యేక హోదా తెస్తానని ఊరూరా తిరిగి ఓట్లు వేయించుకున్న జగన్ రెడ్డి....ఈ నాలుగేళ్ల కాలంలో రాష్ట్రానికి కనీసం ఒక ప్రాజెక్టు గాని, ఒక సంస్థను గాని తెచ్చారా అని ప్రశ్నించారు. టీడీపీ చొరవతో రాష్ట్రంలో ఏర్పాటు అయిన కేంద్ర సంస్థలకు ఈ నాలుగేళ్లలో కనీసం నిథులు కూడా తేలేకపోయారని విమర్శించారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలపై, ప్రాజెక్టులపై ఒక్క ఎంపీ కూడా ఒక్క సారి కూడా కేంద్రానికి విన్నపం చేసిన దాఖలాలు లేవని ఆయన అన్నారు. విశాఖ రైల్వే జోన్, మెట్రో, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ది నిధులు సహా ఏ  ఒక్క ప్రాజెక్టు విషయంలో కూడా వైసీపీ ప్రభుత్వం కేంద్రం నుంచి ఏమీ తేలేకపోయిందని విమర్శించారు. జగన్ తన కేసుల విషయంలో లాబీయింగ్ కోసమే తన పార్టీ ఎంపిలను వాడుతున్నారు తప్ప....రాష్ట్ర ప్రయోజనాలపై వారికి కనీస బాధ్యత లేదని అన్నారు. వైసీపీ ప్రభుత్వానికి అప్పులు తెచ్చుకోవడం ఉన్న శ్రద్ద హక్కులు సాధించడంలో లేదు అన్నారు. తాము ఎంపిలమన్న విషయం ఎంపీలు ఎప్పుడో మరిచిపోయారని....వాళ్లు ఎంపిలు అని ఇటు రాష్ట్ర ప్రజలూ గుర్తించడం లేదని వారి పనితీరు అంత దారుణంగా ఉందని చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ నెల 20వ తేదీ నుంచి పార్లమెంట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో పార్టీ ఎంపీలతో చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లోని తన నివాసంలో సమావేశం అయ్యారు. పార్లమెంట్ సమావేశాల్లో రాష్ట్రానికి సంబంధించి ప్రస్తావించాల్సిన సమస్యలపై టీడీపీపీలో చర్చించారు.

రాష్ట్రంలో పూర్తిగా గాడి తప్పిన  లా అండ్ ఆర్డర్, విధ్వంసక పాలనపై పార్లమెంట్ లో మాట్లాడాలని చంద్రబాబు నాయుడు ఎంపిలకు సూచించారు. స్వయంగా కేంద్ర మంత్రులే రాష్ట్రంలో పరిస్థితులపై ఆవేదన వ్యక్తం చేసిన నేపథ్యంలో....రాష్ట్ర పరిస్థితులను పార్లమెంట్ వరకు తీసుకువెళ్లాలని సూచించారు. అక్రమ కేసులు, దళిత గిరిజనులు, బిసి, మైనారిటీ వర్గాలపై జరుగుతున్న దాడులను పార్లమెంట్ దృష్టికి తీసుకువెళ్లాలన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం తన అసమర్థత కారణంగా తప్పుల మీద తప్పులు చేసి జాతీయ ప్రాజెక్టు పోలవరాన్ని ఎలా నాశనం చేసిందో కూడా పార్లమెంట్ లో లేవనెత్తాలని చంద్రబాబు సూచించారు. పిపిఎ హెచ్చరికలు, కేంద్ర ప్రభుత్వ సూచనలు పక్కన పెట్టి...రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న రివర్స్ నిర్ణయాల వల్ల పోలవరానికి జరిగిన నష్టాన్ని పార్లమెంట్ లో చర్చించి...సమస్య పరిష్కారానికి కృషి చేయాలన్నారు. అనుసంధానం వల్ల జరిగే లబ్దిని ప్రత్యేకంగా పార్లమెంట్ లో చర్చించాలని....టీడీపీ హయాంలో నదుల అనుసంధానం పై మన ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు...వాటి వల్ల వచ్చే ఫలితాలను కూడా చర్చకు తీసుకురావాలని కోరారు. కేంద్రం కూడా దేశం లో నదుల అనుసంధానం పై దృష్టిపెట్టాలని చంద్రబాబు అభిప్రాయ పడ్డారు. ఇకపోతే పార్లమెంట్ లో రానున్న బిల్లులపై ఆయా సందర్భాలకు అనుగుణంగా పార్టీలో చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని పార్టీ ఎంపిలకు చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ సమావేశం లో పార్టీ ఎంపీ లు రామ్మోహన్ నాయుడు, గల్లా జయదేవ్, కేశినేని నాని, కనకమేడల రవీంద్ర కుమార్, మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్ రావు పాల్గొన్నారు.

Comments