కెనడా మరియు USA దేశాలలో అత్యంత వైభవోపేతంగా నిర్వహించిన శ్రీవారి కల్యాణోత్సవాలు



తాడేపల్లి (ప్రజా అమరావతి);



*గత 2 నెలలలో  కెనడా మరియు USA దేశాలలో అత్యంత వైభవోపేతంగా నిర్వహించిన శ్రీవారి కల్యాణోత్సవాలు


– ముగిసిన దేవదేవుడి కల్యాణాలు*


తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో USA లోని  జూలై 15 వ తేదీన మొర్గాన్విల్ - న్యూజెర్సీ, 16న హూస్టన్ మరియు 22న ఇర్వింగ్(టెక్సాస్) నగరాల్లో తిరుమల శ్రీ శ్రీనివాస  కళ్యాణం కన్నుల పండుగలా జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేతుడైన శ్రీ మలయప్ప స్వామివారు NRI భక్తులకు దర్శనమిచ్చారు.  


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగసంస్థ ఏపీఎన్ఆర్టీఎస్ మొదటినుండి తితిదేతో ఒకవైపు, ఆయా నగరాల కార్యనిర్వాహక వర్గాలతో మరోవైపు సమన్వయము చేస్తూ వైఖానస ఆగమశాస్త్రం ప్రకారం కల్యాణోత్సవం జరిగేలా చూసుకుంది. అక్కడి నిర్వాహకులు... భక్తులు, అర్చకులు, వేదపండితులకు, తితిదే అధికారులకు సౌకర్యవంతంగా ఏర్పాట్లు చేయడం జరిగింది.


ఆయా నగరాల్లో జరిగిన కల్యాణోత్సవాల్లో భక్తులు వేల సంఖ్యలో పాల్గొని ప్రత్యక్షంగా స్వామివారి కల్యాణాన్ని వీక్షించారు.  మొర్గాన్విల్ – న్యూజెర్సీ లో శ్రీ ఎమ్. మహేందర్, శ్రీ. అన్నా రెడ్డి, శ్రీ రామ్మోహన్, హూస్టన్ లో శ్రీ మారుతి చింతపర్తి, శ్రీ ఎస్.మహేష్, శ్రీ బి. బ్రహ్మ మరియు శ్రీ దుర్గా ప్రసాద్ సెలోజ్, ఇర్వింగ్(టెక్సాస్) లో శ్రీ గిరి పద్మసోలాల, శ్రీ విజయ మోహన్ కాకర్ల తదితరులు స్వామివారి కల్యాణానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేసారు.  



*ఈ నేపథ్యంలో కెనడా మరియు USA దేశాలలోని వివిధ నగరాలలో  ఘనంగా జరిగిన శ్రీ మలయప్ప స్వామి వారి కల్యాణోత్సవాలపై  ఏపీ ప్రభుత్వ సంస్థ ఏపీఎన్ఆర్టీఎస్ అధ్యక్షులు శ్రీ వెంకట్ ఎస్. మేడపాటి పత్రికా ప్రకటన విడుదల చేసారు.*


కెనడా మరియు USA దేశాలలో స్థిరపడిన  తెలుగు, భారతీయుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో జూన్ 4 వ తేదీ నుండి  నుండి జూలై 22 వ  తేదీ వరకు పదునాలుగు  (14) నగరాల్లో అంగరంగ వైభవంగా జరిగిన శ్రీనివాస కల్యాణోత్సవాలు  ముగిసాయి. ఈ 14 నగరాలలో కల్యాణోత్సవాలే కాకుండా మరో 6 నగరాలలో అక్కడి శ్రీవారి దేవస్థానాలలో స్వామి, అమ్మవార్లకు వసంతోత్సవం, అష్టశత కలశాభిషేకం తదితర కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.   వైఖానస ఆగమం ప్రకారం తితిదే నుండి వెళ్ళిన అర్చకులు, వేదపండితులు  ఈ కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. అన్ని నగరాల్లో శ్రీ శ్రీనివాస కల్యాణోత్సవానికి దాదాపు 60 వేలమంది ఎన్నారై భక్తులు ప్రత్యక్షంగా హాజరయ్యి స్వామివారి కల్యాణాన్ని వీక్షించి భక్తి పులకితులయ్యారు. ఈ కల్యాణోత్సవాలకు ఏపీ ప్రభుత్వ సంస్థ ఏపీఎన్ఆర్టీఎస్ సమన్వయ సహకారం అందించింది.


తితిదే చైర్మన్ శ్రీ వై.వీ. సుబ్బారెడ్డి సమన్వయ సూచనలతో  కెనడాలోని టొరంటో, మాంట్రియల్, అట్టావా, USA లోని ర్యాలీ (నార్త్ కరొలినా), జాక్సన్ విల్, డెట్రాయిట్, చికాగో, అట్లాంటా, డల్లాస్ (NATA), సెయింట్ లూయిస్, ఫిలడెల్ఫియా (TANA), మొర్గాన్విల్ – న్యూజెర్సీ, హూస్టన్  మరియు ఇర్వింగ్(టెక్సాస్)  నగరాలలో తెలుగు, భారతీయ సంస్థల సహకారంతో శ్రీ మలయప్ప స్వామివారి కల్యాణం కన్నులపండుగగా నిర్వహించడం జరిగింది. పలు కల్యాణోత్సవాల్లో శ్రీ వై.వి. సుబ్బారెడ్డి గారు పాల్గొన్నారు. ఈ 14 నగరాలలో శ్రీవారి కల్యాణం మరియు మరికొన్ని నగరాల్లో వసంతోత్సవం, అష్టశత కలశాభిషేకం నిర్వహించడానికి దాదాపు 20వేల కిలోమీటర్లకు పైగా రోడ్డు ప్రయాణం చేసిన తితిదే అర్చకులు, వేదపండితులు ప్రతి కల్యాణాన్ని రంగరంగ వైభవంగా నిర్వహించారు.  


ప్రతి ఏటా ప్రపంచంలోని వివిధ దేశాలలో  శ్రీ మలయప్పస్వామి వారి కల్యాణం నిర్వహించాలని భక్తులు, తెలుగు మరియు భారతీయ సంస్థలు ముందుకువస్తే ఆయా దేశాలలో శ్రీవారి కల్యాణం నిర్వహించడానికి  గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారు ప్రోత్సహిస్తున్నారని వెంకట్ అన్నారు. 


గత 13 నెలల్లో ప్రపంచవ్యాప్తంగా 36 నగరాల్లో తిరుమల శ్రీవారి కల్యాణం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కల్యాణోత్సవాల్లో దాదాపు లక్షన్నర పైగా ఎన్నారై భక్తులు పాల్గొన్నారు.  తెలుగు, భారతీయ భక్తులతో  పాటు అక్కడ స్థానికంగా ఉన్న వారుకూడా అధిక సంఖ్యలో హాజరై స్వామివారి కల్యాణ ఘట్టాన్ని వీక్షించి ఆశీర్వాదాలు అందుకున్నారన్నారు. 


అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా సనాతన హిందూ ధర్మ ప్రచారం పెద్ద ఎత్తున నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం, తితిదే సిద్ధంగా ఉన్నాయని ఇదివరకే శ్రీ వై.వి. సుబ్బారెడ్డి గారు తెలిపారు.  దీనికి ఏపీఎన్ఆర్టీఎస్ తమ వంతు సహకారం అందిస్తుందని మేడపాటి  తెలిపారు.  ఆయా నగరాలలోని నిర్వాహకులు తితిదే చైర్మన్ శ్రీ వై.వి. సుబ్బారెడ్డి గారికి, ఈవో శ్రీ ధర్మారెడ్డి గారికి  కృతఙ్ఞతలు తెలిపారు. 


స్వామివారి కల్యాణోత్సవ కార్యక్రమాన్ని తితిదే నుండి AEO (Gen) శ్రీ. బి. వెంకటేశ్వర్లు, SVBC డైరెక్టర్ శ్రీ శ్రీనివాస్ రెడ్డి సమయానుసారం సమన్వయము చేశారు. SVBC ఛానెల్ ఈ కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం చేసింది.



Comments