23 నుండి ఘనంగా గిడుగు రామమూర్తి జయంతి వారోత్సవాలు.

 *23 నుండి ఘనంగా గిడుగు రామమూర్తి జయంతి వారోత్సవాలు


*

*ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు అధికార భాషా సంఘం అధ్యక్షులు పి.విజయబాబు*

                                                                                                                                                                                    అమరావతి,  ఆగస్టు 22 (ప్రజా అమరావతి): తెలుగు వాడుక భాషా ఉధ్యమ పితామహుడు  శ్రీ గిడుగు వెంకట రామమూర్తి 160 వ జయంతిని పురస్కరించుకుని ఈ నెల 23 నుండి 29 వ తేదీ వరకూ వారం  రోజుల పాటు తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు అధికార భాషా సంఘం అధ్యక్షులు మరియు తెలుగు భాషాభివృద్ధి ప్రాధికార సంస్థ అధ్యక్షుడు పి.విజయబాబు తెలిపారు. సోమవారం అమరావతి సచివాలయం నాల్గవ భవనం ప్రచార విభాగంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి  శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఆదేశాను సారం రాష్ట్రంలో ద్విభాషా విధానాన్ని ప్రోత్సహించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవడం జరుగుచున్నదన్నారు.  ప్రపంచీకరణ నేపథ్యంలో పిల్లల భవిష్యత్తు అవసరాల కోసం ఆంగ్ల భాషను ప్రోత్సహిస్తూనే నిత్య జీవితంలోను, పాలనా వ్యవహారాల్లోనూ తెలుగు భాషను ప్రోత్సహించడానికి గతంలో ఎన్నడూ లేని విధంగా వారం రోజుల పాటు తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నట్లు  ఆయన తెలిపారు. ఈ వారోత్సవాలను అన్ని జిల్లా కేంద్రాలతో పాటు రాష్ట్ర స్థాయిలో ప్రధానంగా గుంటూరు, విజయవాడ కేంద్రాల్లో  ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.  ఈ వారోత్సవాల్లో భాగంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులకు, రాష్ట్ర సచివాలయంలోని ఉద్యోగులకు కథలు, కవితలు, అంత్యాక్షరీ పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అదే విధంగా  సాహితీ స్రష్టలను, భాషా సేవకులను, భాషా వారసత్వాన్ని పరిపుష్టం చేసేందుకు కృషి చేస్తున్న వారిని పెద్ద ఎత్తున గుర్తించి సముచిత స్థాయిలో సత్కరించడం జరుగుతుందన్నారు.

                                                                                                                                                                                              *వారం రోజుల పాటు నిర్వహించే కార్యక్రమాల వివరాలు…..*

                                                                                                                                                                                                 తెలుగు భాషా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా  రాష్ట్ర స్థాయిలో ఈ నెల 23 వ తేదీ బుధవారం ఉదయం 11.30 గంటలకు గుంటూరు లోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఈ  వారోత్సవాలు ప్రారంభమై 29 వ తేదీ మంగళవారం మద్యాహ్నం 3.00 గంటలకు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించే కార్యక్రమంతో ముగుస్తాయని రాష్ట్ర తెలుగు అధికార భాషా సంఘం అధ్యక్షులు మరియు తెలుగు భాషాభివృద్ధి ప్రాధికార సంస్థ అధ్యక్షుడు పి.విజయబాబు తెలిపారు.  24 వ తేదీ గురువారం  ఉదయం 11.30 గంటలకు విజయవాడ ఎస్.ఆర్.ఆర్. డిగ్రీ కళాశాలలోను, 25 వ తేదీ శుక్రవారం మద్యాన్నం 1.30 గంటలకు విజయవాడలోని ఆంధ్ర లాయోల డిగ్రీ కళాశాలలోను, 26 వ తేదీ ఉదయం 11.30 గంటలకు విజయవాడలోని బెజవాడ బార్ అసోషియేషన్ లోను, సాయంత్రం 4.00 గంటలకు గుంటూరులోని వెంకటేశ్వర విజ్ఞాన్ మందిరంలోను, 27 వ తేదీ ఆదివారం సాయంత్రం 5.00 గంటలకు విజయవాడలోని ఘంటసాల  సంగీత విశ్వవిద్యాలయంలోను మరియు 28 వ తేదీ సోమవారం సాయంత్రం 4.00 గంటలకు వెలగపూడిలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలోను పలు కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.  

                                                                                                                                                                                      

Comments