అంగరంగ వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు.

 అంగరంగ వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు


– సెప్టెంబరు 18 నుండి 26 వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు


-అక్టోబర్ 15 నుండి 23 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు

– పురటాసి మాసం సెప్టెంబర్ 18 నుండి అక్టోబర్ 17 వరకు

– భక్తుల సౌకర్యార్థం విస్తృత ఏర్పాట్లు

– టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి

తిరుమల, (ప్రజా అమరావతి): అధికమాసం కారణంగా ఈ ఏడాది సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో రెండు బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో, పురటాసి మాసం కూడా వస్తున్నందువల్ల భక్తుల రద్దీ అత్యధికంగా ఉంటుందని టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి చెప్పారు . అన్నివిభాగాల అధికారులు జిల్లాయంత్రాంగం తో సమన్వయం చేసుకుని

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

జేఈవోలు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీరబ్రహ్మంలతో కలిసి టీటీడీలోని అన్ని విభాగాల అధికారులతో సోమవారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో సమీక్ష నిర్వహించారు.
అనంతరం ఈవో మీడియాతో మాట్లాడుతూ, సెప్టెంబర్ 18 నుండి 26వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబర్ 15 నుంచి 23 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను ఒకటిన్నర నెల ముందుగానే ప్రారంభించినట్లు చెప్పారు. 15 రోజుల తరువాత, జిల్లా యంత్రాంగంతో సమీక్ష నిర్వహించనున్నట్లు ఆయన తెలియజేశారు.

వార్షిక బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమైన రోజుల్లో సెప్టెంబర్ 18న ధ్వజారోహణం ఉంటుందని, అదే రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీ వేంకటేశ్వర స్వామికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు. ముఖ్యమైన రోజుల్లో 22న గరుడ సేవ, 23న స్వర్ణరథం, 25న రథోత్సవం, 26న చక్రస్నానం, ధ్వజవరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయన్నారు.

అదేవిధంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 15న ప్రారంభమై 19న గరుడవాహనం, 22న స్వర్ణరథం, 23న చక్రస్నానంతో వస్తాయని చెప్పారు.

ఇంజినీరింగ్ పనులు, అన్నప్రసాదం, దర్శనం, వసతి, పోలీసు, కళ్యాణకట్ట, రవాణా, హెచ్‌డిపిపి, ఉద్యానవనం, వైద్యం, ఆరోగ్యం, శ్రీవారి సేవకుల సమన్వయంతో టీటీడీ విజిలెన్స్‌ అండ్‌ సెక్యూరిటీ విభాగం భద్రతా ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించినట్లు ఈవో తెలిపారు.

పురటాసి మాసం, రెండు బ్రహ్మోత్సవాలు కలిసినందున, ఈ సంవత్సరం భారీ యాత్రికుల రద్దీని అంచనా వేస్తున్నామని ఈవో చెప్పారు . పురటాసి పవిత్ర మాసం సెప్టెంబర్ 18న ప్రారంభమై అక్టోబరు 17న ముగుస్తుందన్నారు. సెప్టెంబరు 23, 30, అక్టోబర్ 7, 14 తేదీల్లో పురటాసి శనివారాలు జరుగుతాయని, ఈ రెండు బ్రహ్మోత్సవాలు , పురటాసి శనివారాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శనం కల్పించేలా ప్రణాళిక రూపొందించాలని సంబంధిత అధికారులను ఆదేశించామని తెలిపారు.

ఎఫ్ ఎ సిఎవో శ్రీబాలాజి , డిఎల్వో శ్రీ వీర్రాజు, సిఈ శ్రీ నాగేశ్వరరావు, ఎస్ఈ 2 శ్రీ జగదీశ్వర్‌రెడ్డి, అదనపు ఎస్పీ శ్రీమునిరామయ్య , ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, వివిధ శాఖాధిపతులు, తిరుమల పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Comments