చేనేత కార్మికులకు అండగా ప్రభుత్వం
జెడ్పి ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు
ఘనంగా జాతీయ చేనేత దినోత్సవం
విజయనగరం, ఆగస్టు 07 (ప్రజా అమరావతి );
చేనేత కార్మికులకు అన్ని విధాలా అండగా నిలిచిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహనరెడ్డికే దక్కిందని, జిల్లాపరిషత్ ఛైర్పర్సన్ మజ్జి శ్రీనివాసరావు కొనియాడారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని సోమవారం జిల్లాలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక సర్వజన ఆసుపత్రి జంక్షన్ నుంచి కలెక్టరేట్ వరకు హేండలూమ్ వాక్ నిర్వహించారు. కలెక్టరేట్ ఆడిటోరియం వద్ద చేనేత వస్త్ర ప్రదర్శన శాలను, జెడ్పి ఛైర్మన్ ప్రారంభించారు. జిల్లా అధికారులు, సిబ్బంది చేనేత వస్త్రాలను ధరించారు. చేనేత వస్త్రాల ప్రాశస్త్యాన్ని పాఠశాలల్లో విద్యార్ధులకు వివరించారు. పలువురు నేత కార్మికులను ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా జెడ్పి ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహనరెడ్డి తన సుదీర్ఘ పాదయాత్రలో, చేనేత కార్మికుల కష్టాలను తెలుసుకొని, అధికారంలోకి వచ్చిన వెంటనే వాటి పరిష్కారానికి కృషి చేశారని చెప్పారు. గత ప్రభుత్వాలు పట్టించుకోని, నేత కార్మికులను ఎన్నో పథకాలతో ఆదుకున్నారని అన్నారు. దీనిలో భాగంగా వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం క్రింద ప్రతీఏటా రూ.24,000 చొప్పున జిల్లాలోని 3,595 మందికి చెల్లించడం జరిగిందన్నారు. అలాగే ముద్ర పథకం క్రింద రూ.50వేలు నుంచి రూ.5లక్షలు వరకు రుణాలను, సొసైటీలకు డిసిసిబి ద్వారా రుణాలను ఇప్పించడం జరుగుతోందని అన్నారు. ముఖ్యంగా నేత వృత్తిదారులకు 50 ఏళ్లు నిండితే చాలు పింఛను మంజూరు చేస్తున్నామని చెప్పారు. ఈ విధంగా జిల్లాలో 3,165 మంది నేతన్నలు చేనేత పింఛన్ పొందుతున్నారని తెలిపారు.
సుదీర్ఘకాలంగా వృత్తిని కొనసాగిస్తున్న సీనియర్ చేనేత కార్మికులు ఎం.పెంటయ్య, బల్ల ఈశ్వర్రావు, నాయుడు సత్యారావులను జెడ్పి ఛైర్మన్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ కలెక్టర్ కె.మయూర్ అశోక్, ఎస్.కోట ఎంఎల్ఏ కడుబండి శ్రీనివాసరావు, వెలమకార్పొరేషన్ ఛైర్మన్ నెక్కల నాయుడుబాబు, డిఆర్ఓ ఎం.గణపతిరావు, చేనేత జౌళిశాఖ డెవలప్మెంట్ ఆఫీసర్ బి.వసంతసాయి, సిబ్బంది, వివిధ చేనేత సొసైటీలు, నేత కార్మికులు పాల్గొన్నారు.
addComments
Post a Comment