రాష్ట్ర ప్రజలు గర్వపడేలా ముఖ్యమంత్రి పాలన.



రాష్ట్ర ప్రజలు గర్వపడేలా ముఖ్యమంత్రి  పాలన.



- సి.ఆర్ మీడియా అకాడమీ ఆఫ్  ఎ. పి. చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు.


విశాఖపట్నం, ఆగష్టు 21 (ప్రజా అమరావతి): రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్న పథకాలను ఇతర రాష్ట్రాలు కూడా ఆదర్శంగా తీసుకుంటున్నాయని సి.ఆర్ మీడియా అకాడమీ ఆఫ్  ఎ. పి. చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు కొనియాడారు. సోమవారం ఉదయం  ‘ అవర్ స్టేట్ అవర్ లీడర్  ‘ లో భాగంగా "సుపరిపాలన దిశగా ఆంధ్రప్రదేశ్ రూపాంతరం" అనే అంశంపై జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో వైఎస్సార్ ఇంటలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి  ముఖ్యఅతిథిగా హాజరైన కొమ్మినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రజల వద్దకు సంక్షేమ ఫలాలను తీసుకెళ్లే లక్ష్యంతో ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థను తమిళనాడు ప్రభుత్వం కూడా అమలు చేసేందుకు సిద్దమైందన్నారు. వలంటీర్ల వ్యవస్థను మెచ్చుకున్న కేరళ ప్రభుత్వం ఆ రాష్ట్రంలో ఇలాంటి వ్యవస్థనే తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతోందన్నారు. ఏపీలో అమలవుతున్న కార్యక్రమాలను ఇతర రాష్ట్రాలు కూడా అనుసరిస్తున్నారనడానికి ఇవి ఉదాహరణలన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాద్యమం ఏర్పాటు చేయడం హర్షణీయమని ఆయన తెలిపారు. పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమాన్ని ప్రభుత్వం ప్రవేశ పెట్టగా తీవ్రంగా వ్యతిరేకించిన వారే తమ పిల్లలను ఆంగ్ల మాధ్యమ పాఠశాలల్లో చదివిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా  హామీలను నెరవేర్చిందన్నారు. గ్రామ సచివాలయ వ్యవస్థలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో 50వేల కార్యాలయాలను ఏర్పాటు చేసి అభివృద్ధికి పాటుపడ్డారన్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రీ చేపట్టని సంస్కరణలు, సంక్షేమానికి జగన్ శ్రీకారం చుట్టారని కొనియాడారు. 


డాక్టర్ వైఎస్సార్ ఇంటలెక్చువల్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు శాంత మూర్తి మాట్లాడుతూ తమ సంస్థలో 700 మంది సభ్యులు ఉన్నారని, వీరిలో డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, ఇంటలిజెన్స్ అధికారులు, వైస్ ఛాన్సలర్లు, ఐఎఎస్ అధికారులు ఉన్నారని తెలిపారు. ప్రజా సంకల్పయాత్రలో ప్రజల సమస్యలను గుర్తించిన సీఎం జగన్ మోహన్ రెడ్డి సుపరిపాలన సాగిస్తున్నారన్నారు.

ఈ సందర్బంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలపై పలువురు అడిగిన ప్రశ్నలకు వక్తలు సమాధానమిచ్చారు.


ఈ కార్యక్రమంలో నాగార్జున యూనివర్సిటి రిటైర్డ్ వి.సి వి.బాల మోహన్ దాస్, జాయింట్ డైరెక్టర్ ఎ.పి ఇన్నోవేషన్ సొసైటీ  లావణ్య, ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ వెంకటరావు, 28 వార్డు కార్పొరేటర్ పల్లా దుర్గా రావు, యాక్సిస్ సెవెన్ ఇకోస్ట్రక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పాల్ బాస్కర్ తదితరులు పాల్గొన్నారు. 


Comments