ప్రమాదకర పరిశ్రమలన్నిటిలో ధర్ఖ్ పార్టీ సేఫ్టీ ఆడిట్ జరగాలి.

 ప్రమాదకర పరిశ్రమలన్నిటిలో ధర్ఖ్ పార్టీ సేఫ్టీ ఆడిట్ జరగాలి



*  పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టండి


* వివిధ ద్రావకాలను వినియోగించే పరిశ్రమల్లో వాటిని పరీక్షించే ల్యాబ్ లు ఏర్పాటు చేసుకోవాలి


* పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు ప్రతి ఏటా మాక్ డ్రిల్ నిర్వహించాలి


* రాష్ట్ర,జిల్లా,స్థానిక క్రైసెస్ గ్రూపులు తరచు సమావేశమై పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు పాటిస్తున్న ప్రోటోకాల్ ను సమీక్షించాలి


* పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యలపై స్పెషల్ డ్రైవ్ లు నిర్వహించండి


ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి.


విజయవాడ,19 ఆగస్టు (ప్రజా అమరావతి): రాష్ట్రంలోని ప్రమాదకర పరిశ్రమలన్నిటిలో థర్డ్ పార్టీ సేఫ్టీ ఆడిట్ జరగాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్. జవహర్ రెడ్డి ఆదేశించారు.

కెమికల్ యాక్సిడెంట్లు నివారణపై శనివారం విజయవాడలోని సిఎస్ క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర క్రైసెస్ గ్రూపు సమావేశం సిఎస్  అధ్యక్షతన జరిగింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రసాయన సంబంధిత పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.ఇలాంటి పరిశ్రమలన్నిటిలో పాటిస్తున్న సేఫ్టీ ప్రోటోకాల్ మరియు భద్రతా చర్యలపై థర్డ్ పార్టీ సేఫ్టీ ఆడిట్ జరగాలని పునరుద్ఘాటించారు.అదే విధంగా వివిధ సాల్వెంట్లు (రసాయన ద్రావకాలు) వినియోగించే పరిశ్రమల్లో ఆయా ద్రావకాల ఘాడత వాటి స్వభావాన్ని ముందే పరీక్షించి తెల్సుకునేలా ల్యాబ్ లను ఏర్పాటు చేసేలా చూడాలని పరిశ్రమలు,ఫ్యాక్టరీల శాఖల అధికారులను సిఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు.


అదే విధంగా ప్రమాదకరమైన పరిశ్రమల్లో ప్రతి ఏటా ప్రమాదాల నివారణపై ప్రత్యేక మాక్ డ్రిల్ నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రమాదకర పరిశ్రమలన్నిటిలో ప్రమాదాల నివారణకు అనుసరిస్తున్న ప్రోటోకాల్ పై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని చెప్పారు.ప్రమాదాల నివారణకు రాష్ట్ర,జిల్లా,స్థానిక స్థాయి క్రైసెస్ గ్రూపులు తరచు సమావేశమై పారిశ్రామిక  ప్రమాదాల నివారణకు అనుసరిస్తున్న మార్గదర్శకాలు భద్రతా చర్యలు,ప్రోటోకాల్ ను సమీక్షించాలని సిఎస్ స్పష్టం చేశారు.


గత రెండేళ్ల కాలంలో రసాయన సంబంధిత పరిశ్రమల్లో 11 ప్రమాదాలు జరిగిన నేపధ్యంలో మరలా అలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.జవహర్ రెడ్డి ఆదేశించారు.అదే విధంగా రసాయన సంబంధిత పరిశ్రమల్లో తగిన సాంకేతిక పరిజ్ఞానం గల సిబ్బంది లేకుంటే అక్కడ పనిచేసే సిబ్బందికి వాటి నిర్వహణపై ఆయా పరిశ్రమలు ముందే తగిన శిక్షణ ఇవ్వాలని అన్నారు.


ఇంకా ఈసమావేశంలో పారిశ్రామిక ముఖ్యంగా రసాయన సంబంధిత ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన పలు జాగ్రత్తలపై సిఎస్ జవహర్ రెడ్డి అధికారులతో చర్చించారు.


ఈసమావేశంలో రాష్ట్ర ఫ్యాక్టరీల డైరెక్టర్ డి.చంద్రశేఖర్ వర్మ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమావేశ అజెండా అంశాలను వివరిస్తూ 1948 ఫ్యాక్టరీల చట్టాన్ని అనుసరించి 1986  కెమికల్ యాక్సిడెంట్ల నిబంధనల ప్రకారం జాతీయ,రాష్ట్ర,జిల్లా, స్థానిక స్థాయిల్లో క్రైసెస్ గ్రూపులు ఏర్పాటు అయ్యాయన్నారు.రాష్ట్ర స్థాయి క్రైసెస్ గ్రూపునకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి,జిల్లా స్థాయికి  డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్,స్థానిక గ్రూపునకు ఆర్డీవో అధ్యక్షులుగా ఉండి తరచు సమావేశమై ఈప్రమాదాలపై సమీక్షించడం జరుగుతుందన్నారు.1948 ఫ్యాక్టరీల చట్టం ప్రకారం రాష్ట్రంలో 1129 ఫ్యాక్టరీలు హజార్డస్ కిందకు వస్తాయని చెప్పారు.గత ఆరు మాసాల్లో వివిధ శాఖల సమన్వయంతో 600 మాక్ డ్రిల్ లను పూర్తి చేశామని వివరించారు.637 ఫ్యాక్టరీలు ప్రమాదాలపై అప్రమత్తతకు సెన్సార్లను ఏర్పాటు చేసుకోగా మిగతావి ఏర్పాటు చేసుకోవాల్సి ఉందని చెప్పారు.థర్డ్ పార్టీ సేఫ్టీ ఆడిట్ కై 243 పరిశ్రమలను షార్టు లిస్టు చేయగా ఇప్పటికే 216 పరిశ్రమల్లో సేప్టీ ఆడిట్ పూర్తయిందని తెలిపారు.


ఈసమావేశంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ కమీషనర్ కె.ప్రవీణ్ కుమార్,రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్ డా.బిఆర్ అంబేద్కర్, సిడిఎంఏ కోటేశ్వరరావు, ఎపిఎస్పి డీఐజీ బి.రాజ కుమారి,రాష్ట్ర ఫైర్ సర్వీసెస్ శాఖ డైరెక్టర్ డి.మురళీ మోహన్,పిసిబి జాయింట్ చీఫ్ ఇంజనీర్ భాస్కరరావు తదితర అధికారులు పాల్గొనగా వీడియో లింక్ ద్వారా ఓఎన్జీసీ అధికారులు, వివిధ కంపెనీల నిపుణులు తదితరులు పాల్గొన్నారు.



Comments