గిరిపుత్రుల జీవితాల్లో ఉన్నత విద్యాకాంతులు.


విజయనగరం (ప్రజా అమరావతి);


*సాలూరు నియోజకవర్గంలో ప్రతిష్టాత్మక కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం.*


*విజయనగరం జిల్లా మెంటాడ, దత్తిరాజేరు మండలాల్లో 561.88 ఎకరాల్లో రూ.834 కోట్లతో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయానికి, ఇతర మౌలిక వసతుల కల్పనకు మెంటాడ మండలం చినమేడపల్లిలో ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ సమక్షంలో శంకుస్ధాపన చేసిన కేంద్ర విద్య మరియు నైపుణ్యాభివృద్ధిశాఖ మంత్రి శ్రీ ధర్మేంద్రప్రధాన్‌.*


*అనంతరం దత్తిరాజేరు మండలం మరడాం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగసభలో పాల్గొన్న కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ ధర్మేంద్రప్రధాన్, ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌.*


*బహరంగసభలో ప్రజలనుద్దేశించి మాట్లాడిన ముఖ్యమంత్రి.*


*ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే....:* 


*గుండెల్లో పెట్టుకున్న నా గిరిజనజాతికి రుణపడి ఉంటాను...*

చిక్కటి చిరునవ్వులు, చెరగని ఆప్యాయతల మధ్య ఈ రోజు దేవుడి ఆశీస్సులతో మరో మంచి కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన కేంద్ర విద్యామంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్‌ గారికి ఈ వేదిక పై నుంచి అభినందనలు తెలియజేస్తున్నాను. నన్ను నిరంతరం గుండెల్లో పెట్టుకున్న నా గిరిజన జాతికి మీ తమ్ముడిగా, మీ అన్నగా, మీ బిడ్డగా మీ జగన్‌ ఎప్పటికీ రుణపడి ఉంటాడు. 

ఈ సభకు వచ్చిన ప్రతి అక్కకూ, చెల్లెమ్మకూ, ప్రతి సోదరుడికీ, స్నేహితుడికీ నిండు మనస్సుతో చేతులు జోడించి పేరు, పేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు.


*రూ.830 కోట్లతో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ.*

ఈ గిరిజన ప్రాంతంలో కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయ శాశ్వత భవనాలకు సంబంధించి పునాదులు వేస్తున్నాం. ఇక్కడ జరగబోతున్న కార్యక్రమం దాదాపు రూ.830 కోట్ల ప్రాజెక్టు.

మరో మూడు సంవత్సరాలలో ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేయబోతున్నాం. ఈ ప్రాజెక్టును మంజూరు చేసినందుకు ఈ వేదికపై నుంచి ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు మనం ఇక్కడ శంకుస్ధాపన చేసిన కార్యక్రమం 2014లో ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టం ప్రకారం మనకు వచ్చిన విశ్వవిద్యాలయం.


*గిరిపుత్రుల జీవితాల్లో ఉన్నత విద్యాకాంతులు*


రాష్ట్రంలో ఈ సెంట్రల్‌ యూనివర్సిటీ రెండోది. ఈ ప్రాజెక్టు గిరిపుత్రుల జిల్లాల్లో వారి జీవితాల్లో ఉన్నతవిద్యాకాంతులు నింపడానికి రాబోయే రోజుల్లో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ రోజు గిరిజన మిత్రుడిగా, గిరిజన పక్షపాతిగా ఈ రోజు ఇక్కడ జరగబోతున్న కార్యక్రమం ద్వారా రాబోయో రోజుల్లో మన గిరిజనులు ప్రపంచంతో పోటీపడే గొప్ప అడుగుకు బీజం పడబోతుంది. 


*గిరిపుత్రులది స్వచ్ఛమైన మనసు.*

మామూలుగా కూడా నా మనసులో ఎప్పుడూ ఉండేది. గిరిజనులు స్వచ్చమైన మనసు కలిగిన వాళ్లు. కల్మషం లేని మనుషులు ఎవరైనా ఉన్నారంటే అది గిరిజనులే. అయితే తరతరాలుగా వారిని వెంటాడుతున్న పేదరికం, ఇప్పటికీ కూడా మిగతా ప్రపంచంలో సమం కాని వారి జీవన ప్రమాణాలు, ప్రత్యేకించి వారి జీవితాలను మార్చే విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో ఇప్పటికీ కూడా ఇంకా బాహ్యప్రపంచంతో అడుగులు వేసే కార్యక్రమంలో వాళ్లు ఇంకా వెనుకబడే ఉన్నారు.


ఈ రోజు నేను గర్వంగా చెప్పగలుగుతాను. ఈనాలుగేళ్ల పరిపాలనలో మీ బిడ్డ ప్రభుత్వంలో... విద్య, వైద్యం, వ్యవసాయం పరంగాకానీ, సామాజికంగా, ఆర్ధికంగా, రాజకీయంగా, జెండర్‌ పరంగా మన ప్రభుత్వం గిరిజనులు గుండెల్లో పెట్టుకుని అడుగులు వేశాం.

మారుతున్న ప్రపంచంలో వారి జీవన ప్రమాణాలు పెంచడానికి కానీ, మిగితా ప్రపంచం దోపిడీ నుంచి గిరిజనులను రక్షించే విషయంలో కానీ అన్ని రకాలుగా అండగా నిలబడ్డాం. 


వారిని ప్రపంచంలో నిలబెట్టే విధంగా ఉన్నత విద్యను వారికి అందించాలి. ఈ రోజు అలాంటి సంకల్పంతోనే తరతరలాలుగా నిర్లక్షానికి గురైన నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ సోదరుల కోసం.. ప్రాథమిక విద్య దగ్గర నుంచి మొదలు ఉన్నత విద్య వరకు అన్ని దశల్లోనూ...వారు చదువుకునే మీడియం దగ్గర నుంచి వారికి అందే సదుపాయాల వరకు అన్నింటిలోనూ ఈ నాలుగు సంవత్సరాల కాలంలో విప్లవాత్మక  మార్పులతో అడుగులు ముందుకు వేశాం. 


*గిరిపుత్రుల అభివృద్ధి కోసం...*

గిరిపుత్రుల అభివృద్ధి పట్ల మనందరి ప్రభుత్వం ఎంత బాధ్యతగా, దూరదృష్టితో వ్యవహరిస్తోందో నాలుగు మాటల్లో పంచుకుంటాను.

వారి విద్య, సాధికారత కోసం, ప్రపంచంతో పోటీ పడే పరిస్థితి రావాలని, ఆ పోటీలో మన పిల్లలు గెలవాలని, వారు చదువుకొనే మీడియంలో మార్పులు తీసుకొచ్చాం. ఇవాళ గవర్నమెంట్‌ బడులు... ఇంగ్లీష్‌ మీడియం వైపు అడుగులు వేసే పరిస్థితి ఉందని మన రాష్ట్రంలో ఉందని గర్వంగా చెబుతున్నాను.  3వ తరగతి నుంచి సబ్జెక్ట్‌ టీచర్‌ కాన్సెప్ట్‌ మన ప్రభుత్వ బడులలో అమలవుతోంది.  నాడు–నేడుతో వారు చదువుతున్న స్కూళ్ల రూపురేఖలు పూర్తిగా మార్చబడుతూ కనిపిస్తున్నాయి. విద్యాకానుకతో బడి పిల్లల రూపాన్ని,  బైలింగువల్‌ విధానంతో వారి టెక్ట్స్‌బుక్స్‌నూ మార్చగలిగాం.


ఇదే గిరిజన ప్రాంతంలో చిన్నపిల్లల దగ్గరనుంచి మొదలు, బాలింతలు, గర్భవతులు వరకూ కూడా వారిని బాగా చూసుకునే దిశగా అడుగులు వేస్తూ.. సంపూర్ణ పోషణం ప్లస్, చిన్న పిల్లలకు గోరుముద్ద స్కీంతో వారు తీసుకునే ఆహారంలో కూడా మార్పులు తీసుకురాగలిగాం. 

ప్రతి గవర్నమెంట్‌ బడిలో 6వ తరగతి నుంచి ప్రతి క్లాస్‌ రూమ్‌ను డిజిటలైజ్‌ చేస్తూ... ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ఫ్యానెల్స్‌ (ఐఎఫ్‌పీ)లను ఏర్పాటు చేస్తున్నాం. 

గవర్నమెంట్‌ బడుల్లో చదువుతున్న పిల్లలు 8వ తరగతికి వస్తే ఆ పిల్లలందరికీ వారి చేతిలో ట్యాబ్స్‌ ఉంచే కార్యక్రమం ఒక్క మన రాష్ట్రంలోనే జరుగుతోంది. చదువులను ప్రోత్సహిస్తూ కల్యాణమస్తు, షాదీ తోఫా అనే కార్యక్రమాలను తీసుకొచ్చాం. 


ఆ తర్వాత ఈ పిల్లలను మరింత గొప్పగా చదివించే కార్యక్రమం దిశగా అడుగులు వేస్తూ... దేశంలో  ఏ రాష్ట్రంలోనూ, ఎక్కడా జరగని విధంగా, పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో ఉన్నత విద్యలో విద్యా దీవెన, వసతి దీవెన తెచ్చాం. చదవుకుంటున్న పిల్లలకు, చదవిస్తున్న తల్లులకు ఏ మాత్రం భారం పడకుండా... 

మెరుగైన చదువులు, కరిక్యులమ్‌ లో మార్పులు తెచ్చి పిల్లలకు అందుబాటులోకి తెచ్చిన చరిత్ర ఒక్క ఆంధ్రరాష్ట్రంలోనే మాత్రమే జరుగుతుంది. 


విదేశీ విద్యాదీవెనలో భాగంగా ప్రపంచంలో ఉన్న టాప్‌ 50 కాలేజీలు, 21 ఫ్యాకల్టీలకు సంబంధించి..  350 కాలేజీలలో సీటు సంపాదించుకుంటే చాలు రూ.1.25 కోట్ల వరకూ మన పిల్లలకు సపోర్టు చేస్తున్న ఏకైక రాష్ట్రం దేశంలో మన ఆంధ్రప్రదేశ్‌ మాత్రమే.


*ఈ గిరిజన ప్రాంతాన్నే తీసుకుంటే...*

ఈ ప్రాంతానికి మంచి చేస్తూ... 3 మెడికల్‌ కాలేజీలు నిర్మాణంలో ఉన్నాయి. నర్సీపట్నంలో మెడికల్‌ కాలేజీ నిర్మాణంలో ఉంది. గిరిజన ప్రాంతానికి గేట్‌వేగా మొట్టమొదట నర్సీపట్నం కనిపిస్తోంది.  పాడేరులో మరో మెడికల్‌ కాలేజీ, పార్వతీపురంలో మూడో  మెడికల్‌ కాలేజీ నిర్మాణం చేస్తున్నాం. 

ఇవాళ శంకుస్ధాపన చేస్తున్న ట్రైబల్‌ యూనివర్సిటీ దగ్గర నుంచి కాస్త దూరం కురుపాంలో ఒక ట్రైబల్‌ ఇంజనీరింగ్‌ కాలేజీ నిర్మాణం జరుగుతోంది. వీటి ద్వారా ఈ ప్రాంతానికి ఎంత మంచి జరుగుతోందో ఆలోచన చేయమని కోరుతున్నాను. 

ఈ ప్రాంతానికి అత్యంత సమీపంలో కడుతున్న భోగాపురం ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ పోర్టు కనిపిస్తుంది. అక్కడ నుంచి మన ప్రయాణం మొదలుపెడితే... పాడేరులో మెడికల్‌ కాలేజీ కడుతున్నది మన కళ్ల ఎదుట కనిపిస్తోంది. 

అక్కడ నుంచి మరికాస్త దూరంలో సాలూరులో ట్రైబల్‌ యూనివర్సిటీకి శంకుస్థాపన చేశాం. సాలూరు నుంచి మరో నాలుగు అడుగులు ముందుకు వెళ్లి చూస్తే కురుపాంలో ట్రైబల్‌ ఇంజనీరింగ్‌ కాలేజీ మనకు కనిపిస్తోంది.


ఒక్క గిరిజన ప్రాంతలో మాత్రమే రెండు మెడికల్‌ కాలేజీలు, ట్రైబల్‌ యూనివర్సిటీ, ట్రైబల్‌ ఇంజనీరింగ్‌ కాలేజీ, నాడు–నేడుతో మొదలు ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు మనం తీసుకొస్తున్న విప్లవాత్మక మార్పులతో గిరిజనుల విద్యాసాధికారతకు కనీవినీ ఎరుగని విధంగా ఈ నాలుగేళ్ల కాలంలో అభివృద్ధి బాటలు పడుతున్నాయి.


*విద్యకు సంబంధించిన అంశాలే కాకుండా...* మనందరి ప్రభుత్వం 50 నెలల పాలనలో గిరిజనులకు ఏం చేసిందో మీ అందరితో నాలుగు మాటలు పంచుకుంటాను.

నా ఎస్టీలు.. అనే పదానికి అర్థం చెబుతూ రాజకీయంగా పదవుల్లో వారికి గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వనంతగా గిరిజనులను నా పక్కనే పెట్టుకున్నాను.

ఏ నామినేటెడ్‌ పదవి, ఏ నామినేటెడ్‌ కాంట్రాక్టు తీసుకున్నా నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ వర్గాలకు కచ్చితంగా 50 శాతం కేటాయించేట్లుగా ఏకంగా చట్టం చేసి మన ప్రభుత్వం  కార్యరూపం చేస్తుంది.


మొట్ట మొదట గిరిజన చెల్లెమ్మకు, నా గిరిజన అన్నకు కేబినెట్‌ లో డిప్యూటీ సీఎంగా నా పక్కన కూర్చోబెట్టుకున్నాను. గత ప్రభుత్వానికి భిన్నంగా... అధికారంలోకి వచ్చిన వెంటనే రాజ్యాంగ బద్ధంగా ట్రైబల్‌ అడ్వయిజరీ కమిటీని కూడా మీ బిడ్డ ప్రభుత్వంలోనే నియమించింది. 

నా ఎస్టీల కష్టాలు, కన్నీళ్లు తెలిసిన మనిషిగా.. ఎస్టీలకు మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రతి ఒక్క హామీ కూడా మనసా, వాచా, కర్మణా, త్రికరణశుద్ధిగా అమలు చేస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ కాలనీలు, గిరిజన తండాల్లో నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ ఇస్తామని హామీ ఇచ్చాం.  2019 జూలై నుంచి ఇప్పటివరకు 4.58 లక్షల గిరిజన కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల విద్యుత్‌ ఉచితంగా సరఫరా చేస్తున్నాం.  ఇందుకోసం రూ. 410 కోట్లు ఖర్చు చేశాం. 


*ప్రత్యేక జిల్లాలు-యూనివర్సిటీ-ఇంజనీరింగ్ కాలేజీ సైతం*

గిరిజనులకు ప్రత్యేక జిల్లా, ప్రత్యేక యూనివర్సిటీ, వైద్య, ఇంజనీరింగ్‌ కాలేజీ ఇస్తామని హామీ ఇచ్చాం.  దాన్ని నిలబెట్టుకుంటూ ఒకటి కాదు ఏకంగా రెండు జిల్లాలు.... అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ సెంట్రల్‌ ట్రైబల్‌ యూనివర్సిటీకి శంకుస్థాపన చేస్తున్నాం. రూ.1000 కోట్లతో అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో మెడికల్‌ కాలేజీ కడుతున్నాం. 

పార్వతీపురం మన్యం జిల్లాలో పార్వతీపురంలో మరో మెడికల్‌ కాలేజీ వేగంగా నిర్మాణం అవుతోంది.  కురుపాంలో గిరిజన ఇంజనీరింగ్‌ కాలేజీ ఏర్పాటు చేస్తాం అని చెబితే మన కళ్ల ఎదుటే నిర్మాణం కనిపిస్తోంది. 


గిరిజన తండాల జనాభా 500 ఉంటే పంచాయతీలుగా మార్పు చేస్తామని చెప్పిన మాట నిలబెట్టుకుంటూ.. ఇప్పటికే 165 గిరిజన గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేశాం. 


ప్రతి ఐటీడీఏ పరిధిలో మల్టీ స్పెషాల్టీ హాస్పిటల్‌ నిర్మాస్తామని మాట ఇచ్చాం. పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట, పార్వతీపురంలో, అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవం, ఏలూరు జిల్లా బుట్టాయగూడెం, ప్రకాశం జిల్లా దోర్నాలలో రూ. 250 కోట్లు ఖర్చు చేస్తూ మల్టీ స్పెషాల్టీ హాస్పిటళ్లు నిర్మాణంలో ఉన్నాయి. 


గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వ వైద్యం అందడం లేదన్న పరిస్థితిని పూర్తిగా మార్పు చేస్తూ ప్రతి గిరిజన గ్రామంలో విలేజ్‌ క్లినిక్‌ లు, ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ లు కనిపించే కార్యక్రమం జరుగుతోంది.

ఎస్సీ, ఎస్టీల నుంచి సేకరించిన భూములకు, ఇతర పట్టా భూముల కంటే 10 శాతం ఎక్కువ పరిహారం ఇస్తామని మాట ఇచ్చాం.  ఆ మాట నిలబెట్టుకుంటూ 2021 మే 19న జీవో 109 జారీ చేశాం. 

ఐదుగురు సభ్యులుండే ప్రత్యేక ఎస్టీ కమిషన్‌ను మీ బిడ్డ పరిపాలనలోనే తీసుకొచ్చాం.


*ఆర్వోఎఫ్‌ఆర్ పట్టాలు- రైతు భరోసా*

గిరిజనుల కోసం ఇంతగా తపించిన ప్రభుత్వం ఏదీ లేదు.  వారి బాగోగుల కోసం 1,53,820 గిరిజన కుటుంబాలకు మేలు చేస్తూ, 3,22,538 ఎకరాలను ఆర్వోఎఫ్‌ ఆర్‌ డీకేటీ పట్టాలు వారి చేతికి అందించింది కూడా మీ బిడ్డ ప్రభుత్వమే.  పెట్టుబడి ఖర్చుల కోసం రైతు భరోసా సొమ్ము కూడా మీ బిడ్డ ప్రభుత్వమే ఇస్తోంది.


గ్రామ, వార్డు సచివాలయాల్లో మన పిల్లలు 1.30 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులుగా కనిపిస్తున్నారు.  ఇందులో నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ వర్గాల వారే.. ఏకంగా 84 శాతం ఉద్యోగాలు వాళ్లే చేస్తూ అక్కడే కనిపిస్తున్నారు.  మరీ ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న 497 గ్రామ సచివాలయాల్లో పని చేస్తున్న 100 శాతం ఉద్యోగులు నా గిరిజన తమ్ములు, చెల్లెమ్మలే అని చెప్పడానికి గర్వ పడుతున్నాను. నవరత్నాల్లోని ప్రతి పథకాన్నీ నా గిరిజనులకు వర్తింపజేసేలా అడుగులు వేశాం. 


అవినీతి, వివక్షకు తావు లేకుండా పూర్తి పారదర్శకతతో అమలు చేస్తున్నాం. మీ బిడ్డ బటన్‌ నొక్కుతున్నాడు. నేరుగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు వెళ్లిపోతున్నాయి. 


*డీబీటీ- గిరిజనులకు మాత్రమే చూస్తే....*

గిరిజనుల వరకు మాత్రమే చూస్తే 50 నెలల పాలనలో 36.12 లక్షల గిరిజన కుటుంబాలకు ప్రయోజనం కలిగిస్తూ.. రూ.11,548 కోట్లు డీబీటీ ద్వారా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి పోతోంది.

దీనికి తోడు నాన్‌ డీబీటీ కూడా అంటే ట్యాబులు, ఇళ్ల పట్టాలు, విద్యాకానుక, సంపూర్ణ పోషణం వంటివి కలుపుకుంటే 22.26 లక్షల కుటుంబాలకు రూ.5,257 కోట్లు మేలు కలిగింది. మొత్తంగా డీబీటీ, నాన్‌ డీబీటీ కలుపుకుంటే మొత్తం 58.39 లక్షల గిరిజన కుటుంబాలకు రూ.16,805 కోట్లు నేరుగా వాళ్లకు వెళ్లాయి. 


*మార్పు తెలియజేసేందుకే...*

ఈ ప్రాంతంలో మీకు జరిగిన మార్పును మీకు తెలియజేసేందుకే ఇవన్నీ చెబుతున్నాను.  ఈ యూనివర్సిటీ వల్ల గొప్పమార్పు జరగబోతోంది.  రాబోయే రోజుల్లో తరతరాలు ఈ రోజు గుర్తుండిపోయేలా ఉండిపోతుందని తెలియజేస్తున్నాను. 


దేవుడి చల్లని దీవెనలు ఎల్లప్పుడూ మీ పట్ల, ఈ ప్రభుత్వం పట్ల ఉండాలని, కేంద్ర ప్రభుత్వ సహకారం మరింతగా రావాలని ఆకాంక్షిస్తూ, ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికీ మనసారా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అని సీఎం ప్రసంగం ముగించారు.

Comments