రివర్స్ పాలనలో పోలవరం బలి అయ్యింది.



రివర్స్ పాలనలో పోలవరం బలి అయ్యింది



కష్టపడి పండించిన ధాన్యం అమ్ముకోవడానికి రైతులు యాతన పడాలా?


దేశానికి అన్నం పెట్టిన గోదావరి జిల్లాల..నేడు రైతులు సాగు వదిలేసే పరిస్థితి వచ్చింది:- చంద్రబాబు నాయుడు


ఏడిద (ప్రజా అమరావతి):- జగన్ రెడ్డి పాలనలో అన్నదాతలు అన్ని విధాల దగా పడ్డారని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు.భవిష్యత్ కు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా కోనసీమ జిల్లా మండపేటలో రైతులతో  రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ......“ రైతుల్ని కలిసేముందు వర్షం పడటం నిజంగా శుభసూచకం. రైతే దేశానికి రాజు. కరోనా సమయంలో అన్నివృత్తులు, వ్యవస్థలు బంద్ అయ్యాయి. కానీ అన్నదాత దేశంకోసం పంటలు పండించి, ఆహారభద్రతకు ముప్పులేకుండా చేశాడు. అందరిలా రైతులుకూడా విశ్రాంతి తీసుకొని ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో అర్థంచేసుకోవాలి. తూర్పుగోదావరి జిల్లాలో ప్రతి ఊరిలో కాటన్ విగ్రహం ఉంటుంది. బ్రిటీష్ వ్యక్తి అయినా గోదావరి నీటిని ఈ ప్రాంతం రైతులకు అందించిన మానవతావాది. ఈ జిల్లాకు గోదావరి నీళ్లు అందించడం కోసం ధవళేశ్వరం బ్యారేజ్ కట్టించాడు. అప్పట్లోనే పోలవరం నిర్మాణం చేయాలని భావించి, రూ.129కోట్లతో అంచనాలు రూపొందించి, శ్రీరామపాద సాగర్ అని పేరు పెట్టారు. కానీ కొన్ని కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదు. 2014లో నాపై నమ్మకంతో ప్రజలు నన్ను గెలిపించారు. పోలవరం పూర్తిచేయడానికి తెలంగాణలోని 7 ముంపు మండలాలను ఏపీలో కలపాలని పట్టుబట్టి సాధించా. పోలవరం నిర్మాణాన్ని 72శాతం పూర్తిచేశాను. జాతీయ ప్రాజెక్ట్ పూర్తయితే ఉభయ గోదావరి జిల్లాల్లో మూడు పంటలు పండేవి. అలాంటి గొప్ప ప్రాజెక్టును దుర్మార్గుడు, సైకో ముఖ్యమంత్రి అయ్యాక  రివర్స్ టెండరింగ్ అని రివర్స్ పాలన తో నాశనం చేశాడు. కారు రివర్స్ లో నడిపితే ఎన్ని ప్రమాదాలు జరుగుతాయో, అంతకంటే ఎక్కువగా రాష్ట్రం నాశనమైంది. ఇతని రివర్స్ పాలనకు పోలవరం బలైంది. రైతులకు వరం పోలవరం... అలాంటి ప్రాజెక్ట్ ను ఈ సైకో నిర్వీర్యం చేశాడు. ఈ సైకో వచ్చాక చివరి భూములకు నీళ్లు వస్తున్నాయా... కాలువల్లో పూడిక తీయించాడా.. కంపచెట్లు తొలగించాడా..ప్రాజెక్టుల గేట్లకు గ్రీజు పెట్టాడా? నాలుగేళ్లలో రైతుల గురించి ఒక్కరోజైనా ఆలోచించాడా? ఆనాడు నేను భూమిసాగుచేసే రైతులకోసం మూడంచెల విధానం తీసుకొచ్చాను. కాలువల నిర్వహణ, ప్రాథమిక స్థాయిలో సాగునీటి సంఘాలు, వాటిపైన డిస్టిబ్రూషన్ కమిటీలు, ఆ పైన ప్రాజెక్టులు మరియు కాలువల నిర్వహణ కమిటీ లు ఏర్పాటు చేశాను.  మొత్తం రైతులకే అధికారమిచ్చాను.. ప్రాజెక్టులు, కాలువల నిర్వహణకు డబ్బులు అందించాను. ప్రతి సీజన్ లో మీరే స్వయంగా పనులు చేసుకొని, చివరి భూముల్లోని ప్రతిఎకరాకు నీళ్లు అందించే బాధ్యత మీ ద్వారానే సక్రమంగా జరిగేలా చేశాను.నేడు ఇతని అసమర్థపాలన, చేతగాని దద్దమ్మపాలన, మూర్ఖఫుపాలన రైతులకు శాపంగా మారింది. 23టీఎంసీల నీటిని ఏలేరు రిజర్వాయర్ కు తరలించేలా పురుషోత్తమపట్నం ప్రాజెక్ట్ నిర్మిస్తే, దాన్ని కూడా ఇతను మూలనపడేశాడు. ఏలేరులో నేటికీ 5, 6 టీఎంసీలకు మించి నీరు లేదు. చాగల్నాడు, పుష్కర లిఫ్ట్ ఇరిగేషన్లు నేనే ఏర్పాటుచేశాను. వాటినిర్వహణకు డబ్బులివ్వలేని దుస్థితిలో    ఈ ముఖ్యమంత్రి ఉన్నాడు. 

పోలవరం ప్రధాన కుడికాలువపై పట్టిసీమ నిర్మించి, సంవత్సరానికి 80, 90 టీఎంసీల నీటిని కృష్ణాడెల్టాకు అందించాను. వాటికి ప్రత్యామ్నాయంగా శ్రీశైలంలో నిల్వచేసిన  కృష్ణా నీటిని రాయలసీమకు అందించాను. ఇప్పుడు శ్రీశైలంలో నీళ్లు లేవు. ఈ మూర్ఖపు ముఖ్యమంత్రికి ఇప్పుడు నేను ఏర్పాటుచేసిన పట్టిసీమే గతైంది. ఇంకా భేషజాలకు పోతే ప్రజలు ఎక్కడ తిరగబడతారోనన్న భయంతోనే పట్టిసీమ పంపులు ఆన్ చేయించాడు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలనేవి నిరంతర ప్రక్రియ. ఐదేళ్లు అధికారమిస్తారు... మరలా మీ ముందుకొచ్చే నిలబడాలి. మరలా మీరు గెలిపిస్తేనే పరిపాలిస్తాం.  ఈ ఐదేళ్లలో ఒక్క రైతు జీవితమైనా బాగుపడిందా.. ఒక్క రైతు అయినా ఆనందంగా ఉన్నాడా అని ప్రశ్నిస్తున్నా. దేశవ్యాప్తంగా రైతులపై  ఉన్న తలసరి అప్పు రూ.74వేలు అయితే, మనరాష్ట్రం లో ప్రతి రైతుపై ఉన్న తలసరి అప్పు రూ.2,45,000. దేశంలోని ఇతర రాష్ట్రాల రైతులతోపోలిస్తే నా రాష్ట్ర రైతులు మూడురెట్లు ఎక్కువగా అప్పులపాలయ్యారు. ఈ అప్పులకు కారణం జగన్ రెడ్డి కాదా? దేశానికి అన్నపూర్ణ ఈ గోదావరి ప్రాంతం. ఇక్కడ వరి పండించే రైతులు ఆనందంగా ఉన్నారా? మీరు పండించిన ధాన్యాన్ని మద్ధతు ధరకు కొన్నారా? ఆర్బీకేలంటా.. అవి పెట్టమని ఎవరు అడిగారు? చేతనైతే రైతుల జీవితాలు మెరుగుపరచాలి.. అంతేగానీ ఈ  ఆర్బీకేల తో రైతుల్ని రోడ్డునపడేస్తారా? వరదలు, వర్షాలకు ధాన్యం తడిస్తే, దాన్ని కొన్నారా? కొన్న వెంటనే సకాలంలో రైతులకు డబ్బులు ఇచ్చారా? నా హాయాం లో రైతులు ఎక్కడ కావాలనుకుంటే అక్కడ ధాన్యం అమ్ముకునే అవకాశం ఉంది. ఇప్పుడు ఎక్కడో వీళ్ల పేటీఎమ్ బ్యాచ్ లో ఒకడికి రైస్ మిల్లు ఉంటుంది...  అక్కడే అందరూ ధాన్యం అమ్మాలి.  అడిగేవాడు లేకపోతే.. తన్నేవాడు లేకపోతే కొవ్వెక్కి ఇలాంటి పనులే చేస్తారు. రైతులు అంతదూరం లారీల్లో ధాన్యం తీసుకెళ్తే, వెంటనే ధాన్యం తీసుకోరు. అక్కడ రోజులతరబడి రైతులు పడిగాపులు పడాలి. ఏమిటీ తిక్క నిర్ణయాలు? ధాన్యం సేకరించే గోతాల్లోకూడా అవినీతే. రైతులకు ఇచ్చిన ధాన్యపు గోతాల్లో ధాన్యం తీసుకెళ్లడం వీలవుతుందా? రైతులకు ధాన్యపు గోతాలు ఇవ్వలేని ఈ  అసమర్థుడు మూడు రాజధానులు కడతా డా?  కోనసీమ అందాల సీమ. సుందరమైన ప్రకృతి అందాలకు నెలవు. అలాంటి కోనసీమ కొబ్బరి రైతులు సంతోషంగా ఉన్నారా? కొబ్బరికి గిట్టుబాటు ధర అంది స్తున్నారా? బాలయోగి హాయాంలో తెలుగుదేశం ప్రభుత్వం కొబ్బరిరైతులకు న్యాయం చేసింది. ఉభయగోదావరి జిల్లాల్లో ఆక్వాసాగు బాగా పెరిగింది. కానీ  ఈ ప్రభుత్వంలో  ఆక్వా రైతులకు కన్నీళ్లే మిగిలాయి. టీడీపీ హాయాంలో ఆక్వారైతు లకు అన్ని రకాల సబ్సిడీలు అందించింది. యూనిట్ విద్యుత్ రూ.2కే అందించా. ఇతను యూనిట్ రూ.1.50పైసలకే ఇస్తానని చెప్పి మోసగించాడు. మార్కెట్ సెస్సు .25శాతం ఉంటే, దాన్ని 1శాతానికి పెంచాడు. 1000లీటర్ల నీళ్లు రూ.12లకు మేం అందిస్తే, ఇతను రూ.120కు పెంచాడు. ఊరికే వచ్చి గోదావరి నీటిధర కూడా పెంచాడు. ట్రాన్స్ ఫార్మర్ల ధరలు పెంచాడు. ఆక్వాసాగుని వెంటిలే టర్ పైకి చేర్చాడు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లా రైతాంగానికి హామీ  ఇస్తున్నా. తెలుగుదేశం ప్రభుత్వం రాగానే ఉభయగోదావరి జిల్లా రైతాంగానికి పూర్వ వైభవం తీసుకొస్తాము. రైతుల ఆత్మహత్యల్లో రాష్ట్రాన్ని దేశంలో మూడోస్థానంలో నిలిపాడు. కౌలురైతుల ఆత్మహత్యల్లో రెండోస్థానంలో నిలిపాడు. రాష్ట్రంలో లాభసాటి పంటగా గంజాయి సాగుని మార్చాడు. గంజాయి పండించి, రోజూ తాగిపడుకుంటే రాష్ట్రాన్ని అంధకారం చేయొచ్చు. అదీ ఇతని ఆలోచన.  రైతులకు గిట్టుబాటు ధరకోసం రూ.4వేలకోట్లతో ధరలస్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాను అన్నాడు ఈ పెద్దమనిషి. ప్రకృతి విపత్తుల సహాయనిధి రూ.4వేలకోట్లు పెడతాను అన్నాడు. ఏదీలేదు. ఆఖరికి పంటలబీమా సొమ్ము చెల్లించకుండా రైతుల్ని వంచించాడు. అసెంబ్లీలో నేలపై కూర్చొని ధర్నాచేస్తే రాత్రికి రాత్రి రైతులకు అరకొరగా పంటలబీమా సొమ్ము జమచేశాడు. ఇతనివన్నీ తప్పుడు విధానాలు..తప్పుడు పనులే. సాగునీటి ప్రాజెక్టులు పూర్తిగా పడకేశాయి. ప్రజల్లో చైతన్యం తీసుకురావడం కోసం సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి ప్రకటించాను. రాయలసీమ నుంచి పాతపట్నం వరకు తిరిగాను. నీటి విలువ గురించి అందరూ తెలుసుకోవాలి. వ్యవసాయానికి, గృహావసరాలకు సోలార్ విద్యుత్ వినియోగిస్తే, జలవిద్యుత్ ఆదా అవుతుంది. సోలార్ విద్యుత్ తో కార్లు, బైక్ లు కూడా రీఛార్జ్ చేసుకోవచ్చు. అవసరమైతే మన గుర్తు అయిన సైకిల్ కూడా విద్యుత్ తో రీఛార్జ్ చేసుకోవచ్చు. పగటిపూట ఎండతో... రాత్రిపూట గాలితో విద్యుత్ తయారుచేసేలా ప్రణాళికలు రూపొందించాను. దానికితోడు పంప్ డ్ ఎనర్జీ తయారుచేస్తే యూనిట్ విద్యుత్ రూ.2లు.. రూ.3లకే లభిస్తుంది. విద్యుత్ ఛార్జీలు తగ్గుతాయి. రాబోయేరోజుల్లో విద్యుత్ ఉత్పత్తి పెంచి, నాణ్యమైన విద్యుత్ ను అందరికీ చౌకగా అందించేది తెలుగు దేశం ప్రభుత్వమే. మద్యపాన నిషేధం అన్నాడు... చేశాడా? మీ కుటుంబాలను మద్యానికి బానిసల్ని చేసి, అలా వచ్చే సొమ్ముతో నెట్టుకొస్తున్నాడు. మద్యంపై వచ్చే ఆదాయాన్ని తాకట్టుపెట్టి అప్పులు చేశాడు. మీకు ఉచితంగా ఇవ్వాల్సిన ఇసుక అమ్ముకుంటున్నాడు.  ఇలా ఈ  ముఖ్యమంత్రి ప్రతిదానిలో దోపిడీ చేస్తున్నాడు. జగన్ రెడ్డి బ్రాందీ షాపులు పెడితే, నేను అన్నాక్యాంటీన్లు పెడతాను. అదీ తేడా. 


*రైతుల ప్రశ్నలకు చంద్రబాబు నాయుడు సమాధానాలు.*

                                                                                                                                                                                                              *ప్రశ్న* : వరి పండించడం ఎంతకష్టమో.. ధాన్యం అమ్ముకోవడం అంతకంటే కష్టమైంది . చాలా ఇబ్బందులు పడుతున్నాం. పండించిన ధాన్యాన్ని లారీల్లో మిల్లర్లవద్దకు తరలించడం చాలా కష్టంగా మారింది. తేమశాతం పేరుతో కేవలం రూ.1100లు.. రూ.1200లు మాత్రమే చెల్లిస్తున్నారు. *(దానియేల్ : ధాన్యంరైతు – ఏడిద గ్రామం)*

*సమాధానం* :  దానియేల్ చెప్పింది నిజమే. ధాన్యానికి రూ.1530ల ధర ఇవ్వాలి. అది చేయలేకపోయారు. 6 నెలల్లో ఈ ప్రభుత్వం పోతుంది. టీడీపీ ప్రభుత్వం రాగానే రైతుని రాజుని చేస్తాను. ప్రతి మండలంలో అన్నాక్యాంటీన్లు పెట్టి మరలా మీ కడుపు నింపుతాను. 


*ప్రశ్న* :  దేవుడి మాన్యం భూములు సాగుచేసుకుంటుంటే, ఇంటి జాగాల పేరుతో వాటిని లాక్కొన్నారు. మాకు ఇల్లు లేదు.. నా భర్త మంచాన పడ్డాడు. 

*సమాధానం* : దేవుడి మాన్యం భూములే కాదు.. ఇంటి జాగాలపేరుతో అనేక చోట్ల పేదల భూములు బలవంతంగా లాక్కున్నారు. ఇళ్ల జాగాలపేరుతో పెద్ద మోసానికి పాల్పడ్డారు. పేదల ముసుగులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు..  కార్యకర్తలే బాగుపడ్డారు. టీడీపీప్రభుత్వం రాగానే మీ కుటుంబానికి న్యాయంచేస్తా ను అమ్మా.

*ప్రశ్న* : వ్యవసాయం చేయాలంటే రైతులు భయపడుతున్నారు. అకాల వర్షాలు, ప్రకృతి విపత్తులతో రైతులు దెబ్బతింటే, ప్రభుత్వాలు స్పందించడం లేదు. రైతు భరోసా సాయం నిజమైన రైతులకు అందడంలేదు. రైతులు ఎవరూ తమ బిడ్డల్ని వ్యవసాయం చేయండని చెప్పలేకపోతున్నారు. రైతుకి సరైన గుర్తింపు లేదు. టీడీపీ ప్రభుత్వం రాగానే రైతులకు వేతనం ఇవ్వాలి. రైతులు పండించిన పంటలకు వారే ధర నిర్ణయించేలా చూడాలి *(శ్రీనివాసరెడ్డి – రైతు)* 


*సమాధానం* : రైతులు బాగుండాలి.. వ్యవసాయం బలోపేతం కావాలంటే టీడీపీ ప్రకటించిన పథకాలతోనే సాధ్యం. రైతులకు ఉచితంగా విత్తనాలు, సూక్ష్మ. పోషకాలు, బీమా కల్పించడంతోపాటు, గిట్టుబాటు ధర అందేలా చేస్తాను. రైతు కష్టం నాకు తెలుసు. నేను రైతుబిడ్డనే. వారిని  ఆదుకోవడానికి ఏంచేయాలో అన్నీ చేస్తాను. 


*ప్రశ్న* :  ఉద్యోగం చేస్తూ కౌలుకి భూమితీసుకొని వ్యవసాయం చేస్తున్నాను. ప్రతిరైతుకి రూ.20వేలు ఇస్తామంటున్నారు.. కౌలురైతులకు ఇస్తారా? రైతులకు రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు నిరాకరిస్తున్నాయి. *(వరసా శ్రీను - వడ్లమూడి గ్రామం)*


*సమాధానం* : రైతుల్ని ఆదుకునే బాధ్యత నాది. భూమిని నమ్ముకున్న ప్రతి రైతుకి న్యాయం చేస్తా. గిట్టుబాటు ధర అందిస్తాను. 


*ప్రశ్న*: నేతన్నలకు పనిలేదు... కుటుంబపోషణ భారంగా మారింది. ప్రభుత్వ మిచ్చే సాయం కొందరికే పరిమితమైంది. మా ఊరిలో 250 మంది నేతకార్మికులుంటే, 35 మందికే ప్రభుత్వసాయం అందింది. *(సత్తిబాబు - చేనేత కార్మికుడు, ఏడిద గ్రామం)*

*సమాధానం* : 250 మంది ఉంటే, 35 మందికి సంవత్సరానికి రూ.25వేలు ఇస్తే, మిగిలినవాళ్లు ఎలా బతకాలి? బటన్ నొక్కా... బటన్ నొక్కా అంటాడు. బటన్ బొక్కుడు గురించి చెప్పడు. ఒకఊరిలో 215 మంది నేతకార్మికుల్ని మోసగించిన  ఈ ముఖ్యమంత్రిని ఏమనాలి? చేనేత కార్మికులకు నేను అన్నీ చేశానంటాడు. వ్యవసాయం తర్వాత ఎక్కువ మంది ఆధారపడింది నేతపని పైనే. మగ్గంపై కూర్చొని పని చేయడం తప్ప వారు మరోపని చేయలేరు. నేతకార్మికులకు ఆరోగ్యపరమైన సమస్యలు కూడా ఎక్కువ. చేనేత కార్మికులకోసం దసరాలోపు ఒక కొత్త పాలసీ ప్రకటిస్తాను. అధికారంలోకి రాగానే చేనేత కార్మికులందరికీ న్యాయం చేస్తాను. ఏడిద గ్రామానికి వచ్చి ఈ ముఖ్యమంత్రి నేత కార్మికులకు ఏంచేశాడో సమాధానం చెప్పాలి. ముఖ్యమంత్రి వస్తే నేను వస్తా.. ఇంటింటికీ వెళ్దాం.. నేత కార్మికుల్ని అడుగుదాం. వారే చెబుతారు. చెప్పిన అబద్ధం మళ్లీ మళ్లీ చెప్పేవాడే సైకో. అందర్నీ ఇబ్బందిపెట్టి ఆనందించేవాడే సైకో. మతిస్థిమితం లేకుండా ఇష్టమొచ్చినట్టు నిర్ణయాలు తీసుకుంటూ, ప్రశ్నించేవారి పై తప్పుడు కేసులు పెట్టేవాడే సైకో. సొంతపార్టీ ఎంపీని కొడుతుంటే చూసి ఆనందించిన 

వాడు ఈ సైకో. మీరు మరలా ఏమారితే, మీ పని ఇక అంతేనని చంద్రబాబు నాయుడు అన్నారు.

Comments