ఆంధ్రప్రదేశ్ పనితీరు పట్ల కేంద్ర ప్రభుత్వం ప్రశంసలు: ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్.



*ఆంధ్రప్రదేశ్ పనితీరు పట్ల కేంద్ర ప్రభుత్వం ప్రశంసలు: ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్*



*గతేడాది కన్నా మెరుగ్గా బ్యాంకర్ల 2023-24 ఏడాది రుణ ప్రణాళిక లక్ష్య సాధన*


*ఎమ్ఎస్ఎమ్ఈలకు మరింత విరివిగా రుణాలివ్వాలన్న ఆర్థిక మంత్రి*


*పీఎం ముద్ర, స్టాండప్ ఇండియాపై బ్యాంకర్లు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి*


*అర్హులైన పేదలు సులభంగా రుణాలు పొందేలా బ్యాంకర్లు చొరవ చూపాలి*


అమరావతి, అక్టోబర్, 30 (ప్రజా అమరావతి); రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అధ్యక్షతన స్టేట్ లెవల్ బ్యాంకర్స్ కమిటీ సమావేశమైంది. సోమవారం వెలగపూడి సచివాలయంలోని 5వ బ్లాక్ లో జరిగిన సమావేశంలో ఆర్థి మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మాట్లాడుతూ..2023-24 ఆర్థిక ఏడాదికి గానూ బ్యాంకింగ్ రుణ ప్రణాళిక లక్ష్యం గతేడాది (రూ.1.40లక్షల కోట్లు) కన్నా 20 శాతం ఎక్కువగా రూ.1.68 లక్షల కోట్లు  నమోదు చేయడం శుభపరిణామమన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ, బ్యాంకింగ్ అధికారులను మంత్రి బుగ్గన అభినందించారు.  ఏపీ ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరడంలో మెరుగ్గా ఉందని కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి భగవత్ కృష్ణారావ్ కరాద్ మెచ్చుకున్నట్లు మంత్రి బుగ్గన స్పష్టం చేశారు. ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు కల్పించే ఎమ్ఎస్ఎమ్ఈలకు రుణాలను విరివిగా ఇవ్వాలని బ్యాంకర్లను మంత్రి బుగ్గన ఆదేశించారు. పీఎం ముద్ర, స్టాండప్ ఇండియా సంబంధిత పథకాలకు రుణాలపై బ్యాంకర్లు మరింత దృష్టి సారించాలని వెల్లడించారు.


ప్రధానమంత్రి వీధి వ్యాపారుల ఆ్మనిర్భర్ నిధి, పీఎంఎఫ్ఎమ్ఈల ద్వారా చిరు వ్యాపారులకు రుణాలిచ్చే పథకానికి మరింత ప్రాధాన్యతనివ్వాలని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు.ఎక్కువ జాప్యం జరగకుండా దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు చొరవ తీసుకోవాలన్నారు. ఈ ఏడాది మార్చి ఆఖరు వరకూ డిపాజిట్లు రూ.4,56,961 కోట్లు కాగా గత  తర్వాత 3 నెలల్లో 3.69 శాతం పెరిగి డిపాజిట్లు రూ.4,73,806గా నమోదైనట్లు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్పష్టం చేశారు.పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని  8వ తరగతి అర్హత, ఒక జిల్లా - ఒక వస్తువు వంటివి తొలగించడం వంటి వాటితో సరళతరం చేసిన నేపథ్యంలో..  18 ఏళ్లు నిండిన అందరికీ  రుణసదుపాయం కల్పించడంలో వేగం పెంచాలన్నారు.


జూన్ ఆఖరు నాటికి, రాష్ట్రంలోని 67,422 మంది కౌలు రైతులకు రూ.517.86 కోట్లు ఆర్థిక సాయం అందించినట్లు మంత్రి స్పష్టం చేశారు. కౌలు రైతులకు సాయమందించడంలో వ్యవసాయ శాఖతో అనుసంధానమై ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యం చేరడానికి బ్యాంకర్ల నుంచి మరింత సహకారం కావాలన్నారు. వైఎస్ జగనన్న నగర్ లకు సంబంధించి గృహ నిర్మాణం చేసుకునే వారికి రుణ సదుపాయం కల్పించే లక్ష్యం రూ.2,464.72 కోట్లు (60 శాతం) చేరామన్నారు. సీఐబీఐఎల్ (సిబిల్) స్కోర్, వయస్సు వగైరా కారణాలతో ఎక్కువగా దరఖాస్తులు పక్కనపెడుతున్న నేపథ్యంలో దీన్ని పరిష్కరించి ప్రభుత్వ లక్ష్యం చేరడంలో భాగస్వామ్యం కావాలని మంత్రి బుగ్గన తెలిపారు. సెర్ప్ కి సంబంధించిన ఎస్.హెచ్.జీ బ్యాంక్ లింకేజీల ద్వారా ఇప్పటి వరకూ రూ.4,286 కోట్లు మాత్రమే రుణాలిచ్చినట్లు మంత్రి చెప్పారు..దీనిపై మరింత ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. రూ.3 లక్షల వరకూ డ్వాక్రా మహిళా సంఘాలు తీసుకునే  రుణాలపై వడ్డీని తగ్గించే అంశంపై  నిర్ణయం తీసుకోవాలన్నారు. తీసుకున్న అప్పులను తిరిగి చెల్లించే విధంగా నవరత్నాలు పేదలందరికీ ఇచ్చే రుణ పథకాలైన వైఎస్ఆర్ వడ్డీ లేని రుణాలు, పావలా వడ్డీ కార్యక్రమాలలో పేద మహిళలకు వడ్డీ భారం తగ్గించే అంశంపైనా చొరవతీసుకోవాలన్నారు.


ఎస్ఎల్బీసీ సమావేశానికి హాజరైన ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన రెడ్డి, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇడి రామ సుబ్రమణియన్,ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్.రావత్, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఆర్థికశాఖ కార్యదర్శి సత్యనారాయణ, చేనేత జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి కె.సునీత, సెర్ప్ సిఇఓ ఇంతియాజ్, ఆర్బిఐ జియం.ఆర్కె మహానా, ఎస్ఎల్బిసి కన్వీనర్ ఎం.రవీంద్రబాబు,నాబార్డు సిజిఎం ఎంఆర్.గోపాల్, యుబిఐ జియం.గుణానంద్ గామి,ఎజియం ఈ.రాజు బాబు,ఇంకా వివిధ బ్యాంకుల రాష్ట్ర స్థాయి కోఆర్డినేటర్లు, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు.



Comments