నవంబర్ 27 నుండి డిసెంబర్ 10 వరకు కులగణన కార్యక్రమం... జిల్లా సంయుక్త కలెక్టర్

 నవంబర్ 27 నుండి డిసెంబర్ 10 వరకు కులగణన కార్యక్రమం...


జిల్లా సంయుక్త కలెక్టర్ 



పుట్టపర్తి, నవంబర్ 14 (ప్రజా అమరావతి):


జిల్లాలో నవంబర్ 27 నుండి డిసెంబర్ 10 వరకు కులగణన కార్యక్రమం ఉంటుందని జిల్లా సంయుక్త కలెక్టర్ టీఎస్ చైతన్ పేర్కొన్నారు. 



మంగళవారం స్థానిక కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు కులగణన, వికసిత్ భారత పలు అంశాలపై విజయవాడ కార్యాలయం నుండి వాణిజ్య పన్నులు మరియు ప్రణాళిక విభాగం  ప్రిన్సిపల్ సెక్రెటరీ గిరిజ శంకర్. సాంఘిక సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా సంయుక్త కలెక్టర్ పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం  జాయింట్ కలెక్టర్ టీఎస్ చైతన్ మాట్లాడుతూ

కుల గణన గురించి సమీక్షిస్తూ... జిల్లాలో 27 నవంబర్ నుండి డిసెంబరు 10 వరకు కులగణన కార్యక్రమం ఉంటుందని, తహసిల్దార్లు మండల స్థాయిలో నోడల్ అధికారిగా ఉంటారని తెలిపారు. వాలంటీర్ల ద్వారా ఈ కార్యక్రమం గురించి ఇంటింటికి తెలియజేయాలని ఆదేశించారు. సచివాలయ సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి కుల గణన చేపట్టాలని తెలిపారు. కులగణలలో వాలంటీర్లను ఉపయోగించుకోరాదని తెలియజేశారు. వాలంటీర్లను కేవలం కార్యక్రమం గురించి తెలియజేసేందుకు మాత్రమే వినియోగించుకోవాలన్నారు. కుల గణన గురించి ఇంటింటికి వెళ్లి సేకరించిన వివిధ అంశాలను ప్రత్యేకంగా తయారుచేసిన మొబైల్ యాప్ లో పొందుపరచాలని ఆదేశించారు. వాలంటీర్లకు మరియు సచివాలయ సిబ్బందికి శిక్షణ ను ఇచ్చి కుల గణన గురించి పూర్తిగా అవగాహన కల్పించాలన్నారు. వికసిత్ భారత్ సంకల్పయాత్ర అనే కార్యక్రమాన్ని సమీక్షిస్తూ... కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పలు సంక్షేమ పథకాలకు అర్హులై ఉండి వాటి లబ్ధిని పొందని వారికోసం 15 నవంబర్ నుండి 26 జనవరి వరకు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లుగా తెలిపారు. ప్రతి జిల్లాకు అందించే ప్రచార వాహనాల ద్వారా కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి ప్రచారం చేయాలని, అర్హులై ఉండి లబ్ధి పొందని వారికి లబ్ధి చేకూర్చే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామంలో గ్రామ పంచాయతీ సెక్రటరీ నోడల్ అధికారి గా ఉంటారని తెలిపారు. గ్రామంలో కార్యక్రమాన్ని నిర్వహించిన తర్వాత లబ్ధిదారుల ఫోటోలను, టెస్టిమోనియల్స్ ను మొబైల్ యాప్ లో పొందుపరచాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సిపిఓ అధికారులు, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి శివరంగ ప్రసాద్, గిరిజన సంక్షేమ అధికారి మోహన్ రావు, బీసీ సంక్షేమ అధికారి నిర్మల జ్యోతి, మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి, వివిధ శాఖ ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.


Comments