బేతంచెర్లలో రెండు రైల్ ఓవర్ బ్రిడ్జిల ఏర్పాటుకు కృషి : ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్.




*బేతంచెర్లలో రెండు రైల్ ఓవర్ బ్రిడ్జిల ఏర్పాటుకు కృషి : ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్


*


*టీడీపీ నాయకుల మాటలు..నీటి మీద రాతలు*


*డోన్ ఇన్ఛార్జ్ ధర్మవరం సుబ్బారెడ్డి మాటలను సొంత పార్టీ నేతలే నమ్మడం లేదు*


*గుడులు, బడులు, రహదారులు, ప్రభుత్వ భవనాలు కట్టడం అభివృద్ధి కాదా?*


*రూ.350 కోట్లతో వాటర్ గ్రిడ్ ద్వారా నెలరోజుల్లో ఇంటింటికీ తాగునీరు*


*చేసేది చెప్పని, చెప్పింది చేయని పార్టీ..టీడీపీ*


*బేతంచెర్లలో 4వ గ్రామ సచివాలయ ప్రారంభోత్సవంలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్*


*కంటి శస్త్ర చికిత్స చేయించుకున్న  బేతంచర్ల వైసిపి నాయకులు బాబుల్ రెడ్డికి మంత్రి పరామర్శ*


బేతంచెర్ల, నంద్యాల జిల్లా,25 (ప్రజా అమరావతి); బేతంచెర్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులను రైల్వే అధికారుల దృష్టికి తీసుకువెళ్లి త్వరలోనే రెండు రైల్ ఓవర్ బ్రిడ్జిల ఏర్పాటుకు కృషి చేయనున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు. రూ.350 కోట్లతో వాటర్ గ్రిడ్ నిర్మాణం పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. నెల రోజుల్లో బేతంచెర్లకు స్వచ్ఛమైన తాగునీరు సరఫరా చేస్తామని పునరుద్ఘాటించారు. బేతంచెర్ల పట్టణంలోని రైల్వే గేటు సమీపంలో రూ.40 లక్షలతో కొత్తగా నిర్మించిన సచివాలయ భవనాన్ని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రారంభించారు. అందుకు సంబంధించిన పైలాన్ ను స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులతో కలిసి మంత్రి ఆవిష్కరించారు. పారిశ్రామికవేత్త, సచివాలయ స్థల దాత ఈ.వి సుజాత శర్మకు ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి బుగ్గన కృతజ్ఞతలు తెలిపారు.


*చేసేది చెప్పదు..చెప్పింది చేయదు..అదే టీడీపీ నైజం*  


సచివాలయ ప్రారంభోత్సవం అనంతరం ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలుగుదేశం పార్టీ, నాయకుల తీరుపై ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీ , ఆ పార్టీ డోన్ ఇన్ఛార్జ్ ధర్మవరం సుబ్బారెడ్డి ఇచ్చే హామీలు నీటిమూటలన్నారు. నిత్యావసరల ధరల పెరుగుదలను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి అంటగట్టడం వారి అవివేకానికి నిదర్శనమన్నారు.  

కోవిడ్-19 సంక్షోభంలో కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమం ప్రవాహంలా కొనసాగిందన్నారు.ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంచుతూ టీడీపీ నిర్వహిస్తోన్న చంద్రబాబు షూరిటీ-భవిష్యత్ కు గ్యారంటీ' కార్యక్రమం ఓ బూటకం అన్నారు. 2014లో పొదుపు మహిళల రుణాలను మాఫీ చేస్తామడం, ఎన్నికలకు ముందు పసుపు-కుంకుమ , రైతు రుణమాఫీపై అనేకమార్లు మాట మార్చడమే అందుకు నిదర్శనమన్నారు. చరిత్రలో ఏనాడూ మాట మీద నిలబడని నారా వారా ప్రజల భవిష్యత్ కు గ్యారంటీ? అంటూ మంత్రి ప్రశ్నించారు. హామీలను తగ్గించి, కుదించి, గెలిచిన మరుక్షణమే  మాట మార్చే నారా వారా ష్యూరిటీ? అంటూ నిలదీశారు. అమ్మఒడి, చేయూత, చేదోడు, రైతు భరోసా, సామాజిక పెన్షన్ల పెంపు లాంటివెన్నో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ చిత్తశుద్ధిని ప్రతిబింబిస్తాయన్నారు. 


*సొంతపార్టీ నేతలే నమ్మని వారి హామీలను ప్రజలు నమ్ముతారా?*


డోన్ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డు దారులకు ఒక్కొక్కరికి సెంటున్నర చొప్పున 32 వేల కుటుంబాలకు ప్లాట్లు ఇవ్వాలంటే 785 ఎకరాలు అవసరమని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పేర్కొన్నారు. ప్రభుత్వం ఇస్తుందా? వ్యక్తిగతంగా హామీ ఇచ్చిన వారిస్తారో ప్రజలకు స్పష్టతనివ్వాలన్నారు. ఒక్క బేతంచెర్ల పట్టణంలోని ప్రజలకు ఇళ్ల స్థలాలివ్వాలన్న 300 ఎకరాలకు సగటున రూ.300 కోట్లు సుబ్బారెడ్డి ఇస్తారా అని ప్రశ్నించారు. సొంత పార్టీ నేత, మాజీ మంత్రి కే.ఈ ప్రభాకర్ కూడా ధర్మవరం సుబ్బారెడ్డి మాటలను నమ్మే పరిస్థితి లేదన్నారు. 40 ఎకరాలున్న సుబ్బారెడ్డి 785 ఎకరాలు ఎలా ఇస్తావని అడగడంతో పాటు ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చే సుబ్బారెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితులను మంత్రి బుగ్గన ప్రస్తావించారు. సొంత పార్టీ  నాయకులే నమ్మని టీడీపీ నాయకులని, వారి హామీలను ప్రజలు నమ్మరన్నారు. బీ.పి శేషారెడ్డి పీ.హెచ్.సీ ని సీ.హెచ్.సీగా మరింత అభివృద్ధి చేశామన్నారు.  

బీసీ రెసిడెన్షియల్ బాలుర పాఠశాల,ఐ.టీ.ఐ, పాలిటెక్నిక్ నిర్మించడం అభివృద్ధి కాదా? చెప్పాలన్నారు.  ముఖ్యమంత్రికి డోన్ ప్రజల మీదున్న అభిమానం, నా మీద నమ్మకానికి నిదర్శనమే అభివృద్ధికి విజయానికి కారణమన్నారు. 


 అంతకుముందు బేతంచర్ల వైసీపీ నాయకులు బాబుల్ రెడ్డి కర్నూలు పట్టణంలోని మోడ్రన్ ఐ హాస్పిటల్ లో కళ్ళకి శస్త్ర చికిత్స చేయించుకున్న నేపథ్యంలో ఆర్థిక శాఖ మంత్రి గల రాజేంద్రనాథ్ స్వయంగా వెళ్లి పరామర్శించారు.


ఈ కార్యక్రమంలో  బేతంచెర్ల  మున్సిపల్ ఛైర్మన్ చలం రెడ్డి, ఎంపీపీ బుగ్గన నాగభూషణం రెడ్డి, వాల్మీకి ఫెడరేషన్  డైరెక్టర్ మురళీకృష్ణ, ఉర్దూ కమిటీ సభ్యులు ముర్తూజావలి, రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ ఖాజా, ఎంఆర్వో నరేంద్రనాథ్ రెడ్డి, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.

 

Comments