రబీ పంటల సాగుకు నీరు అందిస్తామ.

కాకినాడ (ప్రజా అమరావతి);

సమర్ధ నీటి యాజమాన్య ప్రణాళికతో  కాకినాడ జిల్లా పరిధిలోని వివిధ సాగునీటి వ్యవస్థల క్రింద ఉన్న  మొత్తం లక్షా 91 వేల ఎకరాల పూర్తి ఆయకట్టుకు రబీ పంటల సాగుకు నీరు అందిస్తామ



ని రాష్ట్ర బిసి సంక్షేమం, సమాచార పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి  చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ తెలిపారు. 

మంగళవారం ఉదయం కలెక్టరేట్ వివేకానంద సమావేశ హాలులో కాకినాడ జిల్లా సాగునీటి సలహా మండలి, జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశాలు సంయుక్తంగా జిల్లా కలెక్టర్ డా.కృతికా శుక్లా అద్యక్షతన జరిగాయి.  ఈ సమావేశాలకు మంత్రి వేణగోపాల కృష్ణ ముఖ్య అతిధిగాను, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు విశిష్ట అతిధులుగాను హాజరైయ్యారు.  జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా సమావేశాన్ని ప్రారంభిస్తూ ఇటీవల రాష్ట్ర స్థాయిలో ముఖ్య మంత్రి అధ్యక్షతన జరిగిన సమావేశంలో  రబీ పంటలకు పూర్తి స్థాయిలో సాగునీరు, ఆవాసాలకు త్రాగునీరు అందించాలని గైకొన్న నిర్ణయాల కనుగుణంగా ఫసలీ 1433,  2023-24 రబీ సీజనుకు జిల్లాలోని పంటలకు సాగునీరు అందించే ప్రణాళికను సలహా మండలి సమీక్ష, ఆమోదం కొరకు ప్రవేశ పెట్టాలని ఇరిగేషన్ ఎస్ఈని కోరారు. ఈ మేరకు కాకినాడ జిల్లా పరిధిలో వివిధ సాగునీటి వ్యవస్థల క్రింద  నీటి సరఫరాకు రబీ ప్రణాళికలను  ఇరికేషన్ ఎస్ఈ జి.శ్రీనివాసరావు మండలికి వివరించారు. ఈ సందర్భంగా గోదావరి తూర్పు, మద్య, పశ్ఛిమ డెల్టాల పరిధిలోని మొత్తం ఆయకట్టు 8.87 లక్షల ఎకరాల ఆయకట్టుకు రబీ పంటల కొరకు 91.35 టియంసిల సాగునీరు అవసరం ఉండగా, 82.49 టియంసిల నీటి లభ్యత ఉందని, సుమారు 10 శాతం నీటి కొరత ఉందని ఆయన తెలిపారు. వారాబంది విధానం, క్రాస్ బండ్ లు, డీజెల్ ఇంజన్లతో లిప్టింగ్, మందస్తు వరి నాట్లు ద్వారా ఈ కొరతను అధిగమించి మొత్తం ఆయకట్టుకు నీరు అందించేందుకు ప్రతిపాదిస్తున్నామని తెలిపారు.  ఇందులో భాగంగా కాకినాడ జిల్లాలో తూర్పు డెల్టా పరిధిలోని లక్షా 5 వేల ఎకరాలు, పిఠాపురం బ్రాంచి కెనాల్ పరిధిలోని 32,500 ఎకరాలు  పూర్తి ఆకట్టు మేరకు సాగునీటి సరఫరాకు ప్రతిపాదిస్తున్నామన్నారు.  పిబిసి పరిధిలో 22,260 ఎకరాల్లో వరి సాగుకు, 10,240 ఎకరాల మెట్ట, శివారు ఆయకట్టులో అపరాలు సాగుకు ప్రతిపాదించామన్నారు. 

ఏలేరు రిజర్వాయర్ లో ప్రస్తుతం 11.31 టియంసిల నీటి నిల్వ ఉండగా, ఇందులో 4.50 టియంసిలు విశాఖ నగర త్రాగునీటి అవసరాలు, స్టీల్ ప్లాంట్ అవసరాల కొరకు, మరో 4.5 టియంసిలు డెడ్ స్టోరేజి నిమిత్తం కేటాయించగా, మరో 2.31 టియంసిలు ఏలేరు వ్యవస్థలోని 53 వేల ఎకరాలలో రబీ పంటలకు అందుబాటులో ఉంటాయని ఎస్ఈ వివరించారు. ఇందులో 28 వేల ఎకరాలలో వరిసాగుకు, 25 వేల ఎకరాలలో అపరాల పంటలకు సాగునీరు అందించాలని ప్రతిపాదించామని ఆయన సాగునీటి మండలి సభ్యులకు వివరించారు.

అనంతరం జరిగిన చర్చలో గోదావరి నదికి ఎగువ నుండి నీరు చేరే సూచనల దృష్ట్యా  రబీ పంటలకు సాగునీటి ఎద్దడి లేకుండా నివారించేందుకు, పోలవరం బారేజిలో గేట్లు దింపి, కనీసం 20 టియంసిల నీటిని నిల్వ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాలని కాకినాడ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు చేసిన ప్రతిపాదనను మండలి ఏకగ్రీవంగా ఆమోదించి రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించాలని తీర్మానం చేసింది. 

ఏలేరులో డెడ్ స్టోరేజి స్థాయిని 4.5 టియంసిలకు బదులు 2 టియంసిలకు తగ్గించి, ఈ మేరకు వీలైనంత మెట్ట, శివారు ఆయకట్టులో అపరాలకు బదులు, వరి సాగుకు అవకాశం కల్పించాలని పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు, రైతు ప్రతినిధులు చేసిన విజ్ఞప్తికి మండలి సానుకూలంగా స్పందించి ఈ మేరకు ప్రతిపాదనలు సవరించాలని ఇరిగేషన్ ఎస్ఈని కోరింది.  

           అందుబాటులో ఉన్న నీటితో రబీ పంటలను సజావుగా, సకాలంలో 2024 మార్చి 31వ తేదీలోపున పూర్తి చేసుకునేందుకు, రైతులు డిశంబరు 31 లోగా నాట్లు పూర్తి చేసుకోవాలని, ఖరీఫ్ ఆలస్యమైన రైతులు పంటకాలం కలిసి వచ్చేందుకు డిశంబరు 10వ తేదీ లోపున వెదజల్లే పద్దతిలో నాట్లు వేసుసువాలని ఆర్.బి.కే. స్థాయిలో విస్తృత రైతు అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వ్యవసాయ, ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు.   సాగునీటి సమర్థ వినియోగం కొరకు 2024 జనవరి చివరి వారం నుండి వంతుల వారీ  వారాబంది విధానాన్ని అమలు చేయాలని, ఏ భూములకు ఏప్పుడు నీరిచ్చేది స్పష్టంగా షెడ్యూల్ రూపొందించి రైతులందరికీ సమగ్ర అవగాహన కల్పించాలని ఆమె కోరారు. రబీ పంటలకు సాగునీటి సరఫరా ప్రారంభానికి మందే ఆక్వా అవసరాల కొరకు నీటిని నిలుపుకోనే ప్రక్రియను పూర్తి చేసి, నిలుపుచేయాలని ఆదేశించారు.  అన్ని స్థాయిల్లోని వ్యవసాయ సలహా మండళ్లు,  ఆభ్యుదయ రైతులు, వ్యవసాయ అధికారులు ముందస్తు సాగు అవసరం, నీటి సరఫరా నియంత్రణ షెడ్యూల్ అంశాలపై రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు.  నీరు పారని హై లెవల్ పాచ్  భూముల రైతులు, నాట్లు సకాలంలో వేసుకోలేని రైతులు అపరాల పంటలు చేపట్టేలా సూచించాలన్నారు. 

  సమావేశంలో రబీ సాగునీటి విడుదలకు ముందు నీటి పారుదల సమస్యల నివారణకు తూర్పు డెల్టా పరిధిలో 45.97 లక్షలతో 4 పనులు, కాకినాడ డ్రైనేజి డివిజన్ పరిధిలో 41.12 లక్షల నిధులతో 12 పనులు , ఏలేరు డివిజన్ పరిధిలో 48.02 లక్షలతో 9 పనులు వెరసి మొత్తం కోటీ 45 లక్షలు డియంఎప్ నిధులతో 25 పనులను మంజూరు చేసామని, ఈ పనులను సకాలంలో పూర్తి చేసి గత సీజనులో ఎదురైన సమస్యలు పునరావృతం కాకుండా చూడాలని కలెక్టర్ ఇరిగేషన్ అధికారులను కోరారు.  అలాగే 5 లక్షల లోపు పనులను నామినేషన్ పద్దతి పై రైతు సంఘాలే నిర్వహించుకునేందుకు మండలి ఆమోదం తెలిపింది.  సమర్ధ సాగునీటి సరఫరా కొరకు ఈ రబీలో 42 ఆయిల్ ఇంజన్లు, 30 క్రాస్ బండ్లు, 8 షట్లర్లు, స్లూయిస్ ల ఏర్పాటు 31 డీసిల్టింగ్, వీడ్ రిమూవల్ పనులు, ఒక ఐడిసి పని ప్రతిపాదించామన్నారు. 

  సమావేశంలో రాష్ట్ర బిసి సంక్షేమం, సమాచార పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి  చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ మాట్లాడుతూ రైతు సంక్షేమం దృష్టిలో ఉంచుకుని  రబీలో పూర్తి విస్తీర్ణానికి సాగునీరు అందించాలనే ప్రభుత్వం నిర్ణయించిందని, ఇందుకనుగుణంగా ఇరిగేషన్, వ్యవసాయ, రెవెన్యూ అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరారు.

ఈ సమావేశంలో  జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, వ్యవసాయ శాఖ జేడి ఎన్.విజయ్ కుమార్, జిల్లా వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు లంక ప్రసాద్, రాష్ట సలహా మండలి సభ్యులు త్రినాధరెడ్డి, వ్యయసాయ సలహ మండలి సభ్యులు, రైతు ప్రతినిధులు పాల్గొన్నారు. 

Comments