అంగన్వాడీల సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉంది .

 అంగన్వాడీల సమ్మెను సంక్రాంతి వరకూ వాయిదా వేయాలి మంత్రుల బృందం విజ్ణప్తి

అంగన్వాడీల 11 డిమాండుల్లో 10 ఇప్పటికే అంగీకరించడం జరిగింది

ఒకే ఒక్క డిమాండు గౌరవ వేతనం పెంపు అంశం సంక్రాంతి తర్వాత చర్చిద్దాం

గ్రాట్యుటీ పెంపుదలపై కేంద్రానికి లేఖ వ్రాసేందుకు సిద్ధం

జనవరి 5 నుండి అంగన్వాడీ కేంద్రాల ద్వారా సరుకులు పంపిణీ చేయాల్సి ఉంది 

అంగన్వాడీల సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉంది 


అమరావతి,26 డిశంబరు (ప్రజా అమరావతి):రాష్ట్రంలో అంగన్వాడీ కార్యకర్తలు,సహాయకుల డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం పూర్తి సానుకూలంగా ఉందని అయితే ఇందుకు ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని కావున సంక్రాంతి వరకూ సమ్మెను వాయిదా వేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అంగన్వాడీ కార్యకర్తలు,సహాకుల సంఘాల ప్రతినిధులకు విజ్ణప్తి చేశారు.అంగన్వాడీల సమ్మెపై నేపధ్యంలో వారి డిమాండ్లపై మంగళవారం రాష్ట్ర సచివాలయంలో మంత్రి బొత్స అధ్యక్షతన మంత్రుల బృందం సమావేశమై చర్చించింది. ఈసందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ,ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహారాలు)సజ్జల రామకృష్ణారెడ్డి,ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్. జవహర్ రెడ్డిలు మాట్లాడుతూ జనవరి 5నుండి అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలు,బాలింతలు,చిన్నారులకు టేక్ హోం రేషన్ సహా వివిధ సరుకులు పంపిణీ చేయాల్సి ఉన్నందున సంక్రాంతి వరకూ సమ్మెను వాయిదా వేయాలని విజ్ణప్తి చేశారు.సంక్రాంతి అనంతరం మరలా కూర్చుని చర్చించుకుని అన్ని సమస్యలను పరిష్కరించుకుందామని విజ్ణప్తి చేశారు.

ఇప్పటికే అంగన్వాడీలకు సంబంధించి 11 డిమాండులకు గాను 10 డిమాండులను పరిష్కరించడమే గాక 4అంశాలకు సంబంధించి అనగా పదవీ విరమణ వయస్సు 60 నుండి 62 ఏళ్ళకు పెంపు,పదోన్నతి వయస్సు 45 నుండి 50 ఏళ్ళకు పెంపు,టిఏడిఏలు,అంగన్వాడీ కార్యకర్తలకు ఇచ్చే సేవా ప్రయోజనాన్ని50 వేల రూ.లు నుండి లక్ష రూ.లకు,సహాయకులకు ఇచ్చే సేవా ప్రయోజనాన్ని 25 వేల నుండి 40 వేల రూ.లకు పెంచడం వంటి వాటిపై జిఓలను కూడా జారీ చేశామన్నారు.మిగతా అంశాలపై రెండు మూడు రోజుల్లో జిఓలను జారీ చేయడం జరుగుతుందని మంత్రుల బృందం స్పష్టం చేసింది.ఒకే ఒక్క డిమాండు అనగా గౌరవ వేతనం పెంపు అంశం మిగిలి ఉందని దీనిపై సంక్రాంతి తర్వాత మరలా సమావేశమై చర్చించి దానిపై ఒక సానుకూల నిర్ణయం తీసుకుందాని చెప్పింది.అదే విధంగా అంగన్వాడీల గ్రాట్యుటీ అంశానికి సంబంధించి కేంద్రానికి లేఖ వ్రాస్తామని స్పష్టం చేసింది.అంగన్వాడీల సమస్యల పరిస్కారం పట్ల ప్రభుత్వం పూర్తి సానుకూలంగా ఉందని కావున సమ్మెను సంక్రాంతి వరకూ వాయిదా వేయాలని మంత్రుల బృందం పునరుద్ఘాటించింది.

ఈసమావేశంలో అంగన్వాడీ వర్కర్లు,సహాయకుల సంఘాల తరుపున పాల్గొన్న పలువురు ప్రతినిధులు మాట్లాడుతూ వేతనం పెంపుపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ముక్త కంఠంతో విజ్ణప్తి చేశారు.ప్రస్తుత ధరల దృష్ట్యా చాలీచాలని వేతనంతో కుటుంబాలను పోషించు కోవడం కష్టంగా ఉందని గౌరవ వేతనం పెంపునకు తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ణప్తి చేశారు.

ఈసమావేశంలో ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన ఎస్.ఎస్.రావత్,స్త్రీ శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జి.జయలక్ష్మి,ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి(హెచ్ ఆర్) చిరంజీవి చౌదరి,స్త్రీ శిశు సంక్షేమశాఖ డైరెక్టర్ విజయ కృష్ణన్ తదితర అధికారులు పాల్గొన్నారు.

అదే విధంగా అంగన్వాడీ కార్యకర్తలు,సహాయకుల తరపున సిఐటియు రాష్ట్ర జనరల్ సెక్రటరి ఎం.సుబ్బరావమ్మ,రాష్ట్ర అంగన్వాడీ కార్యకర్తలు,సహాయకుల రాష్ట్ర అధ్యక్షురాలు జి.వేణి రాణి,ఉపాధ్యక్షురాలు సుప్రజ,అంగన్వాడీ హెల్పర్ల ఉపాధ్యక్షురాలు రమాదేవి, ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షురాలు గంగావతి,ఉపాధ్యక్షురాలు జి.భారతి,సెక్రటరి విఆర్.జ్యోతి, ఎఐటియుసి వర్కింగ్ ప్రెసిడెంట్ కె.ప్రేమ,వైస్ ప్రెసిడెంట్ ప్లారెన్స్, జనరల్ సెక్రటరి జె.లలిత తదితరులు పాల్గొన్నారు.


Comments