*చంద్రబాబును సీఎంను చేయాలన్నదే షర్మిల లక్ష్యం*
*షర్మిల వాడిన భాష, యాస సరికాదు*
*ఏపీలో ఉనికి లేని పార్టీ కాంగ్రెస్*
*రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి*
గుంటూరు (ప్రజా అమరావతి): టీడీపీ అధినేత చంద్రబాబును ఎలా సీఎంను చేయాలన్నదే షర్మిల లక్ష్యంగా కనిపిస్తోందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఏపీలో ఉనికి లేని పార్టీ కాంగ్రెస్ అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి, వైఎస్సార్ కుటుంబానికి అన్యాయం చేసిందన్నారు. సజ్జల ఆదివారం మీడియాతో మాట్లాడుతూ ‘షర్మిల వాడిన భాష, యాస సరికాదు. వైఎస్సార్ ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిబద్ధతతో పనిచేస్తున్నారన్నారు. వైఎస్సార్ వారసుడిగా సీఎం జగన్ ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారని, వైఎస్సార్ మరణానంతరం ఆయన కుటుంబ సభ్యులను కాంగ్రెస్ ఇబ్బందులకు గురి చేసిందన్నారు. సీఎం వైఎస్ జగన్పై పెట్టినవి అక్రమ కేసులని గులాం నబీ ఆజాదే చెప్పారు. వైఎస్సార్ పేరును ఎఫ్ఐఆర్లో చేర్చింది కాంగ్రెస్సే అని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పార్టీ గురించి షర్మిలకు ఏం తెలుసు?. షర్మిల తెలంగాణ నుంచి ఏపీకి హఠాత్తుగా ఎందుకొచ్చారు. ఆ పార్టీ తరపున షర్మిల ఇక్కడకు వచ్చి ఏం చేస్తారు?. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ షర్మిలను ఎందుకు గుర్తించలేదు?. తెలంగాణలో పోటీ చేస్తానన్న షర్మిల ఎందుకు వెనకడుగు వేశారు?. ఏపీలో ఎవరికి ఆయుధంలా ఉపయోగపడాలని వచ్చారో అందరికీ తెలుసు. ఇదంతా చంద్రబాబు ఎత్తుగడే. అందుకే ఆ వర్గం మీడియా షర్మిలను భుజానికి ఎత్తుకుంది. చంద్రబాబు కుట్రలో చివరి అస్త్రంగా షర్మిలను ప్రయోగించారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగైంది. టీడీపీ వెంటిలేటర్పై ఉంది. గత ఎన్నికల్లో నోటా కంటే తక్కువ ఓట్లు కాంగ్రెస్కు వచ్చాయి. చంద్రబాబుతో కుమ్మకై ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఏపీకి అన్యాయం చేసింది. ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్సీపీ పోరాటం కొనసాగుతూనే ఉంది. ప్రత్యేక హోదాను ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చర్చలో పెట్టలేదు. దీనిపై షర్మిల కచ్చితంగా వివరణ ఇవ్వాల్సిందే. చంద్రబాబు తన హయాంలో ప్రజలకు ఏం చేశారో చెప్పలేకపోతున్నారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో వైఎస్ జగన్ రాజీ పడరు. కేంద్రంతో సఖ్యతగా ఉండి సీఎం జగన్ రాష్ట్రానికి మేలు చేస్తున్నారు. చివరగా వైఎస్సార్ తనయురాలిగా, వైఎస్ జగన్ చెల్లెలిగా షర్మిలను అభిమానిస్తామని చెప్పుకొచ్చారు.
addComments
Post a Comment