ఏపీపీఎస్సీ గ్రూపు-2 పరీక్షల నిర్వహణకు విస్తృతమైన ఏర్పాట్లు.

 ఏపీపీఎస్సీ గ్రూపు-2 పరీక్షల నిర్వహణకు విస్తృతమైన ఏర్పాట్లు.



 రాష్ట్ర వ్యాప్తంగా 1327 కేంద్రాల్లో పరీక్షలు 


*ఉదయం 10.30గం.ల నుండి మధ్యాహ్నం 1గంట వరకు పరీక్షలు.


*పర్యవేక్షణకు 24మంది ఐఏఎస్ అధికారులు.


ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా విస్తృత బందోబస్తు ఏర్పాట్లు 


*కలెక్టర్లు,ఎస్పీలతో  వీడియో సమావేశంలో సిఎస్ జవహర్ రెడ్డి.


విజయవాడ,24 ఫిబ్రవరి (ప్రజా అమరావతి): ఈనెల 25వ తేది ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించ నున్న ఎపిపిఎస్సి గ్రూపు-2 స్ర్కీనింగ్ వ్రాత పరీక్షలకు విస్తృతమైన ఏర్పాట్లు చేయడం జరిగిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్. జవహర్ రెడ్డి వెల్లడించారు. ఈఅంశంపై శనివారం విజయవాడ సిఎస్ క్యాంపు కార్యాలయం నుండి ఆయన జిల్లా కలెక్టర్లు,ఎస్పీలు, ఎపిపిఎస్సి తదితర అధికారులతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివారం జరగనున్న గ్రూపు-2 ప్రిలిమినరీ స్క్రీనింగ్ పరీక్షలు ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా జరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్లు,ఎస్పీలను సిఎస్ ఆదేశించారు.జిల్లాల్లో పరీక్షల నిర్వహణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు, ఎస్పీలను సిఎస్ ఆదేశించారు. అదే విధంగా ఆయా పరీక్షా కేంద్రాల్లో తాగునీరు,విద్యుత్  సరఫరా వంటి కనీస సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు.


రాష్ట్ర వ్యాప్తంగా 1327 కేంద్రాల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి సిఎస్ జవహర్ రెడ్డి పేర్కొన్నారు.ఉదయం 10.30.గం.ల నుండి మధ్యాహ్నం 1గంట వరకూ పరీక్షలు జరుగుతాయని తెలిపారు.పరీక్షలు సజావుగా జరిగేందుకు నిరంతర పర్యవేక్షణకై 24 మంది అఖిల భారత సర్వీసుల అధికారులు,450 మంది రూట్ అధికారులు, 1330 మంది లైజనింగ్ అధికారులను నియమించడం జరిగిందని సిఎస్  పేర్కొన్నారు.


అదే విధంగా 24వేల 142 మంది ఇన్విజిలేటర్లు,మరో 8500 ఇతర సిబ్బందిని ఆయా పరీక్షా కేంద్రాల్లో నియమించడం జరిగిందని సిఎస్ తెలిపారు. అంతేగాక విస్తృత బందోబస్తు చర్యల్లో భాగంగా 3971 మంది పోలీసు సిబ్బందిని నియమించడంతో పాటు పరీక్షా పత్రాలు,జవాబు పత్రాలు తదితర కాన్ఫిడెన్సియల్ మెటీరియల్ నిర్దేశిత ప్రాంతాలకు సురక్షితంగా తరలించేందుకు వీలుగా 900 మంది ఎస్కార్ట్ సిబ్బందిని నియమించడం జరిగిందని తెలిపారు.అలాగే మొత్తం పరీక్షల తీరును ఎపిపిఎస్సి నుండి 51మంది అధికారులు పర్యవేక్షించినున్నారని సిఎస్ పేర్కొన్నారు.


అంతేగాక పరీక్షలు జరుగుతున్న తీరును నిరంతరం పర్యవేక్షించేందుకు వీలుగా పలు పరీక్షా కేంద్రాలను సీసీటీవీ కెమెరాలతో అనుసంధానించడం జరిగిందని సిఎస్ తెలిపారు.


పరీక్షల నిర్వహణకు సంబంధించిన మెన్ అండ్ మెటీరియల్ తరలించేందుకు 14 ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేయడం జరిగిందని సిఎస్ జవహర్ రెడ్డి పేర్కొన్నారు.


ఈవీడియో సమావేశంలో వివిధ జిల్లాల కలెక్టర్లు,ఎస్పీల తోపాటు ఎపిపిఎస్సి కార్యదర్శి ప్రదీప్ కుమార్ పాల్గొన్నారు.



Comments