సార్వత్రిక ఎన్నికలకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలి.

 *సార్వత్రిక ఎన్నికలకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలి*


*: జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించిన సి.ఇ.ఓ. ముకేశ్ కుమార్ మీనా* 


అమరావతి, ఫిబ్రవరి 2 (ప్రజా అమరావతి):  రాష్ట్రంలో త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికలను పటిష్టంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని పనులను సకాలంలో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయం నుండి  అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో ఆయన మీడియో కాన్పరెన్సు నిర్వహించి ఎన్నికల సంసిద్దత, ఓటర్ల జాబితా నవీకరణకు తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల షెడ్యూలు ప్రకటన, నోటిఫికేషన్ జారీకి ఎక్కువ సమయం లేదని ఈ లోపే ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలన్నారు. ఎన్నికల నిర్వహణకు సంబందించిన తాజా మార్గదర్శకాలను ఇప్పటికే అన్ని జిల్లాలకు పంపించడం జరిగిందని, వాటిపై జిల్లా ఎన్నికల అధికారులు సమగ్ర అవగాహను పెంపొందించుకుని తగు చర్యలు తీసుకోవాలన్నారు. 


జిల్లాల వారీగా ఉన్న సమస్యాత్మమైన పోలింగ్ స్టేషన్ల విషయంలో ప్రత్యేక శ్రద్ద చూపాలని, సునిశితమైన, సమస్యాత్మకమైన పోలింగ్ స్టేషన్లలతో పాటు 1,200 మంది ఓటర్ల పైబడిన ఉన్న పోలింగ్ స్టేషన్లకు తప్పని సరిగా వెబ్ టెలీకాస్టింగ్ సౌకర్యాన్ని కల్పించాలన్నారు.  ఈ వెబ్ కాస్టింగ్ కు సంబందించి తాత్కాలిక నివేదిను  తమకు వెంటనే పంపాలన్నారు.  ప్రతి జిల్లాలోనూ కనీసం 50 శాతం పోలింగ్ స్టేషన్లు వెబ్ టెలీకాస్టింగ్ లో కవర్ అవ్వాలని, ఈ వెబ్ టెలీ కాస్టింగ్ అనేది పోలింగ్ స్టేషన్ కే పరిమితం కాకుండా చుట్టు ప్రక్కల పరిసరాలను కూడా కవర్ అయ్యేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రాంతాల వారీగా వల్నరబుల్ పోలింగ్ స్టేషన్లో మ్యాపింగ్ పనులను కూడా సత్వరమే పూర్తి చేయాలన్నారు. 


పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు, కనీస మౌలిక వసతుల కల్పన పనులను సాద్యమైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు. దివ్యాంగులు, వయో వృద్దులైన ఓటర్ల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, వీరికి అవసరమైన ర్యాంపుల నిర్మాణ పనులు ఈ నెల 5 వ తేదీ కల్లా పూర్తి  చేయాలన్నారు.  ఎన్నికల విధుల నిర్వహణలో ప్రభుత్వ ఉద్యోగులనే తప్పని సరిగా నియమించాలని, మాస్టర్ ట్రైనర్ల ద్వారా శిక్షణా కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేయాలన్నారు. 


 ప్రతి జిల్లాకు సంబందించిన జిల్లా ఎన్నికల నిర్వహణ ప్రణాళిక ముసాయిదా ప్రతిని వచ్చే సోమవారాని కల్లా తమ కార్యాలయానికి పంపాలని సూచించారు.   ఎన్ఫోర్సుమెంట్ ఏజన్సీల సమన్వయంతో అక్రమ నగదు, లిక్కరు ఇతర సామాగ్రి రవాణాపై ప్రత్యేక దృష్టి ఉంచాలని, కేవలం రాష్ట్ర సరిహద్దుల్లోనే కాకుండా జిల్లాల్లో జరుగుచున్న అక్రమ కార్యకపాలపై  నిఘా ఉంచాలన్నారు. ఇందుకు సంబందించిన నివేదికలను తమకు సకాలంలో పంపాలని జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు.


ఈ సమావేశంలో అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో పాటు  అదనపు సీఈవో పి. కోటేశ్వరరావు, ఎమ్.ఎన్. హరెంధిర ప్రసాద్, డిప్యూటీ సీఈవో లు ఎస్.మల్లిబాబు, కే. విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

 

 

Comments