పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలి.


అమరావతి (ప్రజా అమరావతి);

*పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలి*


విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకూడదు

• విద్యాశాఖామాత్యులు శ్రీ బొత్స సత్యనారాయణ గారు

• పదో తరగతి, ఇంటర్మీడియెట్, టెట్, డీఎస్సీ పరీక్షల నిర్వహణపై విద్యాశాఖామాత్యుల సమీక్ష

• పరీక్షా కేంద్రాలు వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు ఇవ్వకూడదు.

• జిల్లా కలెక్టర్లు,  ఇతర విభాగాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్





రాష్ట్రంలో  పదో తరగతి, ఇంటర్మీడియెట్, ఏపీ టెట్, డీఎస్సీ పరీక్షల నిర్వహణకు అధికారులంతా అప్రమత్తమై పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని విద్యాశాఖామాత్యులు శ్రీ బొత్స సత్యనారాయణ  అన్నారు. 

పదో తరగతి, ఇంటర్మీడియెట్, ఏపీ టెట్, డీఎస్సీ పరీక్షలు నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లు, పోలీసు, వైద్యారోగ్యశాఖ, రెవెన్యూ, విద్యుత్, తపాలా, ఏపీఎస్ఆర్టీసీ శాఖా రాష్ట్రాధికారులతో గురువారం సమగ్ర శిక్షా రాష్ట్ర కార్యాలయంలో  జరిగిన వీడియో కాన్ఫరెన్సులో  పాల్గొన్నారు. 

ఈ సమావేశంలో  పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ ప్రవీణ్ ప్రకాష్ , ఇంటర్మీయెట్ విద్య కమీషనర్, సెక్రటరీ శ్రీ సౌరభ్ గౌర్ , పాఠశాల విద్యాశాఖ కమీషనర్ శ్రీ ఎస్.సురేష్ కుమార్ ,  పాఠశాల విద్య డైరెక్టర్ శ్రీమతి పి.పార్వతి , సమగ్ర శిక్షా ఏఎస్పీడీ డా. కె.వి.శ్రీనివాసులురెడ్డి , పదో తరగతి పరీక్షల విభాగం సంచాలకులు శ్రీ దేవానందరెడ్డి , ఏపి టెట్ జాయింట్ డైరెక్టర్ డా. వి. మేరీ చంద్రిక , ఓపెన్ స్కూల్ డైరెక్టర్ కె.నాగేశ్వరరావు , ఏపీ మోడల్ స్కూల్ డైరెక్టర్ ఎం.వి.కృష్ణారెడ్డి  తదితరులు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా విద్యాశాఖామాత్యులు శ్రీ బొత్స సత్యనారాయణ  మాట్లాడుతూ.. వచ్చే నెల అంతా పరీక్షలకాలం దాదాపు 20 లక్షల మంది వివిధ పరీక్షలకు హాజరవుతున్నారు. గత రెండేళ్లుగా పూర్తి కట్టుదిట్టమైన చర్యలతో పకడ్బందీగా పరీక్షలను నిర్వహించినట్లే, ఈసారి కూడా పరీక్షలను నిర్వహించాలి. అధికారులందరూ పరీక్షా కేంద్రాల్లోని ఏర్పాట్లను ముందుగానే పరిశీలించి మరోసారి అన్నీ సక్రమంగా ఉన్నట్లుగా నిర్దారించుకోవాలని సూచించారు. కింది స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అధికారులందరమూ పూర్తి సమన్వయంతో పనిచేసి పరీక్షలను విజయవంతంగా నిర్వహించాలి.

సమావేశంలో మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ  ప్రసంగించిన *మరికొన్ని వివరాలు* ఇలా ఉన్నాయి. 

ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియేట్ పరీక్షలకు 1559 పరీక్షా కేంద్రాల్లో 10,52,221మంది విద్యార్థులు హాజరవుతారని, గత ఏడాదితో పోలిస్తే 47,921 మంది అధికంగా పరీక్షలకు హాజరవుతున్నారన్నారు.

పరీక్షా కేంద్రానికి 100 మీటర్ల సమీపంలో 144 సెక్షన్ అమలు చేయాలని, జెరాక్స్ షాపులు తెరవకూడదన్నారు. పరీక్షా కేంద్రంలోకి ఫోన్లు అనుమతి లేదని తెలిపారు. 

అన్ని జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి పరీక్షా కేంద్రాలకు అవసరమైన సౌకర్యాలు తెలియజేయాలని కోరారు.  పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు, మంచి నీరు, ప్రథమ చికిత్స వంటి సౌకర్యాలు, ఏర్పాట్ల గురించి ఆరా తీశారు.

  పరీక్షా నిర్వహణకు సంబంధించిన విధివిధానాలు తెలిపారు. అధికారులు సమన్వయంగా పని చేసుకుని, పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించాలని కోరారు.

*పదో తరగతి పరీక్షలు*

మార్చి 18 నుంచి మార్చి 30 వరకు ఉదయం 9.30కు పదో తరగతి రెగ్యులర్ విద్యార్థులకు పరీక్షలు ప్రారంభమవుతాయి. 

రాష్ట్ర వ్యాప్తంగా 3,17,939 మంది బాలురు, 3,05,153 మంది బాలికలు మొత్తం 6,23,092 మంది విద్యార్థులు 3473 పరీక్షా కేంద్రాల్లో హాజరుకానున్నారు. వీళ్లు కాకుండా ఈ పరీక్షలకు రీ ఎన్రోల్ చేసుకున్న విద్యార్థులు 1,02,058 మంది విద్యార్థులు, మొత్తం సిట్టింగ్ స్క్వాడ్స్ 682 మంది, ప్లయింగ్ స్క్వాడ్స్ 156 మంది.

*ఓపెన్ స్కూలు*

ఓపెన్ స్కూలుకు సంబంధించి పదో తరగతి, ఇంటర్మీడియేట్ పరీక్షలు మార్చి 18 నుంచి 26వరకు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు  జరుగుతాయి. 176 పరీక్షా కేంద్రాల్లో 34635 మంది పదో తరగతి విద్యార్థులు, 327 పరీక్షా కేంద్రాల్లో 76572 మంది ఇంటర్మీడియెట్ విద్యార్థులు హాజరు కానున్నారు.

*ఏపీ టెట్*

ఏపీ టెట్ కు సంబంధించి 120 కేంద్రాల్లో 279685 మంది హాజరు కానున్నారు. సీబీటీ విధానంలో పరీక్ష జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ తో పాటు పొరుగు రాష్ట్రాలకు చెందిన బెంగళూరు, బరంపురం, చెన్నై, హైదరబాదు, ఖమ్మం, కోదాడ ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు.

ఫిబ్రవరి 27 నుంచి మార్చి 6 వరకు పరీక్షలు జరుగుతాయి. 



Comments