మేదరమెట్ల, బాపట్ల జిల్లా. (ప్రజా అమరావతి/!
*వైఎస్సార్సీపీ ఎన్నికల శంఖారావసభ– సిద్ధం–లో పాల్గొన్న ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్.*
*బాపట్ల జిల్లా మేదరమెట్ల వేదిగా వైఎస్సార్సీపీ ఎన్నికల శంఖారావ సభ– సిద్ధం.*
*గుంటూరు, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోని 44 నియోజకవర్గాల నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చిన పార్టీ శ్రేణులు.*
*మేదరమెట్ల ఎన్నికల శంఖారావసభలో ప్రసంగించిన సీఎం శ్రీ వైయస్.జగన్.*
*వైయస్సార్సీపీ నేతలు, కార్యకర్తలకు ముఖ్యమంత్రి దిశా నిర్దేశం.*
*ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం శ్రీ వైయస్.జగన్ ఏమన్నారంటే...:*
*బిందువు, బిందువు సింధువైనట్టుగా...*
బిందువు బిందువు సింధువైనట్టుగా... నా మీద మన పార్టీమీద నమ్మకంతో చేయి, చేయి కలిపి ప్రభంజనంలా ఇక్కడికి సిద్ధం అంటూ ఉప్పెనలా తరలివచ్చిన ఈ జన సమూహం ఇక్కడి నుంచి చూస్తే ఓ మహాసముద్రంలా కనిపిస్తోంది. ఈ మేదరమెట్లలో ఓ జనప్రవాహం, ఓ జన సముద్రం కనిపిస్తోంది.
*మరో ఐదేళ్ల ప్రయాణానికి మద్ధతుగా...*
ఇంటింటి అభివృద్ధిని, సామాజికవర్గాల సంక్షేమాన్ని, పేదలందరి ఆత్మగౌరవాన్ని మొత్తంగా రాష్ట్ర ప్రగతిని ఇలాగే కాపాడుకుని మరో ఐదేళ్లు ఈ ప్రయాణాన్ని కొనసాగించేందుకు మద్ధతు పలికేందుకు వచ్చిన ఈ ప్రజా సైన్యానికి ఇక్కడున్న ప్రతి గుండె చప్పుడికి, మీ జగన్ మీ అన్న, మీ తమ్ముడు, మీ బిడ్డ సెల్యూట్ చేస్తున్నాడు.
నా ఎదుట ఉన్న నా అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములు, నా అవ్వాతాతలు వీరితో పాటు గ్రామాల్లో వార్డు మెంబర్లు నుంచి జిల్లా పరిషత్ ఛైర్మన్ల వరకు హాజరైన ప్రజాప్రతినిధులందిరికీ, వాలంటీర్లుతో సహా అభిమానులు, పార్టీ కేడర్కి మీ జగన్ అభినందలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాడు.
*పార్టీలతో బాబు పొత్తులు - ప్రజలే బలంగా మనం.*
మరికొన్ని రోజుల్లో జరగబోతున్న ఎన్నికల మహాసంగ్రామంలో పేదవాడి భవిష్యత్తును కాపాడేందుకు, పేదవాడికి అండగా, తోడుగా నిలబడేందుకు మీరంతా... సిద్ధమేనా? అని అడుగుతున్నాను.
పార్టీల పొత్తులతో బాబు, ప్రజలే బలంగా మనం. తలపడపోతున్న ఈ మహాసంగ్రామానికి మీరంతా సిద్ధమేనా? జగన్ను ఓడించాలని వారు, పేదల్ని గెలిపించాలని మనం చేయబోతున్న ఈ యుద్ధంలో మరో చారిత్రక విజయాన్ని సొంతం చేసుకోవాడనికి మీరంతా కూడా సిద్ధమేనా? అని అడుగుతున్నాను.
సిద్ధం అంటే ప్రజలు చేసే యుద్ధం. సిద్ధమంటే ఓ ప్రజాసముద్రం. ఇప్పటికే ఉత్తరాంధ్రా సిద్ధం, ఉత్తర కోస్రా సిద్ధం. ఇప్పిటికే రాయలసీమ సిద్ధం. ఈ రోజు దక్షిణ కోస్తా కూడా సిద్ధం.
జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో.... ధర్మ, అధర్మాల మధ్య జరిగే ఈ యుద్ధంలో, విశ్వసనీయతకు, వంఛనకు మధ్య జరగబోయే ఈ యుద్ధంలో శ్రీకృష్ణుడి పాత్ర మీది. ప్రజలందరిదీ. అర్జునుడి పాత్ర మీ బిడ్డది, మీ అన్నది, మీ తమ్ముడిది.
*ఓటు అనే అస్త్రంతో*
జమ్మిచెట్టు మీద ఇంతకాలం దాచిన ఓటు అనే అస్త్రాన్ని ఇంటింటి అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి, పేద, సామాజికవర్గాల అభివృద్ధికి అడ్డుపడుతున్న పెత్తందార్ల మీద ప్రయోగించాల్సిన సమయం ఇక వచ్చేసింది.
నాకు.. చంద్రబాబుగారికున్నట్టుగా పదిమంది నటించే పొలిటికల్ స్టార్లు స్టార్ క్యాంపెయినర్లుగా నాకు లేరు. నాకు చంద్రబాబునాయుడు గారు మాదిరిగా.. ఓ ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 లేదు. అబద్దాలకు రంగులు పూసే ఎల్లో మీడియా నాకు లేదు. రకరకాల పార్టీలతో పొత్తులూ మీ బిడ్డకు లేవు. ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తున్న నాకు... ఉన్నదల్లా నక్షత్రాలు ఎన్నున్నాయో అంత మంది పేదింటి స్టార్ క్యాంపెయినర్లు నాకు ప్రతి ఇంటిలోనూ, ప్రతి గడపలోనూ ఉన్నారు.
నా ఎదుట ఇసుక వేస్తే రాలనంతగా ఈరోజు ఇక్కడ కార్యకర్తలు, అభిమానులు, ఈ ప్రజానీకం మీలో ప్రతి ఒక్కరూ మీ జగన్కు మీ అన్నకు, మీ బిడ్డకు మీరంతా స్టార్ క్యాంపెయినర్లుగా నడుం బిగించాలి.
బహుశా మరో నాలుగు రోజుల్లోపే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేస్తుంది. చంద్రబాబు కూటమిలో మూడు పార్టీలు, వీరితో పాటు చంద్రబాబు జేబులో ఉన్న మరో జాతీయ పార్టీ. వీరంతా మన మీద, మన పేదల భవిష్యత్తు మీద మనమీద దాడి చేయడానికి రెడీగా ఉన్నారు.
*సైన్యాధిపతులు తప్ప సైన్యం లేని పార్టీలు..*
నా ప్రసంగంలో ముందుగా బాబు అండ్ కో పొత్తుల గురించి కాసేపు మాట్లాడుతాను. ఈ పార్టీలందరికీ కూడా సైన్యాధిపతులే తప్ప.. ఏ పార్టీలోనూ సైన్యం ఎక్కడా లేదు. ఇందులో కొన్ని పార్టీలు గత ఎన్నికల్లో నోటాకు వచ్చినన్ని ఓట్లు కూడా రాని పార్టీలు. తమ స్వార్ధం కోసం రాష్ట్రాన్ని అన్యాయంగా విడగొట్టిన పార్టీలు. రాష్ట్ర ద్రోహుల పార్టీలు. మరికొందరు ప్రజలచేతుల్లో చిత్తుగా ఓడిపోయిన పార్టీలు. ఓడిపోయిన వ్యక్తులు. ఇటువంటి వారందరూ కూడా మనకు పోటీగా అటువైపున ఉన్నారు.
మనం ఐదుకోట్ల ప్రజల అండదండలతో ఇంటింటికీ మంచి చేసి మనం ఈరోజు సిద్ధం అని అంటుంటే.. వారి వెనుక ప్రజలు లేరు కాబట్టి.. చేసిన మంచి చెప్పుకునే పరిస్థితి లేదు కాబట్టి అరడజను పార్టీలతో, అరడజను ఎల్లో మీడియా సంస్ధలతో, పొత్తులతోనూ, ఎత్తులతోనూ, జిత్తులతోనూ ఎక్కే గుమ్మం, దిగే గుమ్మంగా వారు రాజకీయం నడుపుతున్నారు.
ఒకప్పుడు ఇదే చంద్రబాబునాయుడు నోట్లోంచి... జాతీయ రాజకీయాలను తానే ఏలానని, స్టీరింగ్ కమిటీ చక్రం తానే తిప్పానని, ప్రధానులను, రాష్ట్రపతులను తానే నిర్ణయించానని ఒకప్పుడు ఇదే బాబు ఊదరగొట్టేవాడు. ఈ రోజున ఏపీలో మనందరి ప్రభుత్వం చేసిన ఇంటింటి అభివృద్ధి వల్ల, ఇంటింటికీ చేసిన మంచి వల్ల మనకున్న ప్రజాబలం ముందు నిలబడలేక, మనతో నేరుగా తలపడలేక, ఏపీలో తన సైకిల్ చక్రం తిరగడం లేదని ఢిల్లీకి వెళ్లి, దత్తపుత్రుడితో కలిసి పడిగాపులు కాసి, ఢిల్లీలో మోకరిల్లుతున్న పరిస్థితి చంద్రబాబుది.
*జగన్ ఒకే ఒక్కడి వల్ల*
ఇటువైపున కేవలం జగన్ ఒకే ఒక్కడు. జగన్ వల్ల ప్రతి ఇంటికీ మంచి జరగకపోయి ఉంటే... జగన్ తన మేనిఫెస్టోలో చెప్పినదంతా తాను చేయికపోయి ఉంటే.. జగన్ అనే ఒకే ఒక్కడు చంద్రబాబు నాయుడు గుండెల్లో రైళ్లు పరిగెత్తించకపోయి ఉండి ఉంటే... చంద్రబాబు నాయుడు గారు ఇన్ని పొత్తులు కోసం ఎందుకు పాకులాడుతున్నాడు?. ఇంతమందితో పొత్తులు కోసం ఎందుకు అగచాట్లు పడుతున్నాడు? ఎందుకు ఢిల్లీ వరకు వెళ్లిఅక్కడ మోకరిల్లుతున్నాడు?
దీనికి కారణం చిత్తశుద్ధితో, నిజాయితీతో మనం చేసిన మంచి. అన్ని వర్గాల మీద మనం చూపించిన కమిట్మెంట్. ఇంటిటికీ మనం చేసిన అభివృద్ధి. ఈ రోజున మన పార్టీ, మన ప్రభుత్వం నిండుగా విరగకాసిన మామిడి చెట్టులా మనముంటే... చంద్రబాబు నాయుడు గారి పార్టీ ఆందరినీ మోసం చేసి, వెన్నుపోట్లు పొడిచి, గత పాపాలకు ఫలితం అనుభవిస్తూ... తెగులు పట్టిన చెట్టులా ఉంది.
మన ఎమ్మెల్యేలు, నాయకులంతా ప్రతి నియోజకవర్గంలోనూ గడప,గడపకూ ప్రజల వద్దకు వెళ్లి చేసిన మంచిని చెబుతూ... ప్రతి ఎమ్మెల్యే, ఎమ్మెల్యే అభ్యర్ధి తిరుగుతూ ఉంటే.. చంద్రబాబు మాత్రం రామోజీ గడప, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గడప, టీవీ5 గడప, ఢిల్లీలో ఇతర పార్టీల గడపలు ఇలా ఓ అరడజను గడపలు ఐదేళ్లుగా తన మనుషులను పంపి తాను తిరుగుతూ ఉన్నాడు.
ఆలోచన చేయండి. ఇది కనిపిస్తున్న చంద్రబాబునాయుడు మార్క్ రాజకీయం.
*విలువలు- జగన్ మార్కు రాజకీయం.*
మరి మీ జగన్ మార్కు రాజకీయంలో విలువలు ఉన్నాయి. విశ్వసనీయత అన్న పదానికి అర్ధం ఉంది. నిబద్ధత ఉంది. సిద్ధాంత బలం ఉంది. ఇంటింటికీ మంచి చేశామన్న చరిత్ర ఉంది. అన్నింటికీ మించి అక్కచెల్లెమ్మల మీద, ప్రజల మీద నమ్మకం ఉంది. ఈరోజు మీ బిడ్డ పాలనతో ప్రతి ఇంటిలోనూ చిక్కటి చిరునవ్వులు కనిపించే పరిస్థితిలు ఉన్నాయి. మనమార్కు రాజకీయంలో ఇంటింటి అభివృద్ధి కనిపిస్తుంది. మన ఫ్యాన్ గిర్రున తిరిగేందుకు కావాల్సిన కరెంటు ఇతర పార్టీలతో రాజు. ఇతరులతో పెట్టుకున్న పొత్తులతో రాదు. నేరుగా ప్రజల నుంచి వస్తుంది. ప్రజలు ఆశీర్వదిస్తే వస్తుంది. వారి గుండెల్లో ప్రేమ నుంచి మన పార్టీకి, ఫ్యాన్కు కరెంటు వస్తుంది. ఇంటింటికీ చేసిన మంచి నుంచి, మనం అందించిన నవరత్నాల నుంచి మన ఫ్యాన్కు కరెంటు వస్తుంది.
లంచాలు లేని, వివక్ష లేని పాలన ఎవరైనా ఇవ్వగలుగుతారా? అని ఐదు సంవత్సరాల క్రితం ఆశ్చర్యం వెలిబుచ్చిన పరిస్థితుల నుంచి..ఈ రోజు లంచాలు, వివక్ష లేని పాలన మనం అందించిన దాంట్లో నుంచే మన ఫ్యాన్కు కరెంటు వస్తుంది.
మన ఫ్యాన్కు కరెంటు.. మాట తప్పకుండా మేనిఫెస్టోను ఓ భగవద్గీతగానూ, ఖురాన్గానూ, బైబిల్గాను ఇంతవరకు ఎవ్వరూ చేయని విధంగా.... మేనిఫెస్టో అంటే చెత్తబుట్టలో వేసే డాక్యుమెంటు కాదు, మేనిఫెస్టో అంటే ఒక పవిత్ర గ్రంధం అని భావించి 99 శాతం హామీలు అమలు చేసిన ఆ నిజాయితీ నుంచి మన ఫ్యాన్కు కరెంటు వస్తుంది.
*బాబుది తుప్పు పట్టిన సైకిల్*
మరి చంద్రబాబు సైకిల్ పరిస్థితి ఏమిటని గమనిస్తే... బాబు సైకిల్కు ట్యూబులు లేవు. చంద్రబాబు సైకిల్కు టైర్లు లేవు, చక్రాలే లేవు. చంద్రబాబు సైకిల్ తుప్పు పట్టిన పరిస్థితులలో ఉంది. ఆ తుప్పు పట్టిన సైకిల్ను తొక్కడానికి... దాన్ని తోయడానికి చంద్రబాబు నాయుడు గారికి వేరే పార్టీలు కావాలి. ఇది బాబు గారి జాబ్ రిక్వైర్మెంట్. ఎందుకంటే చంద్రబాబు పేరు చెబితే.. గుర్తుకు వచ్చే ఒక్క మంచి కూడా ప్రజల నోట్లోంచి వినపడదు. చంద్రబాబు పేరు చెబితే గుర్తుకు వచ్చే ఒక్క స్కీమ్ కూడా ప్రజల నోట్లోంచి వినపడదు.
అందుకే పొత్తుల్లో భాగంగా ముందుగా చంద్రబాబు ఒక ప్యాకేజీ ఇచ్చి ఒక దత్తపుత్రుడుని తెచ్చుకున్నాడు. దత్తపుత్రుడుని ఎందుకు తెచ్చుకున్నాడంటే...ఈ ప్యాకేజీ స్టార్ అయితే సైకిల్ సీటు తనకు కావాలని అడగడు. తనవారికి సీట్లు ఇవ్వకపోయినా కూడా ఈ పెద్దమనిషి, ఈ దత్తపుత్రుడు అడగనే అడగడు. ఎందుకు ఇన్ని తక్కువ సీట్లు నాకిస్తున్నావి చెప్పి అంతకన్నా క్వశ్చెన్ చేయడు. కావాలంటే తాను తాగుతున్న టీగ్లాస్ కూడా బాబుకే ఇచ్చేస్తాడు.
చంద్రబాబు సిట్ అంటే కూర్చుంటాడు... చంద్రబాబు ఎప్పుడు స్టాండ్ అంటే అప్పుడు నిలబడతాడు.
సైకిల్ను ఎప్పుడు, ఎక్కడ దిగమంటే అక్కడ దిగుతాడు. ఎప్పుడు సైకిల్ను తోయమంటే అప్పుడు తోస్తాడు. పొత్తుల్లో ఉండమంటే పొత్తుల్లో ఉంటాడు. విభేదించినట్లు డ్రామా ఆడమంటే.. రక్తి కట్టించినట్లు డ్రామా ఆడతాడు. వెనకటికి చంద్రబాబునాయుడు లాంటి నాయకుడని ఎవరో అడిగారట... అయ్యా పరిపాలన చేసే వారు కలకాలం గుర్తుండాలంటే ఎలాంటి పనులు చేయాలని అడిగారట.
అప్పుడు ఆ బాబు ఏం చెప్పారంటే.. ప్రజలకు అన్నం పెడితే అరిగిపోతుంది. చీర కొనిపెడితే చిరిగిపోతుంది. ప్రజలకు ఇళ్లు కట్టిస్తే కూలిపోతుంది. కర్రు కాల్చి వాత పెడితే మాత్రమే కలకాలం గుర్తుంటుందని చెప్పాడట.
ఈ 14 ఏళ్లు సీఎంగా ఉన్న బాబు కూడా అలాంటివ్యక్తే. అదే చేశాడు. అలాంటి బాబు ఎంత మందితో పొత్తులు పెట్టుకున్నా.. ఈ చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి సున్నా. ఈ సున్నా ఇంటూ పొత్తులు పెట్టుకున్న ఎన్ని పార్టీలున్నా దాని విలువ బోడి సున్నానే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మూడు పార్టీలతో పొత్తు అంటున్నాడు. ఈ ముగ్గురుతో కలిసి ఇలానే పొత్తుగా ఏర్పడి.. ఒకే స్టేజ్ మీద కూర్చుని భాషణలు ఇచ్చారు. మీటింగ్లు పెట్టారు. ఒకే ప్రకటనలో ఇలా ముగ్గురు ఫోటోలు వేసుకుని.. చంద్రబాబు నాయుడు గారి సంతకం పెట్టి ఇంటింటికీ పాంప్లెట్లు పంపించారు.
*2014లో ఇదే కూటమి విఫల హామీలు...*
2014లో కూటమిగా ఏర్పడిన వీళ్లు.. ఇంటింటికి పంపించి ఈ పాంప్లెట్లో ఏం రాశారంటే... రైతులకు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తాను. డ్వాక్రా సంఘాల రుణాలన్నీ పూర్తిగా రద్దు చేస్తాం. మహిళల రక్షణకు ఉమెన్ ప్రొటక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తాం. ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహలక్ష్మి పథకం కింద రూ.25వేలు బ్యాంకు అకౌంట్లో డిపాజిట్ చేస్తాం. ఇంటింటికీ ఒక ఉద్యోగం, ఉద్యోగం ఇవ్వలేకపోతే ఉపాధి... ఉద్యోగం వచ్చే వరకు నెల, నెలా రూ.2వేలు నిరుద్యోగభృతిగా ఇస్తాం. రూ.10 వేల కోట్లతో బీసీ సబ్ప్లాన్, చేనేత, పవర్లూమ్స్ రుణాల మాఫీ, అర్హులైన వారందరికీ మూడు సెంట్లు స్ధలం,
పక్కా గృహాలు మంజూరు చేస్తాం, రాష్ట్రాన్ని సింగపూర్ మించి అభివృద్ధి చేస్తాం. ప్రతి నగరంలో హైటెక్ సిటీ నిర్మిస్తాం.... ఇవీ ఇదే చంద్రబాబు, ఇదే కూటమిలో ఉన్న ఇదే దత్తపుత్రుడి ఫొటో. ఇప్పుడు ఇదే చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి కూటమిగా ఏర్పడి పొత్తులోకి తెచ్చుకున్న మోడీ గారి ఫొటో.
వీళ్లు ముగ్గురూ కలిసి చంద్రబాబు సంతకం పెట్టి ప్రతి ఇంటికీ పాంప్లేట్ పంపించాడు.
ఇందులో ఇచ్చిన హామీలు ఏవైనా కూడా అమలయ్యాయా?
ప్రత్యేక హోదా ఇచ్చారా? అని అడుగుతున్నాను.
మరి ఇవి గతంలో చేయకుండా, పొత్తులో వీరంతా భాగమై ఈ మాదిరిగా మీటింగులు పెట్టి, మేనిఫెస్టోలో ఇవన్నీ పెట్టి, పాంప్లేట్లుగా చేసి ఏకంగా చంద్రబాబుగారు సంతకం పెట్టి ప్రతి ఇంటికీ పంపి, మరోసారి ఇదే డ్రామాను, ఇవే పొత్తులు.. ఇంతకన్నా ఎక్కువ హామీలు ఇస్తూ మరోసారి మోసం చేసేందుకు ఈరోజు మళ్లీ చంద్రబాబు పొత్తుల డ్రామాతో మీ అందరి ముందుకు వస్తున్నారు.
చంద్రబాబు చూపిస్తున్న ఈ పొత్తులతో ఎవరికైనా ప్రయోజనం కలిగిందా? ఆలోచన చేయండి.
ప్రజలకు ఏ ఒక్కరూ కూడా మంచి చేయకపోగా, ప్రజలకు మంచి చేసిన జగన్ను టార్గెట్ చేయడానికి మాత్రమే వీళ్ల ఏకైక ఎజెండా కనిపిస్తోంది.
చంద్రబాబునాయుడుగారికి అధికారం ఎందుకు కావాలంఆటే ప్రజలకు మంచి చేయడం కోసం కాదు.. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది చేయడం కోసం కాదు..
కారణం.. ఆ అధికారంతో ప్రజల్ని దోచుకునేందుకు, దోచుకున్నది పంచుకునేందుకు మాత్రమే చంద్రబాబుకు అధికారం కావాలి.
గతంలో 2014లో చంద్రబాబు మేనిఫెస్టోలో.. ఇంటింటికీ పంపిన పాంప్లేట్.. టీవీ ఆన్ చేస్తే చాలు.. ఊదరగొట్టే అడ్వటైజ్మెంట్లు ఇవీ.. ఇన్ని చేసి... అడ్డగోలుగా మోసం చేసిన వ్యక్తి ఈ చంద్రబాబు..
*చంద్రబాబు తాజా మేనిఫెస్టో చూస్తే...*
తాజా మేనిఫెస్టో వాగ్దానాల విషయానికొస్తే... నరకలోకానికి, నారా లోకానికి రమ్మంటే ఎవరూ రారు కాబట్టి... ఎంట్రన్స్లో స్వర్గం చూపించి.. లోపలికి వెళ్లాక మోసం చేసి నరకం చూపించే మార్కెటింగ్ టెక్నిక్ చంద్రబాబుకు అలవాటు.
అందులో భాగంగానే చంద్రబాబు ఈ మధ్య కాలంలో మేనిఫెస్టోని కిచిడీ వాగ్దానాలన్నీ కలిపాడు. కర్ణాటకలో నుంచి కొన్ని, తెలంగాణ నుంచి కొన్ని.. వాళ్ల హామీలన్నీ కలిపి కిచిడీ మేనిఫెస్టో తెచ్చాడు.
అందులో వారు చూపించే గ్రాఫిక్స్, ఎల్లో మీడియా డిబేట్లు.. వారు చేసే ప్రచారాలు.. ప్రజలు ఆలోచన చేయాలి.
ఈ పెద్ద మనిషి చంద్రబాబు చేసే వాగ్దానాలకు శకుని చేతిలో పాచికలకు తేడా ఏమైనా ఉందా?
చంద్రబాబు కేరక్టర్కు భిన్నంగా, మనందరి ప్రభుత్వం కరోనా కష్ట సమయంలో కూడా ఏమాత్రం సాకులు చూపకుండా పేదలందరికీ మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి మాట ప్రకారం సంక్షేమ పథకాలన్నీ ఇంటింటికీ అందించాం.
నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కతున్నాడు. నా అక్కచెల్లెమ్మల కుటుంబాలకు డీబీటీ విధానంలో అక్షరాలా రూ.2.65 లక్షల కోట్లు నేరుగా వెళ్లిపోవడం జరుగుతున్న పరిస్థితిని గమనించాలి.
నాన్ డీబీటీ పద్ధతిలో అయితే ఇళ్ల స్థలాల మార్కెట్ విలువ తీసుకోకుండా, మన దగ్గర భూముల విలువ తీసుకోకుండా, కేవలం మనం సేకరించిన భూముల విలువలు మాత్రమే తీసుకుని నాన్ డీబీటీ కింద గోరుముద్ద, విద్యాకానుక లాంటి పథకాలకు మనం ఈ 58 నెలల కాలంలో.. చేసిన ఖర్చు రూ.1.10 లక్షల కోట్లు.
మొత్తంగా డీబీటీ, నాన్ డీబీటీ కలిపితే 58 నెలల కాలంలో మనం రూ.3.75 లక్షల కోట్లు ఖర్చు చేశాం. అంటే ఏటా ఈ పథకాల మీద మీ బిడ్డ ప్రభుత్వంలో గతంలో ఎప్పుడూ చూడని విధంగా జరిగిన, ప్రజలకిచ్చిన సొమ్ము సంవత్సరానికి రూ.75 వేల కోట్లు. అది కూడా మనం చాలా కష్టపడితే, ఎక్కడా కూడా లంచాలు లేకుండా చేస్తే గతంలో జరగని విధంగా పేదలకు అందించగలిగాం.
మనందరి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమాన్ని, ఇంటింటి అభివృద్ధిని చూసి తట్టుకోలేక ఈర్ష్యతో రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని చెప్పి గతంలో ఇదే ఈనాడు, ఇదే చంద్రబాబునాయుడు గారు ఎన్నెన్నో సందర్భాల్లో వాదించడం కూడా మన కళ్ల ఎదుట కనిపించిన సత్యం.
ఇప్పుడు అదే నోటితో మరోసారి మోసం చేసేందుకు.. ఎలాగూ చెప్పేవన్నీ అబద్ధాలే కదా.. హద్దులెందుకు అని చంద్రబాబునాయుడు గారు ఈ మధ్య కాలంలో ఆరు వాగ్దానాలు అంటూ వదిలారు.
*మన పథకాలు 2024 తర్వాత కూడా....*
ఈ వాగ్దానాలకు ఏటా ఖర్చెంత అవుతుందని మా ఫైనాన్స్ వారిని లెక్కలు తీయమన్నాను. 2024 ఎన్నికల తర్వాత కూడా మనం అమలు చేస్తున్న కొన్ని పథకాలు ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగాల్సిందే.
ఉదాహరణకు అలాంటి ఎనిమిది పథకాలు.. 66 లక్షల మంది పెన్షన్లకు మనం ఖర్చు చేస్తున్నది దాదాపు రూ.24 వేల కోట్లు.
రైతన్నలకిచ్చే ఉచిత విద్యుత్కు ఖర్చు రూ.11 వేల కోట్లు.
సబ్సిడీ బియ్యానికి రూ.4600 కోట్లు, ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా 104, 108.. ఇటువంటివి ఎవరైనా కచ్చితంగా చేయాల్సినవి, ముట్టుకోలేనివి మరో రూ.4.400 కోట్లు.
పూర్తి పీజు రీయింబర్స్మెంట్ కింద మీ జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన కింద మరో రూ.5000 కోట్లు. సంపూర్ణ పోషణ కింద రూ.2200 కోట్లు, గోరుముద్ద కింద రూ.1900 కోట్లు.
కేవలం ఈ ఎనిమిది పథకాలకే.. ఖర్చు రూ.52,700 కోట్లు. ఇవి కచ్చితంగా ఎవరైనా చేయాల్సిందే.
*బాబు చెప్పిన ఆరు వాగ్దానాలూ– పచ్చి మోసమే..*
చంద్రబాబు చెప్పిన సూపర్ సిక్స్ ఆరు వాగ్దానాలకు ఎంత ఖర్చవుతుందో లెక్కేస్తే, ఇది పచ్చి మోసం అని తెలిసినా లెక్క వేయిస్తే.. వాటికి అదనంగా కావాల్సింది ఏటా రూ.73,440 కోట్లు.
ఇది కాక చంద్రబాబు ఈ మధ్యనే ఏడో హామీ అని చెప్పి బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్ అదనంగా పెంచి ఇస్తానన్న హామీని లెక్కేస్తే ఇది అదనంగా రూ.13,872 కోట్లు. అంటే చంద్రబాబు చెప్పిన ఆరు పథకాలకు, ఈ ఏడో పథకానికి ఈరెండూ కలిపితే రూ. 87312 కోట్లు, ఇంతకు ముందు నేను చెప్పినట్లుగా ఎవరైనా టచ్ చేయలని, ఎవరైనా కచ్చితంగా చేయాల్సిన 8 స్కీములకు ఖర్చయ్యేది మరో రూ.52,700 కోట్లు.
రెండూ కలిపితే అక్షరాలా రూ.1.40 లక్షల కోట్లు గురించి చంద్రబాబు చెబుతున్నారు.
ప్రతి సంవత్సరం రూ.1.40 లక్షల కోట్లు.. మనం ఎంతో కష్టపడితే, ఎక్కడా లంచాలు లేకుండా ప్రజలకు ఇస్తే, గతంలో ఎప్పుడూ జరగని విధంగా పాలనలో ఎన్నో మార్పులు తెచ్చి పాలన చేస్తే మీ బిడ్డ ప్రభుత్వం లంచాలు, వివక్ష లేకుండా పూర్తిగా కట్టడి చేసి ఎంతో కష్టపడితే ఇవ్వగలిగింది సంవత్సరానికి రూ.75 వేల కోట్లయితే, చంద్రబాబు చెబుతున్న హామీలు.. ఇప్పటికే రూ.1.40 లక్షల కోట్లు దాటుతోందంటే.. ఇక ఆలోచన చేయండి. ఈ పెద్దమనిషి చంద్రబాబు చెప్పే హామీలు మళ్లీ ప్రజల్ని ఎంతగా మోసం చేసేందుకు చెబుతున్నాడో అని అందరూ ఆలోచన చేయాలి.
*పథకాలకు డబ్బెలా అంటే బాబు మాట్లాడడు....*
ఈ డబ్బు ఎక్కడి నుంచి తెస్తారంటే చంద్రబాబు మాట్లాడరు. ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో అసెంబ్లీలో సుదీర్ఘంగా దీని గురించి వివరించాను. పేద ప్రజలు మరొక్కసారి నమ్ముతారేమో.. మోసం చేద్దామన్న కుటిల ఆలోచనలతో బాబు ఈవాగ్దానాలన్నీ చేస్తున్నాడు. ఎలాగూ అబద్ధాలు చెప్పేటప్పుడు హద్దులెందుకు, భావదారిద్య్రం ఎందుకని చంద్రబాబు అబద్ధాలు చెప్పే సిద్ధాంతాన్ని నమ్ముకున్నాడు. నమ్మినవాడు మునుగుతాడు, నమ్మించినవాడు దోచుకోగలుగుతాడు అన్నది బాబు సిద్ధాంతం.
బాబు మేనిఫెస్టో ఏ ఒక్కరన్నా నమ్మడం అంటే.. బంగారు కడియం ఇస్తానన్న కథలో పులిని నమ్మినట్లుగానే ప్రజలందరూ మోసపోతారు అని తెలియజేస్తున్నాను.
*దేశ చరిత్రలో ఇది ఓ రికార్డు....*
ఈ 58 నెలల్లో ప్రజల కోసం 130 సార్లు మీ బిడ్డ బటన్ నొక్కాడు. దాదాపు రూ.2.70 లక్షల కోట్లు డీబీటీగా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా పంపించాం. దేశ చరిత్రలో ఇది ఒక రికార్డు. మన రాష్ట్రంలో ఎప్పుడూ చూడని విధంగా, జరగని విధంగా ఈ 58 నెలల్లో జరిగిందంటే అది కేవలం మీ జగన్కు మాత్రమే సాధ్యమైంది. అది కేవలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే సాధ్యమైంది.
*ఈ పథకాలు కొనసాగాలంటే– మీరే స్టార్ క్యాంపెయినర్లు...*
ఇవన్నీ కొనసాగాలంటే ఈ ప్రయోజనాలు అందుకున్న ప్రతి ఒక్క కుటుంబం మనకు స్టార్ క్యాంపెయినర్ కుటుంబాలు బయటకు రావాలి. వారు ఓటు వేయడమే కాకుండా వంద మందికి చెప్పి ఓటు వేయించాలి. ప్రతి ఇంట్లోనూ చెప్పాలి. పొరపాటు జరిగితే పేదవాడి భవిష్యత్ అంధకారం అవుతుందని ప్రతి ఇంట్లోనూ చెప్పాలి. ప్రతి గ్రామంలోనూ వివరించాలి.
*ఈ ఎన్నికలు ఎంత ముఖ్యమో వివరించాలి...*
పార్టీ కార్యకర్తలు, అభిమానులు, నాయకులు, వాలంటీర్ల పాత్ర ఎంతో కీలకం. ఈ ఎన్నికలు ఎంత ముఖ్యమో వివరించాల్సిన అవసరం ఉంది. ఈ ఎన్నికల్లో వేసే ఓటు వచ్చే 5 సంవత్సరాలు వారి భవిష్యత్ను ఎలా మారుస్తుందో వివరించాలి.
*మీ బిడ్డ వస్తాడు.. మంచి రోజులు తెస్తాడని మాటిచ్చా...*
2019 ఎన్నికల ముందు మీ జగన్ ఓ మాట చెప్పాడు. గుర్తుందా? ఆ మాట.. మీ బిడ్డ వస్తాడు. మంచి రోజులు మీకు తెస్తాడని మీ బిడ్డ మాట ఇచ్చాడు. ఈరోజు మళ్లీ మీ అందరికీ.. ఐదేళ్ల తర్వాత మీ బిడ్డ మరో మాట చెబుతున్నాడు.
నేను చెప్పే ఈ మాటను ప్రతి ఊర్లోనూ చెప్పండి. ప్రతి ఇంట్లోనూ, ప్రతి గడపకూ వెళ్లి చెప్పండి. పేద వాడి భవిష్యత్ బాగుపడాలంటే, జరుగుతున్న ఈ మంచి కొనసాగాలంటే, మళ్లీ జగనన్ననే తెచ్చుకుందామని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి, ప్రతి ఊళ్లోనూ, ప్రతి గడపకూ వెళ్లి చెప్పండి.
*మాయలోడు బాబు వలలో పడొద్దు...*
మన అన్నను సీఎంగా తెచ్చుకుందాం. మన అన్న ప్రభుత్వాన్ని మనమే రక్షించుకుందాం. బాబు అనే మాయలోడి వలలో పడవద్దు అని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి. మరింత మంచి అన్నతో చేయించుకుందాం. మనందరి చల్లని దీవెనలతోనే ఇది సాధ్యమవుతుందని ప్రతి ఒక్కరికీ వెళ్లి చెప్పండి.
మీ కోసం నిలబడిన మన అన్నమీద అరడజను పార్టీలు బాణాలు ఎక్కుపెట్టాయి. ఆ అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు, పేదలకు మీ అందరి తరఫున జగనన్న నిలబడ్డాడు. కాబట్టే అరడజను పార్టీలు, అరడజను బాణాలు ఎక్కుపెట్టాయి.
అయినా అన్న పొత్తుల్ని నమ్ముకోలేదు, అన్న మనల్నే నమ్ముకున్నాడు, ఆ దేవుడిని నమ్ముకున్నాడు. అన్న ఒంటరిగానే సింహంలా మనందరికీ తోడుగా నిలబడ్డాడు. అని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి.
మన అన్న ప్రజల్ని, దేవుడి తప్ప పొత్తుల్ని, జిత్తుల్ని నమ్ముకోలేదు. మన అన్న ఎప్పుడూ మోసాలు చేయలేదు. ఎప్పుడూ అబద్ధాలు చెప్పలేదు. అని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి.
మన అన్న నమ్ముకున్నది తాను చేసిన మంచిని, మంచి జరిగిన ప్రజల్ని మాత్రమే నమ్మకున్నాడు అని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి.
మళ్లీ మన అన్నను గెలిపించేందుకు మనమంతా కూడా చేయి చేయి కలపాలి, మనమంతా ఒక్కటి కావాలి, మనమంతా సిద్ధం అని చెప్పాలని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి.
*సీఎంగా మీ జగనన్న వస్తేనే.....*
సీఎంగా అన్న వస్తేనే, నెలనెలా ఒకటో తేదీన మళ్లీ చిక్కటి చిరునవ్వులతో మన ఇంటికే రూ.3 వేల పెన్షన్ తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుందని చెప్పండి.
సీఎంగా మళ్లీ అన్న వస్తేనే ఇచ్చిన ప్రతి ఇంటి పట్టాల్లో ఇళ్ల నిర్మాణం పూర్తవుతుందని చెప్పండి. సీఎంగా మళ్లీ అన్న వస్తేనే అమ్మ ఒడి కొనసాగుతుందని చెప్పండి.
సీఎంగా మళ్లీ అన్న వస్తేనే చేయూత పథకం అందుతుందని, రైతు భరోసా రైతన్నకు తోడుగా నిలుస్తుందని చెప్పండి.
సీఎంగా మళ్లీ అన్న పెద్ద చదువులు చదువుతున్న పిల్లలకు పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్ కింద విద్యాదీవెన, వసతి దీవెన కేవలం అన్న వస్తేనే జరుగుతుందని చెప్పండి.
నేరుగా అక్కచెల్లెమ్మలకు ఎలాంటి వివక్ష లేకుండా డబ్బులు పడే పరిస్థితి రావాలంటే మళ్లీ అన్న ముఖ్యమంత్రి అయితేనే అని చెప్పండి.
సీఎంగా మళ్లీ అన్న వస్తేనే గవర్నమెంట్ బడి బాగుపడుతుందని చెప్పండి, సీఎంగా అన్న వస్తేనే గవర్నమెంట్ ఆస్పత్రి బాగుపడుతుందని చెప్పండి. నవరత్నాల్లోని అన్నిపథకాలు కూడా కొనసాగుతాయని చెప్పండి. ఈ పథకాలు అందుకున్న మనందరం కూడా స్టార్ క్యాంపెయినర్లుగా బయటకు రావాలని చెప్పండి.
ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తు మీద అసెంబ్లీకి ఒక ఓటు, పార్లమెంటుకు ఒక ఓటు వేస్తేనే మళ్లీ అన్న సీఎం అవుతాడు. అన్ని పథకాలూ ఇంటికే వస్తాయని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి.
*పొరపాటున బాబుకు ఓటేయడం అంటే....*
చెప్పేటప్పుడు.. అదే చంద్రబాబుకు ఓటు వేయడం అంటే.. మీకు అందే పథకాలన్నింటినీ కూడా రద్దుకు మీరే ఆమోదం తెలిపినట్టే అవుతుంది అని కూడా చెప్పండి. మళ్లీ జన్మభూమి కమిటీలు వస్తాయి. మళ్లీ లంచాలు, వివక్షల రాజ్యం మళ్లీ గ్రామాల్లో చెలరేగుతుంది.
మళ్లీ అవ్వలు, తాతలు, రైతన్నలు క్యూలో నిలబడే పరిస్థితి, గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి, ఎండనక, వాననక ఎవరైనా చనిపోతేగానీ ప్రభుత్వ పథకాలు అందని పరిస్థితి మళ్లీ వస్తుందని చెప్పండి.
పొరపాటున చంద్రబాబుకు ఓటేయడం అంటే మీ ఇంటికి వచ్చి పెన్షన్ ఇస్తున్న వాలంటీర్ వ్యవస్థ రద్దుకు మీరే ఓటు వేసినట్లు అవుతుందని చెప్పండి. బాబుకు ఓటు వేయడం అంటే గవర్నమెంట్ బడుల్లో ఇంగ్లీషుమీడియం రద్దుకు మీరే ఓటు వేసినట్లు అని చెప్పండి.
బాబుకు ఓటు వేయడం అంటే గవర్నమెంట్ బడిని మళ్లీ కార్పొరేట్లకు అమ్మేయడం అని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి.
బాబుకు ఓటు వేయడం అంటే మళ్లీ వైద్యం కోసం అప్పులు కావడమే, రైతన్నలు రైతు భరోసాను వదులుకోవడమే, మళ్లీ మోసపోవడమే అని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి.
*బాబుకు ఓటు– చంద్రముఖిని తెచ్చుకోవడమే...*
బాబుకు ఓటు వేయడం అంటే చంద్రముఖిని మనమే వెళ్లి నిద్ర లేపి మన ఇంటికి తెచ్చుకున్నట్టే అని ప్రతి ఇంట్లోకి వెళ్లి చెప్పండి.
మనం చేసిన మంచిని చూపించి మనకు ఓటు అడుగుతున్నాం. గతంలో ఎప్పుడూ చంద్రబాబు మంచి చేయలేదు కాబట్టి మాయ చేసి చంద్రబాబు ఓటు అడుగుతున్నాడని చెప్పండి.
వచ్చే ఎన్నికల్లో జగన్కు, ఫ్యాన్కు మీరు వేసే ఓటు మీ బిడ్డల బంగారు భవిష్యత్కు వేసే ఓటు అని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి. వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్కు మీరు వేసే ఓటు మన పేదరికం సంకెళ్లను తెంపుకోవడానికి, మన భవిష్యత్ కోసం మనం వేసుకుంటున్న ఓటు అని చెప్పండి.
*ఫ్యాన్ ఇంట్లో– సైకిల్ ఇంటిబయట– గ్లాస్ సింక్లో ఉండాలి.*
ఫ్యాన్ ఇంట్లోనే ఉండాలి, సైకిల్ ఇంటి బయటే ఉండాలి, తాగేసిన టీ గ్లాసు సింక్లోనే ఉండాలి అని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి.
ఇవన్నీ వివరించి మరి ప్రతి ఇంటికీ ప్రతి ఊరికీ, ఇంత మంచి మనం చేశాం కాబట్టి, ఇంత మంచి చేసిన తర్వాత 2019కి మించిన మోజారిటీ, 175కు 175.. 25 ఎంపీలకు 25 ఎంపీలు.. గెలవడానికి మనమంతా కూడా సిద్ధమేనా..?
*జగన్ మాట ఇస్తే.. తగ్గేదేలేదు..*
నా ప్రసంగం ముగించే ముందు ఒక్క మాట చెబుతున్నాను. మన మేనిఫెస్టో త్వరలో విడుదల చేస్తాం. కానీ చేయగలిగిందే చెబుతాం. చేసేది మాత్రమే చెబుతాం.
అందులో చెప్పిన ప్రతి ఒక్కటీ కూడా చేస్తాం. జగన్ మాట ఇచ్చాడంటే.. తగ్గేదే లేదు అని ఈ సందర్భంగా చెబుతున్నాను.
ఆంధ్రప్రదేశ్లో మనం ప్రారంభించిన పరిపాలన ఓ స్వర్ణయుగానికి దారి తీస్తోంది.
*నా కల– నా లక్ష్యం....*
90 శాతం ప్రజలు తెల్లకార్డుల మీద జీవించే పరిస్థితి నుంచి ప్రతి కుటుంబం కూడా పేదరికం సంకెళ్లను తెంచుకుని వాళ్లు అడుగులు ముందుకు వేసే పరిస్థితి రావాలన్నది నా కల. అలా చేయాలన్నది నా లక్ష్యం.
ప్రతి ఒక్క ఇంటి నుంచి క్వాలిటీ చదువులు, గొప్ప చదువులు, అంతర్జాతీయ స్థాయి చదువులు చదివేలా ప్రతి పేద పిల్లాడికీ అవకాశం కల్పించడం, ఆ పేద పిల్లల బతుకులు మార్చాలన్నది నా కల. అది నా లక్ష్యం.
ప్రతి అక్కచెల్లెమ్మ తన కాళ్ల మీద తాను నిలబడేట్టుగా చిరునవ్వు ఉండాలన్నది నా కల. నా లక్ష్యం.
ఏ ఒక్క రైతన్న కూడా వ్యవసాయం వల్ల నష్టపోయానని చెప్పే పరిస్థితి రాకూడదు. వ్యవసాయాన్ని పూర్తిగా మార్చాలన్నది నా కల. అలా చేయాలన్నది నా లక్ష్యం.
ఇక ఏ ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఏ పేద కూడా పేదరికం వల్ల ఎదగలేకపోయాడన్న పరిస్థితి ఉండకూడదు. పేదవారికి సమానమైన అవకాశాలు రావాలి. సాధికారత కల్పించగలగాలి. అలా మార్చాలన్నది మీ బిడ్డ కల. మీ బిడ్డ సంకల్పం. మీ బిడ్డ లక్ష్యం.
వైద్యం కోసం ఏ ఒక్కరూ మరణించే పరిస్థితి రాకూడదు. అప్పులపాలయ్యే పరిస్థితి, ఆస్తులమ్ముకునే పరిస్థితి రాకూడదు. అలా చేయాలన్నది నా కల. ఆ దిశగా అడుగులు వేసేది నా లక్ష్యం.
వీటన్నింటినీ కూడా నెరవేర్చే దిశగా అడుగులు వేయడానికి మాత్రమే మీ బిడ్డకు అధికారం కావాలి. లంచాలు, వివక్ష లేని వ్యవస్థ ఏర్పడాలన్నదే నా కల. నా లక్ష్యం. ఎవరూ కూడా లంచం అడిగే పరిస్థితి ఉండకూడదు. ఏ పేదవాడూ వివక్షకు లోనయ్యే పరిస్థితులు రాకూడదు. ఇది నా కల. ఇదే నా లక్ష్యం.
ఇందుకోసమే మనకు అధికారం కావాలి.
చదువుల పరంగా, వ్యవసాయం పరంగా, వైద్యం పరంగా మార్పులు తీసుకొచ్చాం. అక్కచెల్లెమ్మల సాధికారత విషయంలో ఎప్పుడూ చూడని రీతిలో అడుగులు వేశాం.
సామాజిక న్యాయానికి అర్థం చెప్పాం. పారిశ్రామికంగా, మౌలిక సదుపాయాల పరంగా, ఉద్యోగ, ఉపాధి అవకాశాల పరంగా ఎప్పుడూ చూడని విధంగా ఏపీని నంబర్ వన్ దిశగా అడుగులు వేగంగా పడుతూ కృషి చేస్తున్నాం.
*ఈ ప్రయాణం సాగాలి – పేదల భవిష్యత్ మారాలి*
అద్భుత ఫలితాలు ఇచ్చేలా అడుగులు వేయాలన్నది, వేస్తావున్నది, ఈ ప్రయాణం మధ్యలో ఉన్నది, ఈ ప్రయాణం ముందుకు పోవాలి, పేదవాడి భవిష్యత్ మారాలన్నదే నా కల.
దాని కోసమే లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తున్నాం. ఈ దిశగా ప్రయాణం కోసమే మనం అధికారం కావాలని కోరుకుంటున్నాం.
పేదవాడి భవిష్యత్ మారాలని, మార్చాలని.. దీని కోసమే మీ బిడ్డకు అధికారం కావాలని అడుగుతున్నాను.
అధికారం అంటే మీ బిడ్డకు వ్యామోహం లేదు. అధికారం పోతుందన్న భయం మీ బిడ్డలో ఎప్పుడూ ఉండదు, రాదు అని చెబుతున్నాను.
హిస్టరీ ఉన్నంత కాలం మీ బిడ్డ పేరు ప్రతి హిస్టరీ బుక్లో ఉండిపోవాలన్నదే మీ బిడ్డ కోరిక.
మీ బిడ్డకు అధికారం ఎందుకు కావాలో తెలుసా.. ప్రతి పేద వాడి ముఖంలో చిరునవ్వులు చూడటం కోసం.
ప్రతి పేద వాడి ఇంట్లో మీ బిడ్డ ఫొటో చిరకాలం ఉండాలని, చనిపోయిన తర్వాత కూడా మీ బిడ్డ ఎప్పుడూ పేదవాడి గుండెల్లో బతికుండటం కోసం మీ బిడ్డకు అధికారం కావాలి.
దాని కోసమే మీ బిడ్డ అధికారం అడుగుతున్నాడు. దానికోసమే మీ బిడ్డ పరితపిస్తున్నాడు.మంచి చేయడం కోసం మంచి మనసుతో మీ బిడ్డ సంకల్పిస్తున్నాడు. దేవుడి దయ, ప్రజలందరి దీవెనలు ఎల్లకాలం ఉండాలని కోరుకుంటున్నాడు.
అలాగే కార్యకర్తలకు, అభిమానులకు, వాలంటీర్లకు ఒకే ఒక మాట చెబుతున్నాను. ఇన్ని పదవులు, ఇన్ని హోదాలు భారతదేశ రాజకీయ చరిత్రలో మరే ఇతర పార్టీ కూడా ఎప్పుడూ ఇవ్వలేదు.
*ప్రతి కార్యకర్తకు మంచి జరుగుతుంది...*
మన పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త, ప్రతి అభిమాని, ప్రతి వాలంటీర్.. అందరూ నా కుటుంబ సభ్యులే. వారికి కచ్చితంగా మంచి జరుగుతుంది. మంచి జరిగించేందుకు మీ బిడ్డ ఉన్నాడు.
వారు మరో రెండు మెట్లు ఎదిగేందుకు, చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా ఎన్నడూ లేనన్ని కార్పొరేషన్లు, చైర్మన్లు, డైరెక్టర్లు, సర్పంచులు మొదలు, ఎమ్మెల్యేలు ఎంపీలుగా గెలిపించుకుని అవకాశాలిచ్చిన పార్టీ ఒక్క వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ.
మన పరిపాలన చూశారు. అందరూ ఆలోచన చేయాలి. మన 5 సంవత్సరాల పరిపాలన చూశారు. గతంలో 5 సంవత్సరాల చంద్రబాబు పాలన చూశారు. ఈ రాష్ట్రానికి ఎలాంటి నాయకుడు కావాలి అని అడుగుతున్నాను.
నాయకుడంటే చంద్రబాబు మాదిరిగా ఎన్నికలు వచ్చే సరికి రంగురంగుల మేనిఫెస్టో చూపి, రకరకాల పార్టీలతో పొత్తులు పెట్టుకుని, రైతన్నలకు, అక్కచెల్లెమ్మలకు, అవ్వాతాతలకు చదువుకుంటున్న పిల్లలకు, ప్రతి సామాజిక వర్గాన్ని ఎలా మోసం చేయాలో దిక్కుమాలిన ఆలోచనలు చేసి రంగురంగుల మేనిఫెస్టో తెచ్చి అధికారంలోకి వచ్చాక చెత్తబుట్టలో వేసి మోసం చేస్తున్న చంద్రబాబులా నాయకుడు ఉండాలా?
ఒక మాట నోట్లో నుంచి వచ్చాక, ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత కష్టమైనా, నష్టమైనా మాట మీద నిలబడే నాయకుడు.. నాయకుడంటే మాట ఇస్తే తగ్గేదే లేదని చెప్పే మీ జగన్ లాంటి నాయకుడు కావాలా? అని అడుగుతున్నాను.
*ప్రతి కార్యకర్తకూ అండగా ఉంటాం– నాదీ బాధ్యత*.
నాలుగు సార్లు ఆలోచన చేసి మాట ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మాట తప్పకూడదు. మడమ తిప్పకూడదు.
ఏకంగా 99 శాతం మేనిఫెస్టో హామీలన్నీ నెరవేర్చాం కాబట్టే, ప్రతి ఇంటికీ మేనిఫెస్టో చూపించి ప్రతి కార్యకర్తా చెప్పే పరిస్థితి. ఇదీ నాయకుడంటే.. ఇదీ పార్టీ అంటే.
నాయకుడంటే ప్రతి కార్యకర్తా కూడా కాలర్ ఎగరేసి అదిగో మా నాయకుడు.. అలాంటి వాడే మా నాయకుడు.. అని ప్రతి కార్యకర్తా కాలర్ ఎగరేసేలా నాయకుడు ఉండాలి.
అలాంటి నాయకుడు, అలాంటి పాలన ఉన్నప్పుడే ప్రతి గ్రామంలో, ప్రతి కార్యకర్తా, ప్రతి అభిమానీ ప్రతి ఇంటికీ వెళ్లి మా అన్న ఇవన్నీ దేవుడి దయతో చేశాడు అని వారి చిరునవ్వుల మధ్య కాలర్ ఎగరేసి తిరుగుతాడు. నాయకుడంటే ఆ మాదిరిగా ఉండాలి.
నాయకత్వం అంటే విశ్వసనీయత అనే పునాదుల మీద ఎప్పుడూ పెరుగుతుంది. పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్తకూ అండగా ఉంటా. ప్రజా సేవలో ఉన్న ప్రతి ఒక్కరికీ మరో రెండు మెట్లు ఎక్కే అవకాశం కల్పించే బాధ్యత మీ బిడ్డది. నాది. ప్రతి గ్రామానికీ మంచి చేశాం. ప్రతి ఇంటికీ మంచి చేశాం. ప్రతి పేదకూ మంచి చేశాం. ఈరోజు రాష్ట్రంలో ఏ గ్రామం తీసుకున్నా.. కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు.. ఆ గ్రామంలో ఉన్న ప్రతి ఇంటికీ, రాష్ట్ర వ్యాప్తంగా 87 శాతం ఇళ్లకు ప్రతి ఇంటికీ మంచి జరిగింది.
వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంలో మీరందరూ మీ సచివాలయ పరిధిలో జరిగిన మంచి గురించి చూస్తున్నారు. ప్రతి గ్రామంలోనూ, ప్రతి సచివాలయం పరిధిలో ఏకంగా రూ.20 కోట్లకుపైగా మంచి జరిగి నేరుగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వెళ్లినట్లు కనిపిస్తుంది. ఈ మార్పు గతంలో రాష్ట్రంలో ఎప్పుడూ జరగనిది. దేశంలో ఎక్కడా జరగని ఈ మార్పు.
ప్రతి ఇంటికీ, ప్రతి ఊరికీ మంచి చేశాం. మన హయాంలోనే బడులు, ఆస్పత్రులు బాగుపడ్డాయి. వ్యవసాయం మారింది. ప్రతి అక్కచెల్లెమ్మ ముఖంలో చిరునవ్వు కనిపిస్తోంది. అందుకే చెబుతున్నాను. వై నాట్ 175. వై నాట్ 25కు 25 ఎంపీ స్థానాలు అని గట్టిగా అడుగుతున్నాను. చెబుతున్నాను.
పరిపాలనలో ఎక్కడా తగ్గలేదు. మనకు ఒక్క ఎంపీగానీ, ఒక్క ఎమ్మెల్యేగానీ తగ్గే పరిస్థితే ఉండకూడదని తెలియజేస్తున్నాను.
*విశ్వసనీయతకూ వంచనకూ మధ్య యుద్ధమిది.*
ఇవి కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను మాత్రమే ఎన్నుకునే ఎన్నికలు కావు. ఈ ఐదేళ్ల కాలంలో ఇంటికీ కూడా మనందరి ప్రభుత్వం అందించిన సంక్షేమం, అభివృద్ధి పథకాలు కొనసాగించాలనే మనకు, వాటిని రద్దు చేయడమే టార్గెట్గా పెట్టుకుని డ్రామాలాడుతున్న చంద్రబాబుకు మధ్య జరిగే యుద్ధం ఈ ఎన్నికలు.
ఈ యుద్ధంలో పేదలు ఒకవైపున ఉంటే పెత్తందార్లు మరోవైపున ఉన్నారు. పెత్తందార్లను ఓడించి పేదల ప్రయోజనాలను కాపాడేందుకు మీరంతా కూడా సిద్ధమేనా..!
ఈ యుద్ధం మాట ఇచ్చిన నిలబెట్టుకున్న మనకు, మాట తప్పడమే అలవాటుగా ఉన్న వారికి మధ్య ఈ యుద్ధం. ఇది విశ్వసనీయతకు, వంచనకు మధ్య జరుగుతున్న ఈ యుద్ధం.
ఈ యుద్ధంలో వంచకుల్ని, వెన్నుపోటుదారుల్ని ఓడించేందుకు మీరంతా కూడా సిద్ధమేనా..!
జరగబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఒక సైన్యంగా పని చేయడానికి చంద్రబాబునాయుడు ప్రచారాలు, ఈనాడు రోత రాతలు, ఏబీఎన్, టీవీ5 ఎల్లో మీడియా తప్పుడు కథనాలు, వారి అబద్ధాలు, మోసాలు.. వీటన్నింటి నుంచి ఇంటింటి అభివృద్ధిని, పేదవాడి భవిష్యత్ను కాపాడేందుకు మీరంతా కూడా సిద్ధమేనా..!
*వెలుగుల బాటలో ప్రయాణానికి సిద్ధంగా....*
ప్రతి ఒక్కరూ కూడా మీ జేబులోంచి సెల్ఫోన్ తీయండి.. సెల్ ఫోన్లో లైట్ బటన్ ఆన్ చేయండి.. సిద్ధం అని చెప్పండి..
ఇలా వెలుగుల బాటలో ప్రయాణానికి మరోసారి సిద్ధం అని చెప్పండి.
దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో కేవలం రెండు నెలల్లోగా మరో ఐదేళ్లు ప్రజలు మెచ్చిన పాలన అందించేందుకు జగన్ అనే నేను.. మీ సేవకుడిగా సిద్ధం అని ఈ సందర్భంగా చెబుతున్నాను అని సీఎం శ్రీ వైయస్.జగన్ తన ప్రసంగం ముగించారు.
addComments
Post a Comment