విమానయాన సేవలు విస్తృతం..!



*విమానయాన సేవలు విస్తృతం..!*



* *రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ బాషా*


* *రూ. 266 కోట్ల నిధులతో కడప విమానాశ్రయ నూతన టెర్మినల్ బిల్డింగ్ నిర్మాణ పనులకు శంఖుస్థాపన*


* *వర్చువల్ విధానం ద్వారా శిలాఫలకాన్ని ఆవిష్కరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ* 


* *కడప పార్లమెంట్ సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు సి.ఎం. రమేష్ బాబు, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డిలు*


కడప, మార్చి 10  (ప్రజా అమరావతి): కడప జిల్లాలో ఎయిర్ పోర్ట్ నూతన టెర్మినల్ బిల్డింగ్ ఏర్పాటుతో విమానయాన సేవల విస్తృతంతో పాటు.. జిల్లాలో అన్ని రకాల రవాణా వ్యవస్థలు మెరుగు పడనున్నాయని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ బాషా పేర్కొన్నారు.


భారతీయ విమానాశ్రయాల ప్రాధికార సంస్థ (AAI) ఆధ్వర్యంలో.. దేశ వ్యాప్తంగా 14 విమానాశ్రయాలతో పాటు.. కడప విమానాశ్రయ నూతన టెర్మినల్ బిల్డింగ్ నిర్మాణ పనులకు.. దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ఉత్తర్ ప్రదేశ్ అజాంఘర్ నుండి.. వర్చువల్ విధానం శంకుస్థాపన చేశారు. అందులో భాగంగా రూ.226 కోట్ల నిధులతో కడప విమానాశ్రయ నూతన టెర్మినల్ భవన నిర్మాణ పనులకు ప్రధానమంత్రి వర్చువల్ విధానం ద్వారా శంఖుస్థాపన చేయడం జరిగింది. 


ఈ కార్యక్రమానికి స్థానిక ఎయిర్ పోర్ట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభా నుండి జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు తోపాటు ముఖ్య అతిధులుగా రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్.బి. అంజాద్ బాషా, కడప పార్లమెంట్ సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు సి.ఎం. రమేష్ బాబు, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అండర్ సెక్రెటరీ సురేష్ బాబు, జేసీ గణేష్ కుమార్, కడప నగర కమీషనర్ జీఎస్ఎస్ ప్రవీణ్ చంద్, డిఎఫ్ఓ సందీప్ రెడ్డి హాజరయ్యారు.


**రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ బాషా మాట్లాడుతూ... ఎన్నో ఏళ్లుగా అభివృద్ధిని ఆకాంక్షిస్తున్న కడప విమానాశ్రయ నూతన టెర్మినల్ బిల్డింగ్ నిర్మాణం కోసం 266 కోట్ల నిధులతో దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు శిలాఫలకాన్ని ఆవిష్కరించడం జిల్లాకు గర్వకారణంగా చెప్పవచ్చన్నారు. మనకు సువిశాలమైన పారిశ్రామిక కారిడార్ ఉన్నందున.. భవిష్యత్తులో ఈ విమానాశ్రయం నుండి సంతృప్తి కరమైన సేవలతో పాటు.. సేవలు ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి, అటు కేంద్ర ప్రభుత్వానికి పుష్కలమైన ఆదాయ వనరుగా కూడా రూపుదిద్దుకోనుందన్నారు. ప్రాంతానికి ఎయిర్ కనెక్టివిటీని మెరుగుపరుచడం, ఈ ప్రాంతంలో ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడం, విద్య, ఉపాధి పెంపుదల, మరియు ప్రారిశామిక, వాణిజ్య, పర్యాటక రంగాల పురోగతిని వేగవంతం చేయడం వంటి ప్రయోజనాలు చేకూరనున్నాయన్నారు.


** జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు మాట్లాడుతూ... దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ పౌర విమానయాన సేవారంగంలో.. ప్రయాణీకుల అనుభవాలు, సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని.. భారతీయ విమానాశ్రయాలను ఉన్నత ప్రమాణాలతో అంతర్జాతీయ స్థాయికి దీటుగా అభివృద్ధి చేసి విశేషమైన మార్పును తీసుకువచ్చేలా.. వికసిత్ భారత్ సంకల్పంతో భారీ పరివర్తనకు నాంది పలికిందన్నారు. అందులో భాగంగానే ఆధునిక జీవనశైలికి అనుగుణంగా విమానాశ్రయాల్లో ప్రయాణీకులకు సౌకర్యాలను అందించడమే కాకుండా.. ఆయా కేంద్రాలను అందరూ సులభతరంగా సద్వినియోగం చేసుకునేలా ఉడాన్ పథకం ద్వారా కొంతవరకు 

విమాన టిక్కెట్ ధరల భారాన్ని కూడా ప్రభుత్వమే భరిస్తోందన్నారు. 


కడప విమానాశ్రయం నుండి 2022-23 సంవత్సరంలో దాదాపు 70 వేల మంది ప్రయాణికులు విమానయాన సేవలను సద్వినియోగించుకున్నారు. భవిష్యత్తులో పయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నూతన టెర్మినల్ భవనము నిర్మించటానికి భారతీయ విమానాశ్రయాల ప్రాధికార సంస్థ తగు చర్యలు  చేపట్టిందన్నారు.


రూ.266 కోట్ల వ్యయంతో చేపట్టనున్న నూతన

టెర్మినల్ భవన విశిష్టతలు చుస్తే... 16,455 చ.మీ. విస్తీర్ణంలో నిర్మించనున్నారు. పీక్ అవర్ సర్వింగ్ కెపాసిటీ 1800 మంది కాగా, ఏడాదికి 25 లక్షల మందిగా నిర్ణయించారు. అందులో 24 చెక్-ఇన్-కౌంటర్లు, 2 కన్వేయర్ బెల్ట్స్, 3 X-BIS యంత్రాలు, 3 ఏరో బ్రిడ్జిలు, 5 స్టార్ గ్రిహ రేటింగ్, 375 కార్ పార్కింగ్ సామర్థ్యంతో టెర్మినల్ భవనాన్ని నిర్మించడం జరుగుతోందన్నారు.


అభివృద్ధి పనుల అనంతరం కడప కడప విమానాశ్రయం ఒక అపురూపమైన నూతన జవసత్వాలు సంతరించుకుని, అత్యుత్తమ శ్రేణి ఎయిర్ పోర్ట్ గా ప్రాముఖ్యత సంతరించుకోనుందన్నారు. విమాన ప్రయాణికులకు ఆహ్లాదకరమైన అనుభూతని అందించడమే కాకుండా.. అందరినీ ఆకర్షించేలా, భారతీయ సహజ వారసత్వ, సాంస్కృతిక విశిష్టతలను ప్రతిభింభించి కళా సంస్కృతిక వైభవాన్ని పెంపొందిచేలా బాహ్య నిర్మాణాలు చేపట్టడం జరుగుతోందన్నారు.


అంతేకాకుండా కడప-బెంగుళూరు, కడప-తిరుపతి రహదారి, కడప-నెల్లూరు ప్రధాన రహదారులను విస్తృతం చేయడం జరుగుగుతొందన్నారు. దీంతో వైఎస్ఆర్ జిల్లాలో అన్ని రకాల రవాణా వ్యవస్థలు మరింత పటిష్టం కనున్నాయన్నారు. రైల్వే, రహదారులు, విమానయాన సేవల విస్తృతంతో.. జిల్లా మరింత అభివృద్ధి పథంలోకి రానుందని.. జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.


** కడప ఎంపీ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ.. ఫారెస్ట్ ఏరియాలో అతి సమీపంలో అటవీ ప్రాంతం  ఉండడంతో.. అటవీశాఖ అనుమతులు, స్థానిక భూ యజమానులను ఒప్పించి భూసేకరణ చేయడం వంటి అంశాలను జిల్లా యంత్రాంగం చాలా ప్రధాన్యతతో పూర్తి చేసి.. ఎయిర్ పోర్ట్స్ అథారిటీ వారి నుండి నూతన టెర్మినల్ భవన నిర్మాణం కోసం అనుమతులు తీసుకోవడం జరిగిందన్నారు. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి, రాజ్యసభ సభ్యులు, కేంద్ర మంత్రుల సహకారం అభినందనీయం అన్నారు. అంతే కాకుండా కడప విమానాశ్రయం నుండి నిరంతరాయ సర్వీసుల కోసం.. రాష్ట్ర ప్రభుత్వం వయబలిటీ గ్యాప్ ఫండింగ్ ను కూడా భరించిందని తెలిపారు. ఉడాన్ పథకం ద్వారా.. నిరంతరాయంగా విమానయాన సర్వీసులను కొనసాగించాలని ఎయిర్ పోర్ట్ అథారిటీ ఉన్నతాధికారులను కోరడం జరిగిందన్నారు.


** రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ నాయుడు మాట్లాడుతూ.. భారత విమానయాన రంగ అభివృద్ధి, నిర్వహణ, సేవలను.. ప్రపంచంలోనే అగ్రగామిగా తీసుకురావాలన్న ద్యేయంతో.. దేశ ప్రధాని నరేంద్ర మోడీ పర్యావరణ సాహితమైన అత్యాధునిక స్వదేశీ సాంకేతికతను ఉపయోగిస్తున్నారన్నారు.  ఆధునిక, సురక్షిత, విమానాశ్రయాల కార్యకలాపాల నిర్వహణ మరియు సమర్థవంతమైన విమానయాన సేవలను దేశం అంతటా మెరుగుపరచాలన్న ప్రధాన ఉద్దేశ్యంతో ప్రధానమంత్రి ముందుకు సాగుతున్నారన్నారు. అద్భుతమైన చరిత్ర, గొప్ప వారసత్వ సాంస్కృతిక వైభవం కలిగిన కడప నగరం.. వైఎస్ఆర్ జిల్లా కేంద్రంగా.. రాష్ట్రంలోనే అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుందన్నారు. కడప సమీప జిల్లాల ప్రజలు కూడా.. కడప నుండి హైదరాబాద్ వెళ్లేందుకు కడపకు వస్తున్నారు అంటే కడప విమానాశ్రయం ఎంత అనుకూలతను కలిగి ఉందో అర్థమవుతోందన్నారు.


** కమలాపురం ఎమ్మెల్యే పి. రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ.. అతి పురాతనమైన కడప విమానాశ్రయం ఎప్పటినుండో అభివృద్ధిని ఆకాంక్షిస్తోంది. గతంలో దివంగత ముఖ్యమంత్రి డా.వైఎస్ఆర్ హయాంలో విమానాల రాకపోకలు పునరుద్ధరణ కావడం జరిగిందని, ఉడాన్ పథకం ద్వారా అతి తక్కువ ధరలతో విమానయాన సర్వీసు చార్జీలను అమలు చేసి.. సమాన్యులకు  సైతం విమానాలు ఎక్కే అవకాశం కల్పించారన్నారు. ప్రస్తుతం ఇదే విమానాశ్రయాన్ని మౌలికంగా మరింత విస్తరించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తోపాటు.. కడప పార్లమెంట్ సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు సి.ఎం.రమేష్ లు ఎంతో కృషి చేశారని వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నామన్నారు.  


** అంతకు ముందు లైవ్ ద్వారా దేశ ప్రధాని ప్రసంగిస్తూ.. వేగవంతమైన పౌర విమానయాన సేవలను అందించే క్రమంలో దేశంలోని అన్ని విమానాశ్రయాలను ఆధునీకరణ, పునర్ రూపాంతరం కొరకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించిందన్నారు. విమానయాన, రోడ్డు, రైలు ప్రయాణీకుల సౌకర్యాలు, భద్రతా ప్రమాణాలను పెంపొందించుటలో భాగంగా.. అధిక సంఖ్యలో చేపడుతున్న విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్ల నిర్మాణాలు, రోడ్డు ఓవర్ బ్రిడ్జీలు, రోడ్డు అండర్ బ్రిడ్జిల నిర్మాణాలు అమృత్ భారత్ ప్రగతికి ప్రత్యక్ష సాక్షాలుగా దర్శనమివ్వనున్నాయన్నారు.


ఈ కార్యక్రమంలో కడప ఆర్డీవో మధుసూదన్,   రీజనల్ ఎక్సికుటీవ్ డైరెక్టర్ ఎస్.జె. ఫణికర్, కడప ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ సుజిత్ కుమార్ పోదార్, ప్రోటోకాల్ ఆఫీసర్ (ఏపీ సీఎం &వివిఐపి) బి.సురేష్ బాబు, టెర్మినల్ మేనేజర్ జోసఫ్, స్థానిక బీజేపీ, వైసిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు. 



Comments