అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల స్ధలాలపై సంపూర్ణ హక్కులు కల్పిస్తూ పత్రాలు అందజేసిన ముఖ్యమంత్రి


విజయవాడ (ప్రజా అమరావతి);


*విజయవాడ కనకదుర్గ వారధి వద్ద ఇరిగేషన్‌ రిటైనింగ్‌ వాల్, కృష్ణా రివర్‌ ఫ్రంట్‌ సుందరీకరణ ఫేజ్‌–1పనులకు ప్రారంభోత్సవంతో పాటు, వివిధ ప్రాంతాల్లో రూ.239 కోట్లతో సీవేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్ల నిర్మాణ పనులకు శంకుస్ధాపనలు చేసిన ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌.*


*అనంతరం విజయవాడ పురపాలక సంస్ధ పరిధిలో అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల స్ధలాలపై సంపూర్ణ హక్కులు కల్పిస్తూ పత్రాలు అందజేసిన ముఖ్యమంత్రి



.*


*ఈ సందర్భంగా లబ్ధిదారులను ఉద్దేశించి మాట్లాడుతూ సీఎం ఏమన్నారంటే...:*


ఈరోజు విజయవాడలో మీ అందరి చిక్కటి చిరునవ్వుల మధ్య మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి.

ఈరోజు విజయవాడలోనే దాదాపుగా 31,866 పట్టాలకు సంబంధించి రకరకాల కేటగిరీల్లో ఉన్న ఈ పట్టాలను రెగ్యులరైజ్‌ చేసి ప్రజలందరికీ మంచి చేస్తూ వీటికి సంబంధించిన సంపూర్ణ హక్కులు ఆ కుటుంబాలకు ఇచ్చే ఒక మంచి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుడుతున్నాం.

ఇందులో 22ఏ కింద పూర్తి హక్కులు లేక, రిజిస్ట్రేషన్‌ చేయడానికి ఇబ్బంది పడే పరిస్థితిలో ఉన్న దాదాపు 21వేల మంది.. విజయవాడ సెంట్రల్, వెస్ట్, ఈస్ట్‌.. అన్ని చోట్లు కలిపి... 16 కాలనీలకు సంబంధించి ఇవన్నీ మేలు చేసే కార్యక్రమం జరుగుతోంది. 


అదేరకంగా 9,125 పట్టాలు అనబ్జెక్షనబుల్‌ ల్యాండ్స్‌ లో ఉన్న పట్టాలను పూర్తిగా ధ్యాస పెట్టి రెగ్యులరైజ్‌ చేసే కార్యక్రమం జరుగుతోంది. 

దీనికి సంబంధించి అవినాశ్‌ చెబుతున్నాడు. భ్రమరాంబపురంలో ఏ మాదిరిగా బరియల్‌ గ్రౌండ్‌ ఇష్యూ ఉండి ఇబ్బందికర పరిస్థితుల్లో రెగ్యులరైజ్‌ కాక ఇళ్లు అక్కడే కట్టుకుని, దశాబ్దాలుగా ఉంటున్నప్పటికీ ఇల్లు అమ్ముకునే స్వేచ్ఛ లేక ఇబ్బందులు పడే పరిస్థితులను చెప్పాడు. 

వాటన్నింటికీ  ఈరోజు పరిష్కారం చూపుతూ రెగ్యులరైజ్‌ చేసే కార్యక్రమాలు జరుగుతున్నాయి. 

మొత్తంగా దాదాపు 31,866 పట్టాలకు సంబంధించి రకరకాల రెగ్యులరైజేషన్‌ కార్యక్రమాలు ఒకవైపు జరిగిస్తుండగా, మరోవైపున రూ.239 కోట్లకు సంబంధించిన రకరకాల ప్రాంతాల్లో సీవేజ్‌ ట్రీట్మెంట్‌ ప్లాంట్‌కు సంబంధించిన ఫౌండేషన్‌ స్టోన్‌ కూడా ఈరోజు వేయడం జరిగింది. 


దీనివల్ల మురికినీళ్లు మన ఇంటి పక్కన రాకుండా వాటిని నీట్‌గా ట్రీట్‌ చేసి, దాదాపు 5 ప్రాంతాల్లో సీవేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు రూ.239 కోట్లకు సంబంధించిన పనులకు శంకుస్ధాపన కార్యక్రమాలు జరుగుతున్నాయి.


ఇప్పుడు ఈ కరకట్ట వాల్‌ ను మీరు చూస్తున్నారు. ఇటువైపున, అటువైపున ఈరెండు కరకట్ట గోడలు దాదాపు రూ.500 కోట్లతో నిర్మించాం.

గతంలో కృష్టా నదికి ఎప్పుడు వరదలు వచ్చినా.. ప్రతి ఏటా కృష్ణలంక ప్రాంతం ఎప్పుడూ కూడా మునిగిపోతున్న పరిస్థితులు. వరదలు ఎప్పుడు వచ్చినా ఇక్కడికి వచ్చి నాలుగు మాటలు చెప్పడమే కానీ, కచ్చితంగా ఈ ఏరియాకు ఈ గోడ కడితే ఇటువంటి పరిస్థితి రాదు, ఈ గోడ కట్టాలని అని ఆలోచన చేసిన పుణ్యం ఏ ఒక్కరూ చేయలేదు. అది ఒక్క మీ బిడ్డ ప్రభుత్వంలోనే జరుగుతోందని చెప్పడానికి సంతోషపడుతున్నాను. 


కరకట్ట గోడ కట్టడమే కాకుండా ఇక్కడ మన కృష్ణలంక ప్రాంతంలో ఉన్న మన అక్కచెల్లెమ్మలు, మన పిల్లలు, మన అవ్వలు, తాతలు అందరూ ఆహ్లాదకరంగా సాయంత్రంపూట పార్కులో నడుచుకుని పోయేట్టుగా సుందరీకరణ చేస్తూ రెండు వైపులా మంచి పార్కులు రూపొందించే కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. 


ఇదే విజయవాడలో ఎప్పుడూ జరగని విధంగా, ఎప్పుడూ చూడని విధంగా మీ బిడ్డ ప్రభుత్వంలో రూ.400 కోట్లు పైచిలుకు ఖర్చు పెట్టి అంబేద్కర్‌ పార్కును కూడా మీ అందరి కళ్ల ఎదుటే ఫౌండేషన్‌ స్టోన్‌ వేయడం, ప్రారంభించడం రెండు ఘటనలను కూడా చూశారు.


ఇంతకు ముందు విజయవాడ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ పోర్టుకు పోవాలంటే ఒక్క ఫ్లై ఓవర్‌ కూడా  పూర్తి కాని పరిస్థితి నుంచి ఈరోజు ఈ 58 నెలల కాలంలోనే ఆ పెండింగ్‌ లో ఉన్న ఫ్లై ఓవర్‌ పూర్తి చేయడమే కాకుండా మరో రెండు ఫ్లై ఓవర్లు అదే రోడ్డులో కనిపిస్తాయి. కనకదుర్గమ్మ ఫ్లై ఓవర్‌ కూడా కలుపుకొంటే ఇంకో ఫ్లై ఓవర్‌.


ఇవన్నీ కూడా మన కళ్ల ఎదుటే యుద్ధ ప్రాతిపదికన ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయిపోయిన పరిస్థితులు కూడా కేవలం ఈ 58 నెలల కాలంలోనే కనిపిస్తాయి.


అదే విధంగా ఔటర్‌ రింగు రోడ్లు... కాజ నుంచి చిన్న అవుటపల్లెకు గుంటూరు ట్రాఫిక్‌ అంతా విజయవాడ నుంచి పోవాల్సిన అవసరం లేకుండా అటు నుంచి అటే ట్రాఫిక్‌ పోయేట్టుగా ఆ ప్రాజెక్టు కూడా అయిపోవచ్చింది. మరో రెండు నెలల్లో ఓపెన్‌ చేసే విధంగా పనులు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా గతానికి ఇప్పటికీ తేడా గమనించమని కోరుతున్నాను.

 

మనమేమో... ప్రతి అడుగులోనూ అభివృద్ధి అంటే ఇదీ అంటూ ప్రతి ఇంటికీ మంచి చేస్తూ అడుగులు వేయిస్తున్నాం. 

అటువైపున మన వ్యతిరేకులంతా ఏమీ చేయరుగానీ అభివృద్ధి.. అభివృద్ధి అంటారు. మీరే ఆలోచన చేయమని అడుగుతున్నాను.


ఈ 58 నెలల కాలంలోనే మీ స్కూళ్లు, మీ హాస్పటళ్లు బాగుపడ్డాయి. గ్రామీణ స్థాయిలో అయితే వ్యవసాయం చేసే తీరు కూడా బాగుపడింది. ఎప్పుడూ జరగని విధంగా చూడని విధంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. 


వాలంటీర్ల వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ ఇంటింటికీ వచ్చి ఆప్యాయంగా పలకరిస్తూ మంచి చేసే కార్యక్రమం,  ఒక్కరూపాయీ లంచం లేకుండా జరిగిస్తున్న పాలన కేవలం ఈ 58 నెలల పాలనలోనే అని గమనించమని కోరుతున్నాను. 

వీటన్నిటి వల్ల మీ అందరికీ మంచి జరగాలని మనసారా కోరుకుంటూ... నేను రెండు మూడు పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేస్తాను. 

ఆ తర్వాత మీ ప్రాంతాలకు వచ్చి వెల్లంపల్లి శ్రీను,  ఒక ఏరియాలోకి, అవినాష్‌ ఒక ఏరియాలోకి, ఆసిఫ్‌ తన ఏరియాలోకి వచ్చి సచివాలయ పరిధిలో పంపిణీ చేసే కార్యక్రమం వాళ్లు దగ్గరుండి చేస్తారు. 

దేవుని దయ, మీ అందరి చల్లని దీవెనలు ఎల్లకాలం ఉండాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. 


ఇటువైపున పార్కుకు, అటు వైపున పార్కుకు కృష్ణమ్మ జలవిహార్‌ అని పేరు పెడదాం అని సూచిస్తూ... సీఎం తన ప్రసంగం ముగించారు.

Comments