ఏ ఒక్క అవ్వా తాతకు పెన్షన్ రాకపోయినా ప్రభుత్వమే బాధ్యత వహించాలి.

 అమరావతి (ప్రజా అమరావతి);





*ఎన్నికల నిబంధనలు పాటించి పెన్షన్‌దారులకు సకాలంలో పెన్షన్‌లు అందించాలని సీఎస్‌ను కోరిన తెలుగుదేశం నేతలు*


*ఏ ఒక్క అవ్వా తాతకు పెన్షన్ రాకపోయినా ప్రభుత్వమే బాధ్యత వహించాలి


*


*పెన్షన్ డబ్బులను కాంట్రాక్టర్లకు మళ్లించి కమిషన్లు దోచుకున్న ద్రోహి జగన్ రెడ్డి*


*జగన్ రెడ్డి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం నష్టపోతున్న వాలంటీర్లు, పెన్షన్‌దారులు*


- *తెదెపా నేతలు*

వాలంటీర్ల ద్వారా పెన్షన్ పంపిణీ చేయవద్దని కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఉత్తర్వులపై  వైసీపీ నాయకులు దుష్ప్రచారాలు చేస్తున్నారు. పెన్షన్ దారులకు పెన్షన్ పంపిణీ చేసే విధంగా ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలని సీఎస్ కె.ఎస్.జవహార్ రెడ్డిని తెదెపా నేతలు కోరారు. ఈ మేరకు సోమవారం అమరావతిలోని సచివాలయంలో సీఎస్‌ను కలిసి ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల టీడీపీ నేతలు వినతిపత్రం అందించారు. రాజకీయ లబ్దీ కోసం తెలుగుదేశం, చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎస్‌ను కోరారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో టీడీపీ నేతలు పాల్గొన్నారు.


*దొడ్డి దారుల్లో అధికారాన్ని నిలబెట్టుకోవాలని చూస్తున్న జగన్ రెడ్డి : వర్ల రామయ్య*

ఓడిపోతున్నానని జగన్ రెడ్డికి అర్థమైపోయిందని అందుకే తప్పుడు దారుల్లో గట్టెక్కాలని, తెలుగుదేశం, చంద్రబాబుపై ప్రజల్లో వ్యతిరేకత తీసుకురావాలని జగన్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య మండిపడ్డారు. ఈ సందర్భంగా వర్ల రామయ్య మాట్లాడుతూ...”వాలంటీర్ వ్యవస్థ లోపభూయిష్టంగా ఉందని ఎన్నికల కమిషన్ గ్రహించింది. అందుకే ప్రత్యామ్నాయ మార్గాలతో లబ్దీదారులకు పింఛను పంపిణీ చేసి, పింఛనుదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సీఎస్‌కు ఉత్తర్వులు ఇచ్చింది. ఎన్నికల సంఘం నిర్ణయానికి చంద్రబాబుకి ఏమిటి సంబంధం? చంద్రబాబు కింద కేంద్ర ఎన్నికల సంఘం పని చేస్తోందా? బుద్ధి లేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిచ్చి పిచ్చిగా ప్రచారాలు చేస్తోంది. పింఛను రాకపోతే చంద్రబాబే బాధ్యుడని బుద్ధి లేని ముఖ్యమంత్రి అంటున్నాడు. ఒక్క అవ్వాతాతకి పింఛన్ రాకపోయినా దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. లబ్దీదారులందరికి పింఛను అందేటట్లుగా చూడాల్సింది ప్రభుత్వమే. పింఛన్లు ఇవ్వడానికి ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేవు. ఉన్న డబ్బంతా హుటా హుటిన సొంత కాంట్రాక్టర్లకు జగన్ రెడ్డి దోచిపెట్టాడు. వృద్ధులకు పింఛను ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులున్నాయా లేవా? అని సీఎస్‌ను అడిగాం. ప్రభుత్వంలో ఉన్న ఖజానా కమిషన్ల కోసం కాంట్రాక్టర్లకు, జగన్ రెడ్డి మేనమామ రవింద్రనాధ్ రెడ్డికి ఇవ్వడం కాదు. అవి అవ్వా తాతల డబ్బులు. వారికే ఇవ్వాలి. నాడు రూ.2 వందలున్న పింఛన్ను రూ.2 వేలు చేసింది చంద్రబాబే. మరలా అధికారంలోకి రాగానే రూ.4 వేల పింఛను నేరుగా అవ్వా తాతల ఇంటికి వచ్చి ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది. సచివాలయాలకు ఎండలో వచ్చి పింఛను తీసుకోండని ప్రభుత్వం చెబుతోంది. అలా కాకుండా ఇంటికే వెళ్ళి పింఛను పంపిణీ చేయాలని సీఎస్‌ను డిమాండ్ చేశాం. పెన్షన్‌దారులెవ్వరూ భయపడాల్సిన పని లేదు. ఖచ్చితంగా మీ ఇంటికే వచ్చి పింఛను ఇస్తారు.  వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని పెన్షన్‌దారులు ఎవ్వరూ నమ్మకండి. తప్పుడు వార్తలు ప్రచారాలు చేస్తున్న వైసీపీ అధికారిక ట్విట్టర్ ఖాతాపై చర్యలు తీసుకోవాలి. వైసీపీ సోషల్ మీడియాలో చంద్రబాబుపై దుష్ప్రచారం చేస్తున్నారని, అటువంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోండని చీఫ్ సెక్రటరీ జవహార్ రెడ్డికి ఫిర్యాదు చేశాం. వాటితో పాటుగా ఇంటి దగ్గరకు వెళ్ళి ప్రభుత్వ ఉద్యోగుల చేత 5వ తేదిలోపు పింఛను పంపిణీ పూర్తి చేయాలని సీఎస్‌ను కోరాం. తప్పకుండా జిల్లా కలెక్టర్లకు, సెర్ప్‌కు ఆదేశాలిస్తానని సానుకూలంగా స్పందించారు” అని వర్ల రామయ్య తెలిపారు.


*అవ్వాతాతలను అడ్డంపెట్టుకొని నీచ రాజకీయాలకు తెర లేపిన జగన్ రెడ్డి : నక్కా ఆనందబాబు*

బాబాయిని చంపి ఆ నేరాన్ని చంద్రబాబుపై మోపి గత ఎన్నికల్లో లబ్దీ పొందిన జగన్ రెడ్డి నేడు అవ్వా తాతలను అడ్డంపెట్టుకొని రాజకీయ కుట్రలకు తెరలేపాడని తెదెపా పోలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు విమర్శించారు. అవ్వా తాతలకు పింఛను పంపిణీ చేయకుండా చేసి ఆ నిందను చంద్రబాబుపై మోపి రాజకీయ లబ్దీ పొందాలని చూస్తున్నాడని ఆయన మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...”ఈ రోజు పింఛను రాకపోవడానికి కారణం చంద్రబాబు నాయుడే అని అనడానికి వైసీపీ నాయకులకు బుద్ధి ఉందా? వాలంటీర్ల చేత పింఛను పంపిణీ చేయొద్దని ఈసీ ఉత్తర్వులు ఇవ్వక  2 రోజుల ముందే 3వ తేదీన పింఛను ఇస్తామని సాక్షి పత్రికలో వేశారు. నేడు మన రాష్ట్రంలో ఉన్న సచివాల ఉద్యోగుల చేత పింఛను పంపిణీ చేయవచ్చు. ఒక్కో సచివాలయ ఉద్యోగి 40 పింఛన్లు చిత్తశుద్ధితో పంపిణీ చేస్తే రెండు గంటల్లో పింఛన్‌దారులకు పింఛను పంపిణీ చేయొచ్చు. కానీ ప్రభుత్వం మాత్రం ఏదోరకంగా పింఛను పంపిణీ ఆలస్యం చేసి పెన్షన్‌దారులను ఇబ్బందులు పెడదామని వైకాపా కుట్ర చేస్తుంది. ఆ ఉచ్చులో మీరు పడద్దని, నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సీఎస్‌ను కోరాం. 3వ తేది నుంచి పింఛను పంపిణీ మొదలు పెడతామని అన్నారు. ఖచ్చితంగా నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారని మేమనుకుంటున్నాం. అలా జరగని ఎడల వీరు తప్పిదాలను ఎన్డీఏ నేతలు ప్రజల్లోకి తీసుకువెళ్తారు” అని ఆనందబాబు హెచ్చరించారు.


*రాజకీయ లబ్దీ కోసం డ్రామాలు ఆడుతున్న జగన్ రెడ్డి : నెట్టం రఘురాం*

రాజకీయ లబ్దీ కోసం ఎన్నికల  కమిషన్ ఉత్తర్వులను జగన్ రెడ్డి వాడుకుంటున్నాడని బుద్ధి లేకుండా సచివాలయాలకు వచ్చి పింఛను తీసుకోండని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారని ఎన్టీఆర్ జిల్లా మాజీ మంత్రి నెట్టం రఘురాం దుయ్యబట్టారు. “వాలంటీర్లతో పింఛన్ పంపిణీ చేయించవద్దని ఈసీ చెప్పింది తప్ప ఇంటికి వెళ్ళి ఇవ్వొద్దని చెప్పలా. కానీ చంద్రబాబే పింఛను పంపిణీ ఆపించాడని తప్పుడు ప్రచారాలు వైసీపీ నాయకులు చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రత్యామ్నాయ మార్గాలు చూసి ఇతర ప్రభుత్వ ఉద్యోగుల చేత ఇంటింటికి వెళ్ళి అవ్వా తాతలకు పింఛను పంపిణీ చేయించాలి” అని రఘురాం డిమాండ్ చేశారు.


*పింఛను మొదలు పెట్టిందే తెలుగుదేశం పార్టీ : తెనాలి శ్రావణ్ కుమార్*

ఏ విషయాన్నైనా రాజకీయ లబ్దీ కోసం వాడుకోవడంలో వైసీపీ పీహెచ్‌డీ చేసిందని తాడికొండ తెదెపా ఎమ్మెల్యే అభ్యర్ధి తెనాలి శ్రావణ్ కుమార్ ఎద్దేవ చేశారు. “వాలంటీర్లందరూ మన కార్యకర్తలే...మన పార్టీ కోసమే పని చేయాలని మొదటి నుంచి అధికార పార్టీ నాయకులు చెబుతూనే ఉన్నారు. అలానే కొంతమంది మినహా మిగిలిన వాలంటీర్లు వైసీపీ అనుకూలంగా పని చేసి నేడు సస్పెండ్ అయ్యి ఇంట్లో కూర్చున్నారు. ఇవన్నీ ఎన్నికల కమిషన్ గమనించింది. అందుకే వాళ్ళతో పెన్షన్ పంపిణీ చేయించవద్దని ఈసీ ఆదేశాలిచ్చింది. ఎన్నికల కమిషన్ ఉత్తర్వుల మేరకు పెన్షన్ పంపిణీలో ప్రత్యామ్నాయ విధానలు చూడాల్సిన బాధ్యత సీఎస్‌పై ఉంది. సచివాలయ ఉద్యోగుల చేత ఇంటింటికి వెళ్ళి పెన్షన్ పంపిణీ చేయించవచ్చు. ప్రతీ సచివాలయ ఉద్యోగి 40 పెన్షన్ చొప్పున ఒక్క పూటలోనే పంపిణీ చేయవచ్చు అనే విధానాన్ని సీఎస్‌కు తెలుగుదేశం పార్టీ సూచించింది. ఈ రోజు పింఛను డబ్బులు పడకపోవడానికి తెలుగుదేశం పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. తెలుగు రాష్ట్రాల్లో పింఛను మొదలు పెట్టింది తెలుగుదేశం పార్టీ. పింఛను పెంచుకుంటూ పోయింది తెలుగుదేశం పార్టీ. అధికారంలోకి రాగానే రూ.2 వేలు ఉన్న పెన్షన్‌ను ఇచ్చిన హామీ మేరకు రూ.3 వేలు చేయకుండా 5 సంవత్సరాలు సాగదీసి ఎన్నికలొస్తున్నాయని చివర్లో రూ.3 వేలు చేసి పింఛనుదారులను మోసం చేశాడు. ఈ అంశాలను పక్కన పెట్టి రాజకీయ లబ్దీ కోసం ప్రతిపక్షాలపై అధికార పార్టీ నాయకులు దుష్ప్రచారాలు చేస్తున్నారు. ఇప్పటికైనా పింఛను పంపిణీలో నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సీఎస్‌ను కోరాం” అని శ్రావణ్ తెలిపారు.


ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కన్నా లక్ష్మినారాయణ, ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, గొట్టిపాటి రవికుమార్, మాజీ ఎంపి కొనకళ్ళ నారాయణ, తెదెపా నియోజకవర్గ ఇన్చార్జ్‌లు వర్ల కుమార్ రాజా, జులకంటి బ్రహ్మానందరెడ్డి, యార్లగడ్డ వెంకట్రావు, బొడె ప్రసాద్, కాగిత కృష్ణ ప్రసాద్, గల్లా మాధవి, తెదెపా నాయకులు పోతినేని శ్రీనివాసరావు, బుచ్చి రాంప్రసాద్, నాదెండ్ల బ్రహ్మం, చిట్టాబత్తిన చిట్టిబాబు, కోడూరు అఖిల్, మీడియా కోఆర్డినేటర్ దారపనేని నరేంద్ర, తదితర నేతలు పాల్గొన్నారు.

Comments