నేరాలు, ఘోరాలు చేసే ఘరానా ముఠా నాయకుడు జగన్ రెడ్డి.



*నేరాలు, ఘోరాలు చేసే ఘరానా ముఠా నాయకుడు జగన్ రెడ్డి*



*అన్నమయ్య గేటును కొట్టుకుపోయేలా చేసి అమాయకుల్ని చంపాడు*


*ధరల బాదుడు, ఛార్జీల వాతలు, పన్నుల భారాలు తప్ప జగన్ సాధించిందేంటి?*


*హంద్రీనీవా, గాలేరు-నగరి గాలికొదిలేసిన సీమ ద్రోహి జగన్ రెడ్డి*


*జగన్ రెడ్డి అనే సైకో ప్రతి ఎన్నికకూ.. ఒక సింపతీ డ్రామాతో వస్తున్నాడు*


*వివేకా హత్యపై చెల్లి అడుగుతున్న ప్రశ్నకు జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి*


*హంతకున్ని వెనకేసుకొస్తూ.. ఇంటి సమస్యను రాష్ట్ర సమస్యగా మార్చే ప్రయత్నం*


*హార్టీకల్చర్‌కి ప్రోత్సాహకాలు పునరుద్దరిస్తా.. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తా*


*అడ్డగోలుగా జరిగిన జిల్లాల విభజనను పున:సమీక్షించి ప్రజల ఆకాంక్షలు గౌరవిస్తా*


*రైల్వే కోడూరు ప్రజాగళం సభలో నారా చంద్రబాబు నాయుడు*


రైల్వే కోడూరు (ప్రజా అమరావతి);


కోడూరు జనసంద్రం సముద్రాన్ని మరపిస్తోంది. ఈ జన సమూహాన్ని చూశాక జగన్ రెడ్డికి ఓటు పడుతుందని నమ్ముతున్నారా? ఒక అహంకారి, ఒక విధ్వంసకారి, రాష్ట్రాన్ని దోచేసిన వ్యక్తిని ఇంటికి పంపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఐదేళ్లు పరదాలు కట్టుకుని తిరిగాడు. నేను, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా పని చేశాం. ఏ రోజైనా పరదాలు కట్టుకున్నామా? సిద్ధం అని జగన్ రెడ్డి అంటున్నాడు. మేము చెబుతున్నాం. ప్రజలూ చెబుతున్నారు. మేమంతా నిన్ను గద్దె దించడానికి సిద్ధమని చెబుతున్నాం. రైల్వే కోడూరుకు ఈ జగన్ రెడ్డి ఏమైనా చేశాడా? చిన్న పని అయినా చేశాడా? ఎలాంటి మేలైనా చేశాడా? సొంత జిల్లాకు కూడా మేలు చేయని వ్యక్తి రాష్ట్రానికి అవసరమా? అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోవడానికి కారణం ఈ జగన్ రెడ్డి. ఇలాంటి వ్యక్తి మూడు రాజధానులు కాపాడుతాడంట. అన్నమయ్య ప్రాజెక్టు గేట్లకు గ్రీజు పూయలేదు. ఇళ్లు కోల్పోయిన వారికి ఇళ్లు కూడా కట్టించని దుర్మార్గుడు రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశాడు. ఇలాంటి సైకో పోవాలి కూటమి గెలవాలి. పేదల జీవితాల్లో మార్పు రావాలన్నా, వెలుగు రావాలన్నా.. సైకోని తరిమికొట్టాలి. జీవన ప్రమాణాలు పెరగలేదు గానీ ఖర్చులు పెరిగాయి. ఆదాయం పెరగలేదు కానీ అవస్థలు పెరిగాయి. ఇలాంటి చెత్త ముఖ్యమంత్రిని ఎప్పుడూ ఎవరూ చూసి ఉండరు. 

దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచాడు. రూ.200 ఉన్న కరెంటు బిల్లు రూ.1000 చేశాడు. ఆర్టీసీ ఛార్జీలు పెంచాడు. పెట్రోల్ డీజిల్ ధరలు, నిత్యావసరాల ధరలు చూస్తే పేదలు బెంబేలెత్తిపోతున్నారు. మద్యంలో చేస్తున్న దోపిడీ అయితే ఎంత చెప్పినా తక్కువే. గతంలో క్వార్టర్ రూ.60 ఉంటే ఇప్పుడు రూ.200 అయింది. రూ.140 ఎటు పోతోంది. పేదలకు నాసిరకమైన మద్యం పోసి, మహిళల మాంగళ్యాలు తెంచేసి, ఆ సొమ్మును తాడేపల్లి ఖజానా నింపుకుంటున్నాడు. ఇక్కడే ఒక పాపాల పెద్దిరెడ్డి ఉన్నాడు. ఒక మంత్రి, ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ ఒకే కుటుంబం నుండి ఉన్నా.. నియోజకవర్గానికి పైసా ప్రయోజనం లేదు. కానీ, ఇక్కడ బైరైటీస్ మాత్రం దిగమింగేశాడు. ఇక్కడి బైరైటీస్ గనుల్ని తవ్వి వేల కోట్లు వెనకేసుకున్నాడు. ఎర్రచందనం మొత్తాన్ని మూకుమ్మడిగా అమ్ముకున్నాడు. గతంలో ఎర్రచందనం స్మగ్లింగ్ అనే ప్రస్తావన లేకుండా నియంత్రించాం. కానీ, నేడు అధికార పార్టీ నాయకులే స్మగ్లర్లను వెనకేసుకొచ్చారు. వేల కోట్లు వెనకేసుకున్నారు. చివరికి చిత్తూరు సీటు కూడా ఒక స్మగ్లర్‌కి ఇచ్చారు. 


మద్యం, ఇసుక, గనుల్లో దోచుకున్న సొమ్ముతో మిమ్మల్ని కొనేందుకు ప్రయత్నిస్తున్నాడు. నేను అధికారంలో ఉన్నపుడు కన్నెర్రజేస్తే పెద్దిరెడ్డి బయటకొచ్చేవాడా? ఆవులాపల్లి రిజర్వాయర్ పనులు చేయకుండానే రూ.600 కోట్లు దోచేశాడు. ఎన్జీటీ రూ.100 కోట్ల ఫైన్ వేస్తే ప్రజల సొమ్ము జరిమానాగా చెల్లించారు. హంద్రీనీవా పనులు పూర్తి చేయలేదు. గాలేరు నగరికి నీరివ్వలేని సిగ్గులేని ప్రభుత్వం ఇది. హంద్రీనీవాపై గండికోట నుండి మరో ప్రాజెక్టు మంజూరు చేసి పనులు చేయలేదు. కానీ రూ.1500 కోట్ల బిల్లులు చెల్లించుకున్నారు. ఈ అంశాలన్నీ బయటకు తీసుకొచ్చినందుకు అంగల్లులో నాతో సహా 600 మంది నా కార్యకర్తలపై కేసులు పెట్టారు. మిస్టర్ పాపాల పెద్దిరెడ్డీ.. నీ పనైపోయింది. నీ కుటుంబ పాలన అంతమైపోయింది. నీ దోపిడీని అంతం పలికేందుకు కోడూరు ప్రజలు నినదిస్తున్నారు. నీ దగ్గర దోచుకున్న డబ్బులుండొచ్చు.. కానీ మా దగ్గర ప్రజాబలం ఉంది. ప్రజా బలం ముందు నీ డబ్బు మదం పనికిరాదు. ఇక్కడి ఎంపీ మిథున్ రెడ్డి పిఠాపురం వెళ్లి అక్కడ పవన్ కల్యాణ్ ని ఓడిస్తానంటున్నాడు. ఈ బచ్చా ఓడిస్తానంటే నవ్వాలా వద్దా? ఈ పుడింగి పెద్దిరెడ్డి కుప్పంలో నన్ను ఓడిస్తానంటున్నాడు. నడమంత్రపు సిరి వస్తే.. కొవ్వెక్కి ఇష్టానుసారం వ్యవహరిస్తామంటే తెలుగు దేశం కార్యకర్తలు, జనసైనికులు, బీజేపీ నేతలు చూస్తూ ఊరుకోరని గుర్తుంచుకో. పెద్దిరెడ్డి అరాచకాన్ని రాజకీయంగా భూ స్థాపితం చేయడం తధ్యం.


జగన్ రెడ్డి అనే సైకో ప్రతి ఎన్నికకూ.. ఒక సింపతీ డ్రామాతో వస్తున్నాడు. 2009లో తండ్ర చనిపోతే కనీసం బాధపడకపోగా.. ముఖ్యమంత్రి చేయమంటూ సంతకాలు సేకరించాడు. 2014లో తండ్రి లేని బిడ్డ అని ప్రజల్ని ఓట్లు అడిగాడు. 2019లో బాబాయి బాత్రూం మర్డర్‌ని అడ్డం పెట్టుకుని సింపథీ కోసం ప్రయత్నించాడు. హంతకుడెవరో తెలిసి కూడా అంతా దేవుడికే తెలియాలి అంటున్నాడు. గుండెపోటు అన్నాడు. తర్వాత నారా సుర రక్త చరిత్ర అన్నాడు. చివరికి వివేకా కుమార్తె పోస్టు మార్టం కోసం పట్టుబడితే అప్పుడు హత్య విషయం బయటికొచ్చింది. జగన్ రెడ్డి వైఖరి నచ్చక వారింట్లో వారు విభేదిస్తే దాన్ని మాకు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నాడు. సమైక్య రాష్ట్రం కోసం ముఖ్యమంత్రి పదవికి కిరణ్ కుమార్ రాజీనామా చేశాడు. కానీ, జగన్ రెడ్డి సోనియా వెంట చేరి డ్రామాలాడాడు. రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నపుడు జగన్ రెడ్డిని ఇక్కడ ఉండొద్దని తరిమేశాడు. ఇలాంటి అరాచక శక్తి వెంట ఉండొద్దని ముందే భయపడి బెంగళూరుకు తరిమేశాడు. 


ప్రజలు గెలవాలని మేమంతా కలిశాం. రైల్వే కోడూరులో తెలుగుదేశం పార్టీ గుర్తు లేకుండా ఎప్పుడూ ఎన్నికలకు వెళ్లలేదు. కానీ, ఈ రోజు కూటమి ధర్మానికి కట్టుబడి జనసేన, బీజేపీ పోటీలో ఉన్నారు. ఈ కూటమిలోని ప్రతి పార్టీ కూడా త్యాగాలు చేసింది. అది రాష్ట్రం కోసం. కానీ, ఈ జగన్ రెడ్డి చెల్లిని, తల్లిని గత ఎన్నికల్లో వాడుకుని గెంటేసి దాన్ని మాపైకి నెట్టాలని చూస్తున్నాడు. మీ ఇంట్లో జరిగే గొడవల్ని మాపైకి నెట్టి సానుభూతి పొందాలని ప్రయత్నిస్తున్నాడు. వివేకాను ఎమ్మెల్సీగా ఓడించింది జగన్ రెడ్డి, అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డి కాదా? అవినాశ్ రెడ్డికి ఎంపీ సీటు ఇవ్వొద్దని, అవసరమైతే షర్మిలకు ఇవ్వమంటే వివేకాపై దాడి చేసి చంపేశారు. సమాధానం చెప్పమని సునీత రెడ్డి ప్రశ్నిస్తుంటే మాపైకి నింద నెట్టేస్తారా? అక్క చెల్లి అవ్వ తాత అంటూ దగా చేస్తున్నాడు. భార్య మాట విని తల్లిని గెంటేసినోడు ప్రజలకు ఏం చేస్తాడు? మీ కుటుంబంలోని గొడవని రాష్ట్ర గొడవగా చిత్రీకరించాలనుకుంటే ప్రజలు సహించరు. అమాయకుడిగా మొహం పెట్టి, నేరాలు చేసే ఘరానా ముఠా నాయకుడు ఈ జగన్ రెడ్డి. 


కూటమి అధికారంలోకి రాగానే ఎర్ర స్మగ్లర్లకు బేడీలేస్తాను. చిత్తూరులో ఎర్రచందనం స్మగ్లర్‌‌కి సీటిచ్చారంటే వీరి నిబద్దత ఏంటో అర్ధం చేసుకోవాలి. బెస్తపల్లి, చెయ్యేరులో ఇసుక దోపిడీని అరికడతాం.కోడూరు వెంకటపల్లి రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేస్తాం. మామిడి, అరటి, బొప్పాయి ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తాం. వ్యవసాయ ఆధారిత పరిశ్రమల్ని ప్రోత్సహిస్తాను. గతంలో డ్రిప్ ఇరిగేషన్, మైక్రో ఇరిగేషన్, స్ప్రింక్లింగ్ అమలు చేస్తే జగన్ రడ్డి రద్దు చేశాడు. వాటిని పునరుద్దరిస్తాను. చిట్వేలి ప్రభుత్వ జూనియర్ కాలేజీ పనుల్ని పూర్తి చేస్తాను. సోమశిల లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఈ ప్రాంతంలోని చెరువులన్నీ నింపే బాధ్యత నేను తీసుకుంటాను. చెంగల్రాయుడు లాంటి సీనియర్ నాయకుడు తన సీటును త్యాగం చేశాడు. పని చేసిన ప్రతి కార్యకర్తను గౌరవించే బాధ్యత నేను తీసుకుంటాను. నియోజకవర్గ ఇంఛార్జి రూపానందరెడ్డి చేసిన త్యాగాన్ని కూడా గుర్తించి అండగా ఉంటాను. ప్రతి ఒక్క పార్టీ ఓటు ట్రాన్స్ ఫర్ కావాలి. రాజంపేట పార్లమెంటును గెలిపించుకుందాం. జిల్లాల విభజన కూడా అడ్డగోలుగా జరిగింది. రాజంపేటకు దగా చేసిన పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, రామచంద్రారెడ్డికి బుద్ధి చెప్పే రోజులు త్వరలోనే రాబోతున్నాయి. రెండు జిల్లాల్లో పెత్తనం చెలాయించేందుకు వీలుగా జిల్లాల విభజనను గందరగోలం చేశాడు. అధికారంలోకి రాగానే అన్ని వర్గాలు, ప్రాంతాల వారి అభిప్రాయాలను గౌరవిస్తూ జిల్లా సరిహద్దుల్ని మార్చేందుకు చర్యలు తీసుకుంటాను.

Comments