టీటీడీ అనుబంధ ఆలయాల్లో ఘనంగా ఉగాది వేడుకలు.

 టీటీడీ అనుబంధ ఆలయాల్లో ఘనంగా ఉగాది వేడుకలు


తిరుపతి,  ఏప్రిల్ 09 (ప్రజా అమరావతి): టీటీడీ స్థానిక ఆలయాల్లో మంగళ వారం శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం, శ్రీకోదండరామాలయంలో, శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయాల్లో ఉగాది సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో :

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఉగాది పర్వదినం సందర్భంగా మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా పాలు, పెరుగు, చందనం తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు.

అనంతరం సాయంత్రం 6 గంటలకు అమ్మవారు పుష్పపల్లకీలో ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు.

రాత్రి 8 నుంచి 8.30 గంటల వరకు పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ గోవింద రాజన్, విజిఓ శ్రీ బాలిరెడ్డి,
ఏఈఓ శ్రీ రమేష్, సూపరింటెండెంట్‌ శ్రీ మధు టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ సుభాష్, ఆలయ అర్చకులు శ్రీ బాబు స్వామి, తదితరులు పాల్గొన్నారు.

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో :

తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాల, కొలువు నిర్వహించారు. సాయంత్రం 4.30 నుండి 6 గంట‌ల వ‌ర‌కు పంచాంగ శ్రవణం, ఉగాది ఆస్థానం చేపట్టారు.

ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, సూపరింటెండెంట్‌ శ్రీ మోహన్ రావు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ ధనంజయ తదితరులు పాల్గొన్నారు.

శ్రీ కోదండరామాలయంలో :

తిరుపతి శ్రీ కోదండరామాలయంలో మ‌ధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 4 గంటల వరకు ఉగాది ఆస్థానం, పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఈ సందర్భంగా జీయర్‌ స్వామివారు మూలవర్లకు, ఉత్సవర్లకు వస్త్రసమర్పణ చేశారు.

ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, సూపరింటెండెంట్‌ శ్రీ సోమశేఖర్, తదితరులు పాల్గొన్నారు.

శ్రీనివాస‌మంగాపురం శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యంలో :

శ్రీనివాస‌మంగాపురం శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యంలో ఉద‌యం 9 నుండి 10 గంటల వరకు ఉగాది ఆస్థానం, పంచాంగ శ్రవణం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఏఈఓ శ్రీ గోపీనాథ్, సూపరింటెండెంట్‌ శ్రీ వెంకటస్వామి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Comments